ఏప్రిల్ 15న, 2014వ సంవత్సరంలో హిజ్రాలనీ, ట్రాన్స్జెండర్సునీ- మూడో జాతి(థర్డ్ జండర్)గా గుర్తించాలని సుప్రీమ్ కోర్టు చారిత్రక తీర్పిచ్చింది. లింగ మార్పిడి చేయించుకున్న వారిని(ట్రాన్స్జెండర్స్) వెనుకబడిన వర్గాలు(OBCs)గా పరిగణించాలని కూడా జస్టిస్ కె. ఎస్. రాధాక్రిష్ణన్ చెప్పారు.
ఉద్యోగాల్లో, చదువుల్లో ట్రాన్స్జెండర్లకి కోటాలు నియమించడమే కాక వారికి కీలక సదుపాయాలని కూడా అందించమనీ, విద్య, ఉపాధి రంగాల్లో సమాన అవకాశాలు కల్పించాలని, వైద్య సౌకర్యం అందుబాటులోకి తేవాలనీ కూడా సుప్రీమ్ కోర్టు ప్రభుత్వానికి ఉత్తరువులు జారీ చేసింది.
“లింగ నిర్ధారణ అన్నది సంబంధిత వ్యక్తి నిర్ణయమే“అని సుప్రీమ్ కోర్టు తీర్పు అతి ముఖ్యంగా చెప్పింది.
ఈ తీర్పు వెలివడిన వెంటనే, కేంద్ర ప్రభుత్వమే అనేకమైన అభ్యంతరాలని లేవనెత్తిందనుకోండి. వాటి గురించి వదిలేద్దాం.
కానీ యదార్థం కోర్టు తీర్పంత నాటకీయంగానూ మారతుందా అన్నదే ప్రశ్న. సుప్రీమ్ కోర్టు తీర్మానాన్నిచ్చినంతమాత్రాన్న వారి ప్రతీ సమస్యా పరిష్కరించబడిందని అర్థం కాదు. ఈ తీర్పు చట్టపరమైన ప్రధాన అవరోధాన్నైతే తొలిగించగలిసింది కానీ ఆచరణలో అయితే, పని చేసే చోట్లా మరియు చదువుకునే చోట్లా వివక్ష ఇంకా సామాన్యంగానే కొనసాగుతూనే ఉంది. దేశంలో ఉన్న అనేకమంది ట్రాన్స్జెండర్లు ఇంకా భేదభావాన్ని ఎదురుకుంటూనే ఉన్నారు.
రిజర్వ్ బ్యాంకు డైరెక్టివ్ ప్రకారం థర్డ్ జెండర్కి చెందినవాళ్ళు బ్యాంకు ఖాతాలు తెరవవచ్చు. కాకపోతే బ్యాంకులు ఎప్పుడు ఈ directive ని అమలుపరచాలా అన్న డెడ్ లైన్లేవీ నిర్దేశించబడలేదు. కొన్ని బ్యాంకుల Know Your Customer పత్రాలలో, థర్డ్ జండర్ ఆప్షన్ ఉండదు. ట్రాన్స్జెండర్లలో చాలా మంది వద్ద ఆ పత్రాలకి అవసరం అయే గుర్తింపు పత్రాలూ ఉండవు.
ఈ పత్రాలన్నీ ఉండాలంటే కనుక, సెకండరీ స్కూల్ సర్టిఫికెటో లేక రేషన్ కార్డో ఉండాలి. కానీ, కుటుంబాల్లో ఉండే వివక్షత వల్ల ట్రాన్స్జెండర్లలో చాలా మటుకు చిన్నప్పుడే ఇంటినుంచి పారిపోయినవారే అయుంటారని ఆరోవిల్లెకి చెందిన ట్రాన్స్జెండర్ ఏక్టివిస్టూ మరియు నటీ అయిన కల్కీ సుబ్రమణ్యం అంటారు. తమ గతంతో సంబంధం తెంపుకునేటందుకు వారు కొత్త పేర్లని పెట్టుకున్నందువల్ల, వారే ప్రాంతానికి చెందినవారోనన్న సంగతి నిరూపించడం కష్టం అవుతుంది.
“చట్టం మనుష్యుల ఆలోచనాధోరణిని మార్చలేదు. అది సమాజం తమ హక్కులని పొందడానికి సహాయం చేసే ఒక పరికరంగా మాత్రమే ఉపయోగపడుతుంది.” అని ఈ కేసులో, సుప్రీమ్ కోర్టుకి పిటీషను పెట్టిన లాయరయిన అంబికా రోయ్ చెప్తారు.
కానీ దూరదూరంగా ఆశాకిరణం కనిపిస్తున్నట్టే ఉంది.
ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ కథలు బయటకి వస్తున్నాయి. ఎవరూ పట్టించుకోని అంశాలతో పాటు వారు ఎదురుకుంటున్న సమస్యలూ, వారిపై కొనసాగుతున్న వివక్ష వంటి వాటినీ రచనల ద్వారా- సమాజం దృష్టికి తెచ్చిన “హమారా కహాని”, “హమారా జీవన్” అన్న హిందీ కథలూ, రేవతి అలియాస్ దొరైస్వామి రాసిన ‘ఒక హిజ్రా ఆత్మకథ’ –ఇలాంటి పుస్తకాలకి మీడియా సహకారం బాగానే అందింది.
ఇప్పటివరకూ పాస్పోర్ట్ ఫార్ముల్లో “ స్త్రీ”, పురుషుడు” అన్న ఆప్షన్లు మాత్రమే ఉండేవి. ఇప్పుడు “E” ఆప్షన్ కూడా చేర్చారన్నది అభినందకరమైనదే. కాకపోతే ఈ మూడో ఆప్షన్ అప్లికేషన్ ఫార్మ్ మీద లేదు. వెబ్సైటులో ఉన్న సూచనలలో, రహస్యంగా చొప్పించబడినట్టు కనబడుతుంది.
ఇప్పటిదాకా వీరికి దొరుకుతున్నవి ప్రభుత్వేతర ఉద్యోగాలు మాత్రమే. కానీ కొన్ని గమనింపతగ్గ మార్పులు చోటు చేసుకుంటున్నాయనిపిస్తోంది.
మానబి బందోపాధ్యాయ అన్న 50 సంవత్సరాల ట్రాన్స్జెండర్ వెస్ట్ బెంగాల్లో, క్రిష్ణానగర్ స్త్రీల కళాశాలలో ప్రిన్సిపాల్. దేశంలో ఇంత ఉన్నత విద్వత్సంబంధమైన హోదాని చేపట్టిన, ట్రాన్స్జెండర్ హక్కుల మీద పిఎచ్డీ చేసిన థర్డ్ జెండర్కి చెందిన మొట్టమొదటి వ్యక్తి.
మూడవజాతికి చెందిన పద్మిని ప్రకాశ్, లోటస్ టివి(తమిల్ సాటిలైట్ ఛానెల్)లో ప్రైమ్ టైమ్ న్యూస్ ఆంకర్గా పని చేస్తోంది. ఈమె మిస్ ట్రాన్స్జెండర్ బ్యూటీ పాజెంట్లో పాల్గొని గెలిచింది. శాస్త్రీయ నర్తకి కూడా. వీడియో చూడండి. భారతి అన్న 25 సంవత్సరాల ట్రాన్స్జెండర్- థియోలొజీలో డిగ్రీ పొంది, పాస్టరుగా పని చేస్తోంది. చర్చిల్లో నామకరణాలు చేయడానికి సహాయం చేస్తుంది. తనలాంటి ఇతరులు సామాజిక అంగీకారాన్ని పొందేలా, ఆమె కృషి చేస్తోంది. వీడియో చూడండి.
అను. సి- కర్నాటక హైకోర్టులో, మొట్టమొదటి థర్డ్ జెండర్ ఉద్యోగి.
2015 సంవత్సరం నవంబర్లో థర్డ్ జెండర్ అయిన ప్రీథికా యాష్నీని చెన్నైలో సబ్ ఇన్స్పెక్టర్గా నియమించారు. ఈమె భారతదేశంలో మొత్తమొదటి ట్రాన్స్జెండర్ ఎస్సై. కాకపొతే అది అంత సులభంగా జరగలేదు. రిక్రూట్మెంటు బోర్డు ఆమె అపాయింటుమెంటుని నిరాకరించిన తరువాత, ఆమె హైకోర్టుని ఆశ్రయించి, లింగమార్పిడి ఆపరేషన్ చేయించుకుంది. ఆ తరువాత కోర్టు ఆదేశం ప్రకారం, రిక్రూటుమెంటు బోర్డు ట్రాన్స్ జెండర్ల కోసం మూడవ వర్గాన్ని సృష్టించింది.
ఇలాంటి కొన్ని కేసులున్నాకానీ అవి ఇప్పటివరకూ అరుదైనవే.
బ్రిటిష్ కాలంలో ఏర్పరచబడిన ఐపిసి 377 ని ఏనాడో రద్దు చేసి ఉంటే కనుక, ఈ సమస్యలన్నీ ఎదురయేవే కావు.
ఇప్పుడు ట్రాన్స్జెండర్లు పెళ్ళి చేసుకోవచ్చు. పిల్లలని దత్తత తీసుకోవచ్చు. థర్డ్ జెండర్కి చెందుతారేమో అని అనుమానం కలిగిన పిల్లలని స్కూళ్ళల్లో చేర్చినప్పుడు, “ఆడపిల్ల” “మగపిల్లాడు” మరియు “మూడవ జెండరు” అన్న ఆప్షన్లు ఉన్నాయి కనుక రాబోయే తరపు “ఆడ”, “మగ” పిల్లలు వివక్షత చూపించకుండా, మూడవ జెండరుని కూడా సహజంగానే అంగీకరించగలరేమో! కానీ దీనికోసం ముందు తల్లితండ్రుల ఆలోచనా ధోరణిలో మార్పు రావాలి. అలా జరగాలంటే, సాంఘిక ప్రసార మాధ్యమం చాలా ముఖ్యమైన పాత్రని పోషించగలదు. చరిత్ర పునరావృత్తం కాకుండా ఆపగల శక్తి ఈ మాధ్యమానికే ఉంది.
తీర్పు వచ్చి రెండేళ్ళు కూడా కాలేదు. పరిస్థుతులు మారి “ఆడ”, ”మగ” కాక “మూడవ జెండరు” కూడా ఆ సమానమైన గుర్తింపే పొంది, సమాజంలో సహజంగానే ఇమిడిపోయే కాలం వస్తుందనుకుందాం.
ఇకపోతే, ఈ తరపు LGBT కమ్యూనిటీవారికి ప్రస్తుతానికి ఒక ఆశాకిరణం మాత్రం కానవచ్చింది. జనవరి 20 న, Wings Travels మరియు హమ్సఫర్ అన్న ఆర్గనైసేషన్ కలిపి, ముంబయిలో లాంచ్ చేసిన Wings Rainbow అన్న ప్రోజెక్టు 300 వందలమంది LGBT సభ్యులకి టాక్సీలు నడపడంలో శిక్షణ ఇస్తుందని ప్రకటించింది. దీనిలో ఇంచుమించు 1,500 ఓపెనింగ్సున్నాయి. ఈ ప్రణాళికని దేశవ్యాప్తంగా విస్తరిస్తామని వింగ్స్ ట్రావెల్స్కి ఫౌండర్ మరియు డైరెక్టర్ అయిన అరుణ్ ఖారత్ చెప్పారు. ఇలాంటి మరి కొన్ని ఆర్గనైసేషన్స్ ప్రారంభం అయితే కనుక, ఈ కమ్యూనిటీకి చెందిన వారి జీవనోపాధ సమస్యలకి చాలా మట్టుకు పరిష్కారం దొరుకుతుంది.
మరి కొన్ని సంస్థలు ముందడుగు వేసి ఇలాంటి ఇంకొన్ని పధకాలని రూపొందిస్తే, మూడవ జెండరుగా పరిగణించబడినవారికి ఇంక పెళ్ళిళ్ళ/పుట్టుకల తరువాత- చప్పట్లు కొట్టీ, గదమాయించీ, అల్లరి చేసీ- రెడ్ లైట్లవద్ద అడుక్కోనవసరం లేకుండా వారు తమ జీవనాన్ని సాగించగలరేమో అన్న ఆశ బలపడుతోంది.
-క్రిష్ణ వేణి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
32 Responses to కృష్ణ గీత – థర్డ్ జెండర్ -క్రిష్ణ వేణి