ఆశ్రమపు కఠిన నియమనిబంధనలను పాటిస్తూ, అంకితభావం, నిబద్ధత, సేవాతత్పరతతో, చక్కని క్రమశిక్షణతో ఆశ్రమవాసులలో ఒకరిగా ఆమె ఇమిడిపోయారు. ఆ క్రమంలో ఆమె శ్రీమతి కస్తూర్బాకు, మహాత్మాగాంధీకి కన్నబిడ్డతో సమానమయ్యారు. ఆ దంపతులకు కన్నకూతురుగా సేవలందించారు. ఆశ్రమంలో అతిధిగా ఆహ్వానించబడిన ఆమె చివరకు ఆశ్రమ సేవికయ్యారు. ఒక ప్రసిద్ధ్ద ముస్లిం రాజపుఠానా జాగీర్దార్ కుటుంబానికి చెందిన అమ్మాయి ఆశ్రమంలో చేరి అవివాహితగా జాతీయోద్యమానికి తనను తాను సమర్పించుకోవటం ఆనాడు ఊహించని సంఘటన.
అమతుస్సలాం అన్ని కష్టాలను-నష్టానలను, ఆనారోగ్యం కారణంగా ఏర్పడిన శారీరక బలహీనతలను దృఢ సంకల్పంతో అధిగమించి మహాత్ముని ప్రశంసలకు పాత్రురా లయ్యారు. మహాత్ముని ప్రియమైన పుత్రిక గా ఖ్యాతిగాంచారు. 1922లో గాంధీజీ సబర్మతీ ఆశ్రమం మూసివేశారు. ఆ సమయంలో మహాత్ముని అనుమతితో అనారోగ్యాన్ని ఏమాత్రం లెక్కచేయక ఆశ్రమంలోని ఇతర మహిళలతో ఆమె కూడా జైలు కెళ్ళారు. ఆమె జైలు నుండి విడుదల కాగానే సేవాగ్రాం వచ్చి బాపూజీకి వ్యక్తిగత సహాయ కురాలిగా బాధ్యతలు చేపట్టారు. ఆ పాత్రలో ఆమె గాంధీజీకి అత్యంత సన్నిహితంగా మెలుగుతూ అన్ని సందర్భాలలో, అన్ని పర్యటనలలో ఆయన వెంట ఉన్నారు.
బాపూజీ రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్ళిన సందర్భంగా అమతుస్సలాం తన జీవితంలోని అతి ప్రధాన నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ప్రకారంగా, స్వరాజ్య సాధనతోపాటుగా హిందూ -ముస్లింల ఐక్యత, హరిజనుల సంక్షేమం తన జీవిత లక్ష్యమని ప్రకటించారు. ఈ విషయం తెలుసుకున్న బాపూజీ ఆమెకు లేఖ రాస్తూ నీవు సేవా కార్యక్రమాల నిర్వహణకు తొందర పడవద్దు. ముందు నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో అని సూచించారు. ఆ సూచన ఆమె నిర్ణయాన్ని ప్రభావితం చేయలేకపోయింది. ఆమె నిర్దేశించుకున్న దిశగా ముందుకు సాగిపోయారు. అనారోగ్యం కూడా లెక్కచేయక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ముందుకు సాగుతున్న ఆమె కృషిని గమనించిన గాంధీజీ తన సన్నిహితులకు, మిత్రులకు రాసిన ఉత్తరాలలో అమతుస్సలాంను ప్రశంసావాక్యాలతో ముంచెత్తారు.
1944 ప్రాంతంలో ముహమ్మద్ అలీ జిన్నాను గాంధీజీని సంబోధించడంలో ఆమె ప్రధాన పాత్ర వహించారు. ఈ విషయాన్ని మౌలానా అబుల్ కలాం ఆజాద్ తన ఇండియా విన్స్ ఫ్రీడంలో పేర్కొన్నారు. ముహమ్మద్ అలీ జిన్నా ఇంటర్యూను కోరుతూ మహాత్ముడు జిన్నాకు లేఖ రాస్తున్న సందర్భంగా, జిన్నాను సంబోధించాల్సిందిగా అమతుస్సలాం గాంధీజీని సలహా ఇచ్చారు. ఆ విధంగా ఉర్దూ పత్రికలు సంబోధిస్తున్నాయని అమె ఆయనకు తెలిపారు. ఆ సలహా పరిణామాలను ఆలోచించకుండా జిన్నాను మహాత్ముడు తన లేఖలో సంబోధించటంతో జిన్నా వ్యక్తిగత ప్రతిష్ట అనూహ్యంగా పెరిగింది. అది భారత రాజకీయాలలో పెనుమార్పుకు కారణమయ్యిందని మౌలానా పేర్కొన్నారు. ఈ విధంగా అమతుస్సలాం భారతదేశ చరిత్రలోని ఓ కీలక సమయంలో తనదైన పాత్రను పోషించి చరిత్రమలుపుకు కారణమయ్యారు.
మహాత్ముని బాటన జాతీయోద్యమంలో నడిచిన బీబీ అమతుస్సలాం హిందూ, ముస్లిం ఐక్యతా చిహ్నమయ్యారు. మతకలహాలను నివారించేందుకు ఆమె నిరంతరం కృషి సల్పారు. మత ఘర్షణలు జరుగుతున్న ప్రాంతాలకు ఆమె ఎంతో సాహసంగా వెళ్ళి ఆ కల్లోలిత ప్రాంతాల ప్రజలను ఆదుకున్న ఘట్టాలు ఉన్నాయి. వాయువ్య సరిహద్దులు, సింధ్, నౌఖాళి ప్రాంతాలలో మతకలహాలు విజృంభించినప్పుడు మత సామరస్యం ప్రబోధించేందుకు తన ప్రత్యేక దూతగా గాంధీజీ ఆమెను పంపారు.
వాయువ్య సరిహద్దులలో భయంకర మత ఘర్షణలు ఉదృతంగా సాగుతున్నప్పుడు ఆ ప్రాంతాలకు ఆనేక కష్టనష్టాలకోర్చి ఆమె వెళ్ళారు. దట్టమైన అడవుల గుండా గుర్రం విూద స్వారి చేస్తూ మతకలహాల బారిన పడిన ప్రాంతాలకు వెళ్ళి అన్ని వర్గాల ప్రజానీకంతో కలసి పోయి హిందూ ముస్లింల ఐక్యతను సాధించటంలో ఆమె చూపిన తెగువ నేర్పు ప్రతి ఒక్కరి ప్రశంసలందుకుంది. సింధ్ ప్రాంతంలో మత ఘర్షణలు జరుగుతుండగా అమతుస్సలారను అక్కడకు పంపుతూ ఆయన సన్నిహితులు ఆనంద్ హింగోరికి 1940 నవంబరు 6న గాంధీజీ లేఖ రాశారు. ఆ లేఖలో, సింధ్లో జరుగుతున్న భయానక ఘర్షణలను ఆపేందుకు ఆమె ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వస్తుంది…ఆమె చాలా ధైర్యస్థురాలు, హింసాకాండను అడ్డుకునేందుకు ఆమె తన ప్రాణాలను సైతం పణంగా పెట్టగలదు అని ఆ ప్రాంతంలోని తన ఇతర పరిచయస్తులకు రాసిన ఒక లేఖలో గాంధీజీ పేర్కొన్నారు.
ఈ మేరకు మత ఘర్షణలలో భాగంగా హింస ప్రజ్వరిల్లినప్పుడల్లా,వాటిని నిరోధించేందుకు ప్రజలలో స్నేహభావాన్ని పెంపొందించి శాంతి,సామరస్యాలు కాపాడేందుకు ఆమె చేసిన కృషిని సరిహద్దు గాంధీ ఖాన్ అబ్దుల్ గఫూర్ ఖాన్ 1943లో రాసిన ఉత్తరంలో ఎంతగానో కొనియాడారు.నౌఖాళి మత కలహాలలో అక్కడ జరుగుతున్న హత్యాకాండను, హింసాత్మక వాతావరణాన్ని నివారించేందుకు మహాత్ముని ఆదేశాల మేరకు ఆమె వెళ్ళారు. అక్కడి పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు శతవిధాల ప్రయత్నించి చివరి అస్త్రంగా ఆమె సత్యాగ్రహ దీక్షను చేపట్టారు. గాంధేయవాదిగా ఆమె చేపట్టిన సత్యాగ్రహదీక్ష 20 రోజులపాటు సాగింది. ఆమెలో ఉన్న చిత్తశుద్ది, హిందూ-ముస్లింల మధ్యన ఆమె కోరుకుంటున్న ఐక్యత పట్ల ఉన్న నిబద్ధ్దతను ఆర్థంచేసుకున్న ఇరువర్గాలు మతసామరస్య వాతావరణం ఏర్పడేందుకు దోహదపడ్డాయి. ఆ తరువాత గాంధీజీ ఆక్కడకు వెళ్ళి ఆయన స్వయంగా అందించిన పళ్ళరసం సేవించి అమతుస్సలాం సత్యాగ్రహ దీక్షను విరమించారు. ఈ విధమైన సాహసోపేత కార్యక్రమాలతో గాంధీజీ నిజమైన వారసురాలుగా ఆమె ఖ్యాతిని దక్కించుకున్నారు.
స్వేచ్ఛా భారతం కోసం కలలుగన్న జాతీయోద్యమకారులు తాము కన్నకలలను భగ్నం చేస్తూ ఇండియా ముక్కలయ్యింది. ఆ విభజన కూడా మతం పేరిట సాగటంతో అమతుస్సలాం చలించి పోయారు. ఆ విఘాతం నుంచి బయట పడేలోపుగా గాంధీజీ హత్యకు గురయారయ్యారు. కన్నబిడ్డలా ఆదరించిన మార్గనిర్థేశం చేసి, అనారోగ్యపీడిత శరీరానికి మానసిక స్థైరాన్ని కలుగచేసే ఉపదేశం ఇచ్చిన మహాత్ముడు ఆకస్మికంగా అంతర్థానమయ్యేసరికి ఆమె తట్టుకోలేక పోయారు. ఆ ఆవేదన నుండి త్వరిత గతిన బయటపడి గాంధీజీ చూపిన బాటలో ప్రజల సేవకు ఆమె పూర్తిగా పునరంకితం అయ్యారు.
విభజన సమయంలో ఎదురైన భయానక పరిస్థితుల బాధితులను ఆదుకునేందుకు ఆమె బాగా శ్రమించారు. నిస్సహాయ మహిళల సమస్యను అమతుస్సలాం ప్రధానంగా స్వీకరించారు. మృదులా సారాబాయి, సుభద్రా జోషిలతో కలసి అటు పాకిస్థాన్ ఇటు ఇండియా నుండి వేరుపడిన మహిళలను తమవారున్న ప్రాంతాలకు సురక్షితంగా చేర్చటం కోసం అమితంగా శ్రమించారు. ఈ పని విూద ఆమె పలుమార్లు పాకిస్థాన్ కూడా వెళ్ళారు.
ఆ తరువాత పంజాబ్లోని రాజపూర్ గ్రామంలో తనను కన్న కూతురులా చూసుకున్న కస్తూర్బా గాంధీ పేరిట కస్తూర్బా మందిరం అను ఆశ్రమాన్ని నెలకొల్పారు. ఆశ్రమంలో మహిళలకు చేతి వృత్తులను నేర్పటం, అక్షర జ్ఞానం అందించటం తదితర కార్యక్రమాలను చేపట్టారు. నిస్సహాయులైన మహిళలు తమ కాళ్ళవిూద తాము నిలబడగలిగే ఆర్థిక బలాన్ని చేకూర్చేందుకు పలు పథకాలను రూపొందించి అమలు చేశారు.ఈ ఆశ్రమానికి సంబంధించి పలు శాఖలను ఆమె ఏర్పాటు చేశారు. అంటరానితనం విూద యుద్ధం ప్రకటించారు. దళిత జనులలో అక్షరజ్యోతులను వెలింగించేందుకు ప్రయత్నించారు. ఆశ్రమంలో కార్యకలాపాలను ఆమె తన పర్యవేక్షణలో నిర్వహిస్తూ అటు దళితుల, ఇటు మహిళల సేవలకు అంకితమయ్యారు.
సంపన్న జవిూందారీ కుటుంబం నుండి తన భాగంగా లభించిన అతి విలువైన ఆస్థిపాస్థులను కస్తూర్బా ఆశ్రమ కార్యకలాపాల నిర్వహణకు వినియోగిస్తూ హరి జనోద్దరణకు, నిస్సహాయ మహిళలకు చేయూతనివ్వటం కోసం ఎన్నో కార్యక్రమాలను, వ్యవస్థలను అమతుస్సలాం రూపొందించారు. శిశు సంక్షేమ కార్యాలయాలు, పాఠశాలలు, నర్సరీలు, ఖాదీ కార్ఖానాలు, కుటీర పరిశ్రమలు, చేతివృత్తులలో శిక్షణ ఇచ్చే శిక్షణాలయాలను స్థాపించారు.
ఈ కార్యక్రమాల వలన వేలాది అవసరార్థులకు పని లభించింది. ఎంతో మంది మంచి శిక్షణ పొంది ఆర్థిక పరిస్థితులను మెరుగుపర్చుకోవటం స్వయంగా గమనించిన ఆమె తన తల్లితండ్రుల ద్వారా లభించిన ఆస్థిపాస్థులు ఇంతమంది జీవితాల్లో వెలుగు నింపుతున్నందుకు ఎంతో సంతోషించారు.జాతి సమైక్యత, సమగ్రతలను పటిష్ట పర్చేందుకు, హిందూ ముస్లింల మధ్యన ఐక్యతా భావనలను ప్రచారం గావించేందుకు, స్నేహపూరిత వాతావరణం పటిష్టం చేయాలని సంకల్పించిన ఆమె హిందూస్థాన్ అను ఉర్దూ పత్రికను నడిపారు. ఈ పత్రిక ద్వారా గాంధేయ సిద్ధాంతం మహాత్ముని ఉపదేశాల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారకార్యక్రమంలో భాగంగా ఆమె పలు రాష్ట్రాలలో పర్యటించటం మాత్రమే కాకుండా జపాన్ లాంటి దేశాలకు కూడా వెళ్ళివచ్చారు. ఈ సందర్భంగా మాతృభాష ఉర్దూ కాకుండా పంజాబీ, ఒరియా, బెంగాలి, తెలుగు, తమిళం, ఆంగ్లం, జపానీస్ భాషలను ఆమె నేర్చుకున్నారు.
1961లో తొలిసారిగా భారత దేశం వచ్చిన ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ వెంట ఉండి ఆయనకు సేవలందచేశారు. ఆయనతోపాటు దేశవ్యాప్త పర్యటనలో పాల్గొన్నారు. 1962లో చైనాతో యుద్ధ్దం వచ్చినప్పుడు దత్త కుమారుడు సునీల్ కుమార్ సహాయంతో మన వీర జవానులకు సేవలందించారు.
(ఇంకా వుంది)
– సయ్యద్ నశీర్ అహమ్మద్
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~