ISSN 2278 – 4780
వాస్తవమైన వ్యక్తుల మధ్యగాని , ఊహాజనితమైన వ్యక్తుల మధ్య కాని లేఖ ద్వారా సంభాషణలు జరుగుతాయి . సాహిత్య సంస్కృతమైన గౌరవాన్ని కలిగిన లేఖల్ని లేఖా సాహిత్యంగా చెప్ప వచ్చు. తెలుగు సాహిత్యంలో ఉన్న ప్రక్రియలలో లేఖా సాహిత్యం ఒకటి . మిగిలిన ప్రక్రియ లాగ విస్తరించక పోయిన వచ్చిన కొద్దిపాటి సాహిత్యం లోనే అనంతమైన విషయాల్ని ఈ సాహిత్యం అందించింది . ఈ సాహిత్యం రెండు రకాలుగా వచ్చింది .
ఒకటి కవులు , రచయితలు తమ సమకాలీన రచయితలకు రాసిన లేఖలను తరవాత కాలంలో సేకరించి సంపుటాలుగా ప్రచురించారు . రెండవది లేఖా ప్రక్రియను తీసుకుని కల్పితమైన వ్యక్తికి వ్రాసినవి. దిన , వార , మాస పత్రికలలో లేఖా సాహిత్యాన్ని మనం గమనించవచ్చు . ఈ రెండు విధానాలలో మొదటిది రచయిత స్వీయానుభావాలతో ముందు రాసిన లేదా వచ్చిన లేఖలను ఆధారంగా జాబు , జవాబులు పద్దతిలో రాసినవి కనిపిస్తాయి . రెండవ పద్దతిలో ఒక వ్యక్తికి రాసినవే అయిన అవి చదివే పాఠకుడిని ఉద్దేశించి ఉంటాయి . ఏ లేఖకు ఆ లేఖే సంపూర్ణంగా ఉంటుంది . ఇటువంటి లేఖలు అప్పటి పరిస్థితులను , సందర్భాలను అనుగుణంగా లేఖలలో విషయం ప్రస్తావనకు వస్తాయి . ఈ విధంగా వచ్చిన లేఖా సాహిత్యం చాలా అరుదనే చెప్పాలి . వాటిలో అగ్రస్థానం అలంకరించదగినవి కనుపర్తి వరలక్ష్మమ్మ రాసిన “ శారద లేఖలు “ .
కనుపర్తి వరలక్ష్మమ్మ గుంటూరు జిల్లా బాపట్ల లో 1896 అక్టోబర్ 6న పాలపర్తి శేషయ్య, హనుమాయమ్మ దంపతులకు జన్మించారు . 1978 ఆగష్ట్ 13న పరమపదించారు . 1919 లో ఆంగ్లానువాదా కథ అయిన సౌదామినితో రచనలు చేయడం ప్రారంభించారు . లేడీస్ క్లబ్ , రాణి మల్లమ్మ , మహిళా మహోదయం , పునః ప్రతిష్ట వంటి నాటికలు , ‘ద్రౌపది వస్త్ర సంరక్షణ ‘ అనే ద్విపద కావ్యం , ‘సత్యా ద్రౌపది సంవాదం’’ , నాదు మాట’ మొదలైన పద్య రచనలు చేసారు . ‘నమో ఆంద్ర మాతా’ పేరుతో గేయాలు రాసారు . గాంధీ మీద దండకం కూడా రచించారు . ఇవే కాకుండా పిల్లల పాటలు , నవలలు , పిట్ట కథలు , జీవిత చరిత్రలు ,కథలు అనేక ప్రక్రియలలో రచనలు చేసారు . వరలక్ష్మమ్మ కథలు కొన్ని తమిళ , కన్నడ , హిందీ భాషలలోకి అనువాదమయ్యాయి .
‘ స్త్రీ అబల కాదు ‘ అనే వ్యాసానికి గృహ లక్ష్మి పత్రిక బంగారు పతకంతో గౌరవించింది . ప్రపంచ తెలుగు మహాసభలో సన్మానం పొందిన రచయిత్రి . మద్రాసు , విజయవాడ ఆకాశవాణి కార్యక్రమాలలో పాల్గొన్న మొదటి మహిళ వరలక్ష్మమ్మ . 1921లో విజయవాడలో గాంధీని కలిసి జాతీయోద్యమంలో పాల్గొన్నారు . “ నా జీవము ధర్మము , నా మతము నీతి , నా లక్ష్యము సతీ శ్రేయము . ఈ మూడింటిని సమర్ధించుటకే నేను కలము బూనితిని “ అని చెప్పుకున్న రచయిత్రి . బాలికల అభ్యున్నతి కోసం బాపట్లలో స్త్రీ హితైషిణి మండలిని స్థాపించి స్త్రీల కొరకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టి సమాజ సేవ చేసారు .
స్త్రీల కోసం 1928 లో కె . ఎన్ . కేసరి స్థాపించిన గృహ లక్ష్మి మాసపత్రికలో మొదటి నుండి 1950వరకు వరలక్ష్మమ్మ శారద లేఖలు ప్రచురితమయ్యాయి . శారద అనే పేరుతో ‘ కల్పలత ‘ అనే ఊహాజనిత వ్యక్తి కి రాసిన లేఖలే ఈ శారద లేఖలు . ‘ సౌభాగ్యవతియగు కల్పలతకు ‘ , ‘ నెచ్చెలీ ‘ అనే సంభోధనతో మొదలవుతాయి . ఈ లేఖలు తరవాత కాలం లో రెండు సంపుటాలుగా వెలువడ్డాయి . రెండవ సంపుటిని ఆమె భర్త హనుమంతరావుకి అంకితమిచ్చారు . ఈ లేఖలలో ఖద్దరు , జాతీయోద్యమం ,వరకట్నం , తీర్ధయాత్రలు , విదేశీ వస్తు బహిష్కరణ , వితంతువుల కష్టాలు , మూఢ నమ్మకాలు , కళారంగం , సాంఘీక , రాజికీయ విషయాలు మొదలైన విషయాలను ఈ లేఖలలో ప్రస్తావించారు . ఇవే కాకుండా స్త్రీ ల కళా నైపుణ్యం , లలిత కళలు , గృహలక్ష్మి దినోత్సవం , దుర్గాబాయి దేశ్ ముఖ్ జీవితం , ఆంధ్ర మహిళా సభల ప్రస్తావన ఈ లేఖలలో కనిపిస్తాయి .
1839 మార్చ్ 1న గృహ లక్ష్మి పత్రిక వార్షికోత్సవ సంచికలో వచ్చిన “ స్త్రీ ల కళా నైపుణ్యాన్ని ఈ లేఖ లో వివరిస్తూ కవిత్వం , గానం , చిత్ర లేఖనం , రంగవల్లులు , సుగంధ ద్రవ్యాల తయారి లలిత కళలపై ఉన్న అవగాహనను వివరించారు . అప్పటి కాలంలో స్త్రీ ల దినచర్య ను వివరించారు .
1965 జనవరి 1న రాసిన లేఖలో “ దుర్గాబాయి దేశ్ ముఖ్ “ గురించి సవివరంగా ప్రస్తావించారు . దుర్గాబాయి జననం , ఆమె ఏవిధంగా స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు , దుర్గా బాయి దేశ్ ముఖ్ 1909లో దుర్గా బాయి బెల్లూరి కృష్ణమ్మ , రామ కృష్ణా రావు దంపతులకు జన్మించారు . దుర్గాబాయి సి . డి . దేశ్ ముఖ్ ని వివాహం చేసుకున్నారు . ౧౯౨౩ లో కాకినాడ జరిగిన అఖిల భారత జాతీయ మహా సభల పాల్గొన్న ఉత్సాహంతో దుర్గా బాయి తరవాత బులుసు సాంబ మూర్తిగారి శిక్షణలో మద్రాస్ వెళ్లి అక్కడ జరిగిన సత్యాగ్రహంలో పాల్గొన్నారు . అంతేకాకుండా స్వాతంత్ర్యం వచ్చిన తరవాత పార్లమెంటు మెంబరుగా , రాజ్యంగ చట్ట నిర్మాతలలో ఒకరిగా పని చేయడం , కేంద్ర సాంఘిక సంఘాధ్యక్షురాలుగా ఆమె చేసిన సేవలను వివరించారు .
ఈ లేఖలు వ్యాసానికి దగ్గరగా ఉన్నాకాని , లేఖా ప్రక్రియ లో సాగడం వలన చదివే పాఠకుడి కి ఆసక్తిని , ఆత్రుతని కలిగిస్తాయి . ఇప్పటి వరకు వచ్చిన లేఖా సాహిత్యం లో శారదా లేఖలకు ప్రత్యేకతను కలిగి ఉన్నాయి . తెలుగులో వచ్చిన లేఖా సాహిత్యంలో రచయితలు తమ తోటి రచయితకు రాసిన లేఖలే అధికం . తరవాత కాలంలో వాటిని సంపుటాలుగా ప్రచురించారు . అయితే శారద లేఖలు వర్తమాన విషయాల పత్రికలో ప్రచురితమవుతూ ఉండేవి . ఈ లేఖలలో అప్పటి భాష గ్రాంధిక భాషలోనే రచించారు వరలక్ష్మమ్మ . అప్పటి సాంఘిక , రాజికీయ పరిస్థితులు , అప్పటి ప్రజల స్థితిగతులు తెలుస్తాయి . శారద లేఖ ద్వారా అప్పటి కాలం లోని పత్రిక భాష ఏ విధంగా ఉండేది , లేఖా రచనా నైపుణ్యం గురించిన అవగాహన కలుగుతాయి . శారద లేఖలు చదువుతుంటే అవి లేఖలే అయినప్పటికీ కల్పలత అనే ఊహాజనిత వ్యక్తికి రాసిన లేఖే అయిన చదివే పాఠకుడి కి మాత్రం తనకి రాసిన లేఖలే అన్న అనుభూతి కలుగుతుంది . అంతే కాకుండా ఈ లేఖలలో అప్పటి వర్తమాన విషయాలను ఆధారంగా చేసుకుని లేఖలు రాయడం వలన చదువరులకు మరింత దగ్గరయ్యాయి .
ప్రేమ తత్వానికి , స్నేహ శీలతకి , ,సంస్కార సౌజన్యాలకి , జీవితాంశాల వివేచనకి లేఖా సాహిత్యం ఎంతగానో ఉపయోగపడుతుంది . శత జయంతి సాహితీ మూర్తులు అనే గ్రంధంలో బూదరాజు రాధాకృష్ణ “ ఇరవయ్యో శతాబ్ది కవి పండిత ప్రపంచంలో శత జయంతి గౌరవం సంపాదించిన ఏకైక ఆంద్ర మహిళా ఆమె “ అని కీర్తించారు .
(ఆగష్ట్ 13న కనుపర్తి వరలక్ష్మమ్మ వర్ధంతి సందర్భంగా )
One Response to తెలుగు లేఖా సాహిత్యానికి అగ్రగణ్యురాలు ‘ కనుపర్తి వరలక్ష్మమ్మ’ – అరసి