భారత స్వాతంత్రోద్యమం : ముస్లిం మహిళలు

జాతీయోద్యమానికి సర్వం సమర్పించిన వితరణశీలి
ఆమనా ఖురేషి
(1905- 1967)

                           పరాయి పాలకుల నుండి దేశాన్ని విముక్తి చేయాలన్న బలమైన కాంక్ష ఆనాడు భారతీయుల మనోభావాలను బలంగా ప్రభావితం చేసింది. ఆ భావన స్వేచ్ఛ- స్వాతంత్య్రాలను సాధించేందుకు తమ  ప్రాణాలను సైతం అర్పించడానికి వెనుకాడని యువతను ఒకవైపు, మహాత్ముని ఆహింసాపథాన కష్టనష్టాలకు భయపడకుండా ముందుకు సాగిన  ప్రజలను మరోవైపు ఉద్యమ దిశగా ఉపక్రమింప చేసింది. భారతదేశం మొత్తాన్ని ఆవరించిన ఆ అద్భుత వాతావరణం విదేశాలలో ఉంటున్న భారతీయులనూ బలంగా తాకింది. మాతృభూమి పట్ల ఏర్పడిన ఆ మనోభావాలు విదేశాలలో ఉన్నవాళ్ళను కూడా అక్కడ నుండి బ్రిటీషు ప్రభుత్వం విూద పోరాటానికి పురికొల్పగా, విదేశాలలో స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నవాళ్ళను స్వదేశానికి రప్పించాయి. ఈ విధంగా  విముక్తి పోరాటంలో భాగస్వాములయ్యేందుకు స్వదేశం తిరిగివచ్చిన కుటుంబంలోని సభ్యురాలు ఆమనా ఖురేషి.

                    జాతీయోద్యమానికి సంపూర్ణ జీవితాలను, ధనసంపదలను పూర్తిగా  సమర్పిం చుకున్న కుటుంబానికి చెందిన చిన్నారి  ఆమనా ఖురేషి. ఆమె తండ్రి ఇమామ్‌ అబ్దుల్‌ ఖాదిర్‌ దక్షణాఫ్రికాలో  అరేబియా గుర్రాల వ్యాపారి. ఆయన చిన్న కుమార్తె ఆమనా.

                  దక్షణాఫ్రికాలో వర్ణ వివక్షతకు వ్యతిరేకంగా సాగిన పోరాటంలో ఇమామ్‌ ఖాదిర్‌ గాంధీజీకి క్రియాశీలక సహకారం అందించారు. లక్షలాది రూపాయల లాభాలు ఆర్జించిపెట్టే భారీ వ్యాపారాన్ని  త్యజించి బ్రిటీష్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగుతున్న పోరాటంలో భాగస్వామ్యం వహించేందుకు కుటుంబంతో సహా గాంధీజీ వెంట ఆయన ఇండియా వచ్చేయగా ఏడు సంవత్సరాల వయస్కురాలైన ఆమనా కూడా తల్లితండ్రుల వెంట  తరలివచ్చారు.

                   స్వాతంత్య్రోద్యమంలో ఆమనా ఖురేషి త్యాగమయ పాత్రను తెలుసుకునే ముందు ఆనాడు దక్షిణాఫ్రికాలో ఆమె కుటుంబ పరిస్థితులు, అక్కడ వర్ణవివక్షతకు వ్యతిరేకంగా గాంధీజీతో కలసి ఆ కుటుంబీకులు సాగించిన పోరాటం, ఆ తరువాత భారత దేశానికి రావటం, ఇక్కడ పరిస్థితులకు ఆ సంపన్న కుటుంబ సబ్యులు అలవాటైన విధానం తెలుసుకోవాల్సి ఉంది. ఈ పరిస్థితులను మహాత్మా గాంధీ ఈ క్రింది విధంగా వివరించారు.

                    దక్షణాఫ్రికాలో ఇమాం గారిల్లు ఆంగ్లేయుల పద్థతిలో నిర్మాణమైంది. ఇమాం గారి భార్య చిన్నప్పటినుండి ఆంగ్లేయ రీతిరివాజులతో కూడిన జీవితాన్ని అనుసరిస్తున వ్యక్తి. ఫాతిమా, ఆమనా వారి కుమార్తెలు. ఆంగ్లేయ పిల్లల పద్దతులలో వారిరువురి పెంపకం సాగింది. సర్వ సుఖభోగాల ఐశ్యర్యవంతమైన జీవితాన్ని త్వజించి ఫకీరు జీవితాన్ని అవలంభించటం సులభమైన పని కాదు. ఒక్కసారి దృఢసంకల్పం చేసుకున్నాక ఇమాం గారికి అది ఏమాత్రం పెద్దపని కాదు. నేను జోహన్స్‌బర్గ్‌ వదలి ఫోనిక్స్‌కు నివాసం మార్చగానే ఇమాం సాహెబ్‌ కూడా నాతోపాటుగా ఉండేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఆయన దృఢనిశ్చయం గురించి ఎరిగి ఉండి కూడా ఆయనకు ఏ విధంగా జవాబివ్వాలన్న ఆందోళన నాలో ఉండేది. జీవితంలో ఎటువంటి కష్టంనష్టం ఎరుగని వ్యక్తి అనంత ఐశ్వర్యాన్ని వదలి ఫోనిక్స్‌లో ఒక మజ్దూర్‌గా జీవితం ఎలా గడపగలరు. ఆయనకు ఫోనిక్స్‌ కఠోర జీవితం గురించి తెలిపాను. ఫోనిక్స్‌ రాడానికి విూరు స్వయంగా నిర్ణయించుకున్నట్టయితే హాజీ సాహెబా (ఇమాం గారి భార్య), కుమార్తెలు ఫాతిమా, ఆమనా సంగతేంటని ప్రశ్నించా. అందుకు సమాధానంగా ‘నాకు భగవంతుని విూద పూర్తి విశ్వాసముంది. విూరు హాజీ సాహెబాను పూర్తిగా ఎరుగరు.  నేను ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా అక్కడ ఉండేందుకు ఆమె సదా తయారుగా ఉంటారు. మన సంఘర్షణ అంతం ఎప్పుడో మనకెవరికీ తెలియదు. నా గుర్రాల వ్యాపారాన్ని నేను ఇంకా కొనసాగించ లేననుకుంటున్నాను. మరో వ్యాపారం ఆరంభించ లేను. ఒక సత్యాగ్రహి అన్ని రకాల విశ్రాంతులు, ఐశ్వర్యం, ధనసంపదల విూద కోరికలను త్యాగం చేయాలి. ‘ అని ఇమాం సాహెబ్‌ అన్నారు. ఈ సమాధానంతో నాకెంతో సంతోషం కలిగింది. నా ఫోనిక్స్‌ సహచరులకు కూడా ఈ విషయం గురించి రాశా. మా ప్రయోగాన్ని, మా నిశ్చయాన్ని వాళ్ళంతా స్వాగతించారు. ఈ విధంగా ఇమాం సాహెబ్‌ ఆయన పరివారం మా వెంట వచ్చేశారు.

                          ఫోనిక్స్‌లో ఇమాం సాహెబ్‌ మిగతా సహచరులతో సమానంగా భాగస్వామ్యం వహించారు. ఫోనిక్స్‌లో మా గృహాలు కొండ విూద ఉండేవి. ప్రతి వ్యక్తి తన వాడకం కోసం నీళ్ళను స్వయంగా కొండ దిగి వెళ్ళి కింద నుండి పైకి తెచ్చుకోవాలి. ఆ సమయంలో ఇమాం సాహెబ్‌ ఆరోగ్యం బాగాలేకున్నా ప్రతిరోజు ఉదయం పూట బక్కెట్లలో నీళ్ళుపట్టి 50 అడుగుల ఎత్తుకు మోసుకొచ్చేవారు….ఆశ్రమ నివాసులంతా యువకులుగాని యువతులు గాని, నవయువకులుగాని, వృద్ధులుగాని ఏదో ఒక పని చేయాలన్నది అనివార్యం.

                            ఇమాం సాహెబ్‌, హజీ సాహెబా, ఫాతిమా, ఆమనా ముద్రణాలయంలో పని చేసేవారు. ఇమాం సాహెబ్‌ కంపోజింగ్‌ పని నేర్చుకున్నారు. ఆయన లాంటి స్వభావంగల వృద్ధులు కంపోజింగ్‌ నేర్చుకోవడం ఆశ్చర్యకరం. ఆయన కుటుంబం మాంసాహారి. అయితే ఫోనిక్స్‌లో వారు మాంసాన్ని వండినట్టు నాకు గుర్తులేదు. అంతమాత్రాన ధార్మిక విషయాలలో ఆయనకు పట్టింపు లేదని కాదు. ఆయన నమాజ్‌ చేయకుండా ఎప్పుడూ ఉండలేదు. ఆయన పరివారం కూడా ఉపవాసం పాటించకుండా ఎప్పుడూ ఉండలేదు. ఆశ్రమవాసుల జీవనశైలిని పాటిస్తూ కూడా, ఇస్లాం ధార్మిక ఆలోచనలలోని విశాలత్వాన్ని వారు దర్శనీయం గావించారు.

                       ఇమాం సాహెబ్‌ వ్యక్తిత్వం, బలిదానం మరికొన్ని పరీక్షలకు గురికావాల్సి ఉండింది. 1914లో అసలు పరీక్ష వారి ఎదుట నిలిచింది. ఆశ్రమంలోని అత్యధికులు ఆశ్రమం వదలి భారతదేశానికి తిరిగి వెళ్ళడానికి నిర్ణయించారు. ఇమాం సాహెబాకు దక్షణాఫ్రికా స్వంత దేశమైపోయింది.  హాజీ సాహెబా, ఫాతిమా, ఆమనాలకు భారతదేశం ఏవిూ తెలియని అపరిచిత దేశం. వారికి ఏ భారతీయ భాషలో కూడా ప్రవేశం లేదు. ఆంగ్లం, డచ్‌ భాషలు తప్ప మరొక భాష వారికి తెలియని పరిస్థితి. అయినా కుటుంబ సమేతంగా  భారత దేశం వెళ్ళాలన్న నిర్ణయం తీసుకోడానికి ఇమాం సాహెబ్‌కు క్షణం పట్టలేదు. సత్యాగ్రహం, హిందూ-ముస్లింల ఐక్యతల కోసం ఆయన చేసిన మహాత్యాగమిది.

                                 సబర్మతీ ఆశ్రమంలోని ప్రతి ఒక్కరికీ ఆయన దినచర్య గురించి తెలుసు… అల్లా పట్ల అధిక శ్రద్ధాళువైన  ఆయన హృదయం స్వచ్ఛమైనది. ఆశ్రమ నియమ నిబంధనల  పట్ల ఆయన విశ్వాసం మరింత దృఢం కాసాగింది.

                           ఆ విధంగా దక్షిణాఫ్రికా నుండి భారతదేశంలోని సబర్మతి ఆశ్రమం చేరిన  ఇమాం సాహెబ్‌ కుటుంబంలోని చిన్న కుమార్తె ఆమనా. 1914లో సబర్మతి ఆశ్రమానికి వచ్చేసరికి ఆమె వయస్సు సుమారు తొమ్మిది సంవత్సరాలు. ఆమె ఆశ్రమంలో గాంధీజీ పర్యవేక్షణలో పెరిగారు. ఇమాం కుటుంబం అలనాటి సంపన్న జీవితాన్ని విస్మరించి కఠినతరమైన ఆశ్రమ జీవితం స్వీకరించింది. ఆశ్రమ వాతావరణంలో  ఆమనాకు మహాత్మా గాంధీ ప్రేమాభిమానాల తోపాటుగా ప్రముఖ జాతీయోద్యమకారుల పరిచయ భాగ్యం దక్కింది. ఆ ప్రభావం, తల్లితండ్రుల త్యాగగుణాలను సంతరించుకున్న ఆమె అతి సహజంగా జాతీయ భావాలను పుణికిపుచ్చుకున్నారు. ఆశ్రమంలో ఉంటూ జాతీయోద్యమ కార్యక్రమాలలో భాగస్వాములయ్యారు. మహాత్ముని నిర్దేశంలో ఆమె పలు బాధ్యతలను నిర్వహించారు.

                     జాతీయోద్యమంలో భాగంగా పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్న యువ ఉద్యమకారులు, గుజరాత్‌కు చెందిన గులామ్‌ రసూల్‌ ఖురేషిని ఆమనా వివాహం చేసుకున్నారు. 1924 మే 31న జరిగిన ఈ వివాహాన్ని ఇమాం సాహెబ్‌ సోదరుని హోదాలో గాంధీజీ స్వయంగా నిర్వహించారు. మహాత్ముడు అవిశ్రాంతంగా కార్యక్రమాలలో నిమగ్నమై ఉన్నా  ఆమనాకు సంబంధించిన ప్రతి విషయాన్ని గుర్తుపెట్టుకుని ఆమెకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా చూశారు. ఆమెను స్వంత బిడ్డలా పరిగణించిన మహాత్ముడు ఆప్యాయతను అందించారు.

                      భర్త గులాం రసూల్‌తోపాటుగా జాతీయోద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొని తండ్రి, భర్తలతోపాటుగా తాను జైలుకెళ్ళాలని ఆమనా ఖురేషి ఎంతగా ఆకాంక్షించినా  ఆమెకు గాంధీజీ అనుమతి అంత త్వరగా లభించలేదు. ఆశ్రమంలోని మహిళలను జైలుకెళ్ళడానికి అప్పట్లో గాంధీజీ అంగీకరించలేదు. ఆ కారణంగా తనకు అనుమతి ఇవ్వాల్సిందిగా ఆమనా పలుమార్లు గాంధీజీని బ్రతిమాడాల్సి వచ్చింది. ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు, ఆ తరువాత బాలింతగా ఉన్నప్పుడు కూడా బ్రిటీషు వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొని జైలుకు వెళ్ళడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా ఆమె గాంధీజీని పలుమార్లు కోరుతూ వచ్చారు.

                     1930లో సాగిన దండియాత్ర సందర్భంగా ఆశ్రమవాసులు కూడా  ఆ కార్యక్రమంలో  పాల్గొనాలని గాంధీజీ ఆకాంక్షించారు. ఆ యాత్రలో పాల్గొన్న ఆమనా తండ్రి ఇమాం సాహెబ్‌ను పోలీసులు నిర్బధంలోకి తీసుకున్నారు. ఆయన నిర్బంధంలో ఉండగానే ఆనారోగ్యంతో బాధపడుతూ 1931 డిసెంబరు ఒకటిన కన్నుమూశారు. అంతకు మునుపు ఆమనా తల్లి కూడా కన్నుమూయటంతో ఆమనా, ఫాతిమాలు తల్లితండ్రులను కొల్పోయిన వారయ్యారు. ఆ సమయంలో భర్త గులాం రసూల్‌ కూడా జైలు పాలయ్యారు. అప్పుడు కూడా బిడ్డతో సహా జైలుకు వెళ్ళేందుకు అనుమతివ్వమని ఆమనా ఖురేషి గాంధీజీని అర్థించారు.

                   చివరకు గుజరాత్‌లో విదేశీవస్తు బహిష్కరణ, మధ్యపాన నిషేదం కోరుతూ పికిటింగ్‌  నిర్వహణకు మహాత్మాగాంధీ గుజరాత్‌ మహిళలకు అనుమతి ఇచ్చారు. ఆ సందర్భంగా ఆయా కార్యక్రమాలలో ఆమనా ఖురేషి ఉత్సాహంగా పాల్గొనే అవకాశం లభించింది. గుజరాత్‌కు చెందిన తయ్యాబ్జీ కుటుంబానికి చెందిన రెహనా తయ్యాబ్‌ అలీ, హవిూదా తయ్యాబ్జీలతో కలసి ఆమనా ఆ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ఎన్నాళ్ళనుంచో ఎదురు చూస్తున్న అవకాశం లభించింది. ఆమనాను పోలీసులు అరెస్టు చేయగా న్యాయస్థానం మూడు మాసాల జైలుశిక్ష విధించింది.

                            ఒకవైపు భర్త అరెస్టు మరోవైపున చిన్న చిన్న బిడ్డలతో ఉంటూ కూడా ఆమనా ఖురేషి మంచి సత్యగ్రహిగా పలువురికి ఆదర్శవంతంగా నిలిచారు. ఈ విషయం తెలుసుకున్న గాంధీజీ ఆమెకు ఉత్తరం రాస్తూ, చిరంజీవి ఆమనా, నీవు చాలా ధైర్యం- సాహసం చూపావని చాలా మంది చెప్పారు, రాశారు. ఫోనిక్స్‌ మరియు సబర్మతీ ఆశ్రమంలో పెంపకం, శిక్షణ పొందిన ఇమాం సాహెబ్‌ గారి అమ్మాయి అలా కాకుండా మరెలా ప్రవర్తిస్తుంది అంటూ ఆమె ప్రవర్తన పట్ల ఆయన గర్వం వ్యక్తంచేశారు.

                      స్వాతంత్య్రసంగ్రామాన్ని అణిచివేయదలచిన బ్రిటీష్‌ ప్రభుత్వం ఉద్యమకారుల ఆస్తులను జప్తు చేయదలచింది. ఆ సయయంలో గాంధీజీ సబర్మతి ఆశ్రమాన్ని మూసివేయ నిర్ణయించారు. 1933 ఆగస్టు 1న ఆశ్రమవాసులతో పరిసర గ్రామాలలో ప్రదర్శన నిర్వహించాలని నిర్ణయించారు. ఆ ప్రదర్శన జరిగితే అరెస్టులు, జైలు శిక్షలు తథ్యం కనుక ఆ సమయంలో  జైలులో ఉన్న భర్త గులాం రసూల్‌తో ఆమనా మాట్లాడి  అనుమతి పొందారు. ఆ ప్రదర్శన జరగక ముందే ఆశ్రమవాసులందర్ని పోలీసులు అరెస్టు చేశారు. ఆ సమయంలో ఆమనా ఆశ్రమంలో లేరు. ఆమె బాపూజీ ఆదేశం మేరకు తన ముగ్గురు పిల్లలను హరిజన ఆశ్రమంలోని అనుసూయా బెన్‌ వద్ద చేర్చడానికి  వెళ్ళాల్సి వచ్చింది. ఆ కారణంగా ఆమె అరెస్టు కాలేదు. ఆశ్రమ సహచరులంతా అరెస్టయ్యి తాను అరెస్టు కాలేకపోయినందుకు ఆమనా బాధపడ్డారు.

                      సబర్మతి ఆశ్రమం నుండి వార్దా ఆశ్రమానికి రావాల్సిందిగా జమునాలాల్‌ బజాజ్‌ కోరిన విూదట గాంధీజీ ఆందుకు అంగీకరించారు. ఆ సమయంలో సబర్మతి ఆశ్రమం ను ఆయన హరిజన సంక్ష్షేమ కార్యక్రమాల నిర్వహణకు వక్ఫ్‌ చేశారు. ఆశ్రమ సహచరులకు ఆ కార్యక్రమాల నిర్వహణ అప్పజెప్పారు. ఆ సమయంలో ఆశ్రమంలోని కార్యనిర్వహణ బాధ్యతలను  ఆమనా ఖురేషి, ఆశ్రమ బయటి కార్యక్రమాలను గులాం  రసూల్‌ ఖురేషి నిర్వహించాలని గాంధీజీ ఆ దంపతులను ఆదేశించారు. మహాత్ముడి ఆదేశాల అనుసారంగా సబర్మతి ఆశ్రమంలో తన ముగ్గురు పిల్లలతో కలసి ఉండటం కాకుండా ఆశ్రమ వాసులందరికి తల్లిగా అందరి ఆవసరాల పట్ల ప్రత్యేక శ్రద్ధతో గాంధీజీ అప్పగించిన  బాధ్యతలను ఆమనా ఖురేషి  చివరి వరకు  నిర్వహించారు.

                     ఈ మేరకు స్వాతంత్య్రోద్యమంలో క్రియాశీలక పాత్ర వహిస్తున్న గులాం రసూల్‌ ఖురేషి పలుమార్లు జైలుకెళ్లినా, స్వయంగా పోలీసుల దాష్టీకానికి గురైనప్పటికీ, గాంధీజీ పర్యవేక్షణలో సంతరించుకున్న ధైర్యసాహసాలు, లక్ష్యసాధన పట్ల పట్టుదల, నిబద్దతల ఫలితంగా అన్ని కడగండ్లను ఆమె చిరునవ్వుతో భరించారు. అసాధారణ వ్యక్తిత్వం, దృఢ సంకల్పం, కార్యదక్షత, ధైర్యసాహసాల ప్రతిరూపంగా చివరి వరకు నిలచిన శ్రీమతి ఆమనా ఖురేషి 1967లో కన్నుమూశారు.

   ఆచరణాత్మక త్యాగశీలిసుగరా ఖాతూన్‌(-1968)    

                              జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాల పట్ల అత్యంత ఆసక్తి చూపటమే కాక లోతైన అధ్యయనంతో జ్ఞానపరంగా పరిణతి చెందిన మహిళలు జాతీయోద్యమంలో ఎందరో కన్పిస్తారు. అటువంటి మహిళా మేధావులలో ఒకరు శ్రీమతి సుగరా ఖాతూన్‌.
   

                 ఆనాడు నిజాం సంస్థానంలో భాగంగా ఉన్న ఉస్మానాబాద్‌లో సుగరా ఖాతూన్‌  జన్మించారు. ఆమె తల్లి సైదున్నీసా, తండ్రి సయ్యద్‌ హదీ. పదమూడు సంవత్సరాల వయస్సులో జవిూందారీ కుటుంబానికి చెందిన మహమ్మద్‌ జవిూర్‌ను ఆమె వివాహం చేసుకున్నారు. వివాహం జరిగిన ఆరు సంవత్సరాలకే భర్తను కోల్పోయి వితంతువయ్యారు. ఆ తరువాత అత్తింట తలెత్తిన ఆస్థి వివాదాల కారణంగా ఆమె ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఉంటున్న తన మేనమామ ఇంట చేరారు. 
   

                      ఆ సమయంలో ఖిలాఫత్‌, సహాయనిరాకరణ ఉద్యమం ఉధృతంగా సాగుతోంది.  ఆ వివరాలను ఆమె ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. ఉద్యమ వార్తలు ఆమెను నిలువనివ్వటం లేదు. ఆమెలోని  దేశభక్తి భావనలు ఆమెను ఊపిరి సలుపనివ్వటం లేదు. నిర్ల్లిప్తంగా కూర్చోనివ్వటంలేదు. ఆ పరిస్థితులలో ఆమె జాతీయోద్యమంలో ప్రవేశించారు. విదేశీ వస్తు బహిష్కరణ సందర్భంగా అత్యంత విలువైన తన వస్త్రాలను విసర్జించటమే కాక విదేశీ వస్తు విక్రయశాలల ఎదుట జరిగిన పికెటింగ్‌ తదితర కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఆ కార్యక్రమాలలో సరోజినీ నాయుడు, మోతీలాల్‌ నెహ్రూలతో కలసి పాల్గొని పోలీసుల లాఠీ దెబ్బలను రుచి చూశారు.
   

                        ఆమె ఉద్యమ కార్యక్రమాలలో చురుకైన భాగస్వామ్యాన్ని అందించటం, నిరంతరం ఆ కార్యకలాపాలలో మునిగితేలటం స్వజనులకు రుచించలేదు. చివరకు వస్త్రధారణ విషయంలో కూడా సంబంధీకుల నుండి  తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వచ్చింది. సౌకర్యంగా ఉంటాయన్న ఉద్దేశ్యంతో  ఆమె ఖద్దరు  చుడీదార్‌-కుర్తాలను ధరించారు. వితంతువులు అలాంటి వస్త్రధారణ చేయరాదని సాంప్రదాయవాదులు విమర్శించారు. అంగాంగ ప్రదర్శన లేని సభ్యతగల వస్త్రధారణ ఏమాత్రం అభ్యంతకరం కాదంటూ ఆ విమర్శలను ఆమె తోసిపుచ్చారు.
   

                     ఖిలాఫత్‌ నిధులకోసం ఆబాది బానో బేగం లక్నో పర్యటనకు రాగా సుగరా ఖాతూను అమెకు  ఎంతగానో సహకరించారు. ఖిలాఫత్‌ ఫండ్‌ కోసం ఆమె తన వద్దనున్న పెళ్ళినాటి 50 తులాల బంగారాన్ని, విలువైన వజ్రాలను ఆబాది బానోకు జాతీయోద్యమ నిధికి  విరాళంగా సమర్పించారు. ఈ సందర్భంగా మహిళలను ఉద్దేశించి ఆమె చక్కని ప్రసంగం చేసి సభికులను  ప్రభావితులను చేశారు. ఆ ప్రభావంతో మహిళలు ముందుకు వచ్చి భారీ ఎత్తున నిధులు సమకూర్చిన సంఘటన  ఆనాడు నగరంలో చర్చనీయాంశమయ్యింది. సుగరా ఖాతూన్‌ నిరంతర అధ్యయనశీలి. ఆమె రాసిన ఆలోచనాత్మక వ్యాసాలు, కవితలు హందర్ద్‌, జమిందార్‌, హందం లాంటి ఉర్దూ  పత్రికలలో ప్రచురితమై సంచలనం సృష్టించాయి. ఆమె నవలలు కూడా రాశారు.
   

                    సుగరా ఖాతూన్‌ క్విట్‌ ఇండియా ఉద్యమం ప్రారంభ థలో చాలా చురుగ్గా పాల్గొన్నారు. కుటుంబ సమస్యల కారణంగా ఆమె పలుమార్లు హైదరాబాద్‌ పర్యటనలు జరపాల్సిరావటంతో ఆ తరువాత జాతీయోద్యమంలో ప్రత్యేక పాత్ర నిర్వహించలేక పోయారు. భారత దేశ స్వతంత్ర భానుడు ఉదయించాక  ఆమె  హైదరాబాద్‌  నుండి లక్నో వెళ్ళిపోయారు. ఆ తరువాత జాతి పునర్నిర్మాణంలో భాగం పంచుకుంటూ, ప్రజాసేవలో నిరంతరం గడిపిన శ్రీమతి సుగరా ఖాతూన్‌ 1968 మే 10న తనువు చాలించారు.

– సయ్యద్ నశీర్ అహమ్మద్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

UncategorizedPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో