పుస్తక సమీక్ష
తెలుగు సాహితీ వనంలో ఉన్న ప్రక్రియలన్నింటిలోను కథా ప్రక్రియకు ఒక ప్రత్యేక స్థానం ఉంది . తొలి కథ మొదలైన నాటి నుండి నేటి వరకు కథ ఎన్నో రకాలుగా చదువరులను ఆకర్షిస్తుంది . ప్రస్తుత కాలంలో కాలక్షేప కథలు నుండి సమాజంలో జరుగుతున్న విషయాలు , మారుతున్న యువత ధోరణులు , సన్నగిల్లుతున్న సంబంధ బాంధవ్యాలను తీసుకుని కథలు రాసే స్థాయిలో రచయితలు , వాటిని ఆహ్వానించే విషయంలో చదువరులూ ఉన్నారు . ఈ కోవలో వచ్చిన కథలే విదేశీ కోడలు కథా సంపుటి. రచయిత కోసూరి ఉమా భారతి స్వతహాగా నాట్య కళాకారిణి అయినా నృత్యంతో పాటు సాహిత్యం లోని ప్రక్రియలను అందిపుచ్చుకోవడం హర్షించదగిన విషయం . నృత్య కళాకారులు తాము ప్రదర్శించే నృత్య రూపకాలను రూపొందించడం సహజం . కాని వాటితో బాటు ఒక అడుగు ముందుకేసి కథలుగా మలచడం అనేది అరుదనే చెప్పాలి.
విదేశీ కోడలు కథా సంపుటి లో మొత్తం 12 కథలున్నాయి . వీటిలో కొన్ని కథలు ఉత్తమ పురుషలో నడిచినవే . రచయిత ఒక పాత్రగా మారి కథను తానే స్వయంగా నడిపిస్తూ చదువరులకి మరింత దగ్గరగా తీసుకెళ్ళడం అవకాశం ఉంటుంది . రచయిత కోసూరి ఉమా భారతి అమెరికాలోని నివాసముంటున్న వారు కావడంతో అక్కడి వాతావరణం . పరిస్థితులు చుట్టూ కథలు నడిచాయి . తాను పుట్టిన దేశం , బాల్యం తాలుకు జ్ఞాపకాలు తో ఈ సంపుటిలో బహుశా మరి కొన్ని కథలు రాయడానికి ఆసరా అయ్యాయని చెప్పవచ్చును .
మొదటి కథ ‘కాఫీ టిఫిన్ తయ్యార్ ‘ నిస్వార్ధ కృషితో యితరుల గురించి ఆలోచించే కథ ఇది . కాశీ అన్నపూర్ణ పాత్ర కీలక మైనది .ఇతరుల కోసం జీవితాలలో వెలుగు నింపే వారి జీవితాలలోచివరకి చీకటి మిగులుతుండనే అపోహని అధిగమించి చేసే సేవలోనే ఆనందం సంతృప్తి తో జీవించే పాత్రలో కాశీ పాత్రని మాలిచారు రచయిత . రెండవ కథ ‘నా కోసం తిరిగి రావూ ?’ పల్లెటూరులోని ఆప్యాయతలను, అనుబంధాలను ఈ కథలో చూపించారు . ఉన్నత చదువులకై విదేశాలకు వెళ్ళిన వారు తమ ఊరి గురించి , అక్కడి వాతావరణం ఆలోచనలతో కథ నడుస్తుంది . ప్రస్తుత కాలంలో స్నేహాలు ఏవిధంగా ఉన్నాయో , అవసరానికి ఎలా వాడుకుంటారో ‘ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్ ‘ కథ లో కనిపిస్తుంది .
స్వదేశానికి దూరంగా విదేశాలలో జీవిస్తున్న ప్రవాస భారతీయుల , వారి జీవితం లోని ఒడుదుడుకులను ఈ కథలో ‘త్రిశంకు స్వర్గం ‘తెలియ జేశారు . ‘మానస పుత్రి’ ,’భారత ముని భూలోక పర్యటన’ నాట్యానికి సంబంధించిన కథలు . చదువుల కోసం దూర ప్రాంతాలకు వెళ్ళుతున్న తమ పిల్లల కోసం తల్లి దండ్రులు పడే ఆరాటం తెలియజేస్తూ కథను నడిపించారు రచయిత . మానస పుత్రి నృత్య రూపకం గా ప్రదర్శించబడటం విశేషం . అలాగే భారత ముని భూలోక పర్యటన కూడా నృత్య రూపకం గా ప్రదర్శించ దానికి అనువైనది కూడా . భర్త నిరాదారణకి సహించలేక నిన్నటి తరం మహిళ ల మనస్తత్వాలను , వారి మనో వేదనని ప్రతిబింబించే కథ ‘ తొలిపొద్దు’.
‘ముళ్ళ గులాబి’ , ‘విదేశీ కోడలు’ పెద్ద వారి మనస్తత్వాలను , మారుతున్న యువత ఆలోచనలు మద్య నడిచాయి . ఈ రెండు కథలలో పాత తరానికి , కొత్త తరానికి మధ్య వ్యత్యాసం కనిపిస్తుంది . తల్లి ఎప్పుడూ కన్నా బిడ్డల సుఖాన్నే కోరుకుటుందని , వాళ్ళ కోసం తల్లి చేసే త్యాగాన్ని తెలియజేసిన కథ ‘ అమ్మతనం అద్భుత వరం ‘ , అటువంటి అమ్మకి మనం చేస్తున్న సేవ , ఇస్తున్న విలువ ఏపాటిదో , ఆమె గొప్పతనాన్ని గ్రహించని పిల్లలున్నప్పుడు ఆమెకి సరయిన స్థానం స్వర్గమే అని చెప్పే కథ ‘అమ్మకి సరయిన స్థానం ….స్వర్గమే !’ , అయితే ప్రస్తుతం సమాజాన్ని బట్టి మనము మారాలి వాళ్లకి తగినట్టుగానే మనము ఉండాలి అని చెప్పే కథ ‘మా నాన్న పిచ్చోడు ‘.
అమెరికా వాతావరణం , పరిస్థితులకి , భారతీయుల మనస్తత్వాలకు దగ్గరగా ఈ కథల రచన సాగింది .తరానికి తరానికి మనుషుల మద్య ఆలోచనలను , సంప్రదాయాలను , విజ్ఞానాన్ని పెంచాలే కాని మనిషి మనిషికీ దూరాన్ని పెంచకూడదని ఈ కథలు చెప్పకనే చెబుతున్నాయి .
విదేశీ కోడలు – కథా సంపుటి
రచన – ఉమా భారతి కోసూరి
వెల : 150/-
నవోదయ బుక్ హౌస్ , నెం . 3-3-865,
ఆర్య సమాజ్ మందిరామ్ ఎదురుగా ,
కాచిగుడా , హైదరాబాద్ -500027
దూర వాణి : 040 – 24652487
– అరసి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
6 Responses to తరాల వారధి ‘విదేశీ కోడలు’