అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8 సందర్భంగా మహిళలు పోరాడి సాధించిన హక్కుల చట్టాల గురించి ఒక్కసారి కలబోసుకుందాం. ఈ చట్టాలల్లో ప్రధానమైనది గృహహింస నుండి మహిళల రక్షణ చట్టం.గృహహింస అన్న పదంలో అంతర్లీనంగా‘కుటుంబంలో మహిళల హక్కుల సాధన’ దాగి ఉన్నదన్న విషయాన్ని బాగా లోతుగా పరిశీలిస్తేనే పరిగణనలోకి తీసుకోగలుగుతాము.మానవ హక్కులన్నీ మగవారికే అన్న స్ధితి నుండి మహిళల హక్కులు కూడా మానవ హక్కులే అనే స్ధితి దాకా మహిళల హక్కుల సాధన ప్రస్థానం సాగింది.ప్రపంచ వ్యాప్తంగా మహిళలు గృహహింసా వ్యతిరేక ఉద్యమాలను నడిపారు.ఆ ఉద్యమాల ఫలితంగా 1946లో ఐక్యరాజ్యసమితి ఒక కమీషనును ఏర్పాటు చేసి అన్ని రంగాలలోని మహిళల స్థితిగతులపై ఒక నివేదికను రూపొందించింది. 1946లో ఈ నివేదిక రూపొందిస్తే 1979 డిశంబరు 18న మహిళల పట్ల జరుగుతున్న అన్ని రకాల వివక్షలకు వ్యతిరేకంగా ఒక ఒప్పందాన్ని ఆమోదించింది. సిఇడిఎడబ్లూ ( కన్వెన్షన్ ఆన్ఎలిమినేషన్ ఆఫ్ఆల్ ఫామ్స్ ఆఫ్ డిప్క్రిమినేషన్ ఎగైనెస్ట్ ఉమెన్ ) దీన్ని మహిళల పట్ల వివక్షలకు వ్యతిరేకంగా ఒప్పందం అంటారు.ఇందులోని 6భాగాలలో 30 దాకా నిబంధనలు ఉన్నాయి.ఏ రంగంలోనైనా మహిళల పై ఆంక్షలను, వ్యత్యాసాలను చూపితే అది లింగవివక్షే అవుతుందని ఈ ఒప్పందం నిర్వచించింది.సమానత్వం,అభ్యున్నతి, మహిళాసాధికారితకు అజెండాను రూపొందించింది.ఇందులోని అంశాలను అమలు పర్చాలనే వత్తిడి అన్ని దేశాల ప్రభుత్వాలపై పెరిగింది.దాదాపుగా 160 దేశాలు ఈ అంశాలను అంగీకరించి తమ దేశ చట్ట సభలలో వీటిని అమలు పర్చటానికి ఒప్పుకున్నాయి.అయితే ఇది అంతర్జాతీయ చట్టంగా, ఒక ఒడంబడికగా 1981 సెప్టెంబరు 3నుండి అమలులోకి వచ్చింది.చట్టాలలోని హక్కుల అమలుకు అంతర్జాతీయంగా అనేక మహిళా సదస్సులు జరిగాయి.1980`90 దాకా ఐక్యరాజ్యసమితి మహిళా దశాబ్ది సదస్సులను నిర్వహించింది.
1993లో వియన్నాలో ప్రపంచ మానవ హక్కుల సమావేశం , అలాగే 1995 బీజింగ్ అంతర్జాతీయ మహిళా సదస్సు మహిళలపై వివక్ష,హింసను నిర్మూలించే దిశగా జరిగాయి. సిఇడిఎడబ్లూలోని అంశాలను అమలు పర్చాలనే వత్తిడి అన్ని దేశాల ప్రభుత్వాలపై పెరిగింది.40, 50 సంవత్సరాల సుదీర్ఘ హక్కుల ప్రయాణంలో అంతర్జాతీయంగా గృహ హింసకు వ్యతిరేకంగా మహిళలు గొంతు విప్పి, నినదించి, పిడికిళ్ళు బిగించి నిరంతర పోరాటాన్నే జరిపారు.వీటి అన్నింటి ఫలితంగా దాదాపుగా 44 దేశాలలో గృహ హింసా వ్యతిరేక చట్టాలు వచ్చాయి.మన దేశంలో కూడా మహిళా హక్కుల సంఘాలు,ప్రజా స్వామికవాదులు సిఇడిఎడబ్లూ కు అనుగుణంగా చట్టాన్ని తేవాలని ప్రభుత్వంపై వత్తిడి తెచ్చాయి.2000-2001 సంవత్సరంలో అప్పటి మన దేశ ఆర్ధిక మంత్రి తన బడ్జట్ ఉపన్యాసంలో ఆ సంవత్సరాన్ని మహిళా సాధికార సంవత్సరంగా ప్రకటించారు.మహిళా సాధికారత అన్న పదం అప్పటి నుంచే మొదలయ్యింది. మహిళా సాధికారతను పొందటానికి 2000`2010సం..వరకు దశల వారీగా మహిళల అభివృద్ధికి సంబంధించిన అంశాలను పేర్కొనటం జరిగింది. డ్వాక్రా సంఘాలు, పొదుపు సంఘాలు, స్వయం సహాయక సంఘాలు,మహిళా గ్రూపులను పటిష్టం చేయటం,సమాజంలో, కుటుంబంలో మహిళల పట్ల వివక్షను,హింసను వ్యతిరేకించటం,ఐక్యరాజ్యసమితి సంస్కరణలు లాంటి అనేక అంశాలను పేర్కొనటం జరిగింది. ఇందులో భాగంగానే గృహహింస నుండి మహిళలకు రక్షణ చట్టం 2005 రూపొందించబడిరది.
మన రాష్ట్రంలో 2006లో గృహహింస నుండి మహిళలకు రక్షణ చట్టం అమలులోకి వచ్చింది. 2005 నుండే ఈ చట్టం గురించి అనేక సభలు, సమావేశాలు జరిగాయి. ఈ చట్టం మహిళలకు ప్రయోజనాన్ని కలిగిస్తుందని కొందరు వాదిస్తే మరి కొందరు ఇతర చట్టాల లగానే ఈ చట్టం కూడా దుర్వినియోగం అవుతుందని వాదించారు.ఈ చర్చలలో కుటుంబంలో జరిగే హింస ప్రధాన అంశంగా మొదలై కారకుడైన భర్తపై కఠిన చర్య తీసుకోవాలన్న వాదనతో ముగిసేవి.(ఈ చట్టం నుండి ఎటువంటి ప్రయోజనం ఒనగూడలేదన్న విషయం కాలక్రమంలో మన అనుభవంలోకి వచ్చినదే !) ఈ చర్చల ప్రక్రియలో పాల్గొన్న సభ్యులందరూ మరొక ప్రధాన కోణాన్ని విస్మరించేవారు.కుటుంబమంటే భార్యా భర్తలు మాత్రమే కాదు…..పిల్లలు కూడా కదా!
ఈనాడు అనేక మంది మహిళలు అత్యధికంగా కుటుంబ హింసకు లోనవుతున్నా తమకు జరుగుతున్న అన్యాయాల్ని గురించి పైకి చెప్పటానికి కూడా సిద్ధపడటం లేదు.దానికి కారణం ఒకటి ఈ చట్టాల నుండి కలిగే ప్రయోజనం తక్కువ అన్న భావన.మరొకటి ప్రధానమైనది పిల్లలు.పిల్లలకు తండ్రి కావాలి.తల్లి తండ్రుల అనురాగం కావాలి.తండ్రి హోదా కావాలి.తండ్రికి సంబంధించిన ఆర్ధిక పర అంశాలు వారికే వర్తించాలి.ఇవన్నీ పిల్లల డిమాండ్లు.ఈ డిమాండ్లన్నీ న్యాయసమ్మతమైనవే.మరి అలాంటప్పుడు మన చర్చల్లో ప్రధాన అంశమైన పిల్లలను విస్మరించి భార్యాభర్తల గొడవగానే విషయాన్ని చూడటం ఎంతవరకు సమంజసం!భార్యల్ని అనునిత్యం వేధిస్తూ హింసించే భర్తలను శిక్షించాల్సిందే తప్పదు.దీంతో పాటు పిల్లల మనోభావాల్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఈ అంశం పై చర్చించాల్సి ఉంటుంది.పిల్లలు ఖచ్చితంగా ‘ఈ తండ్రి మాకు వద్దు’ అని అంటే కఠినమైన శిక్షవిధించాల్సిందే.అలా కానప్పుడు తల్లిదండ్రులిద్దరూ తమతో ఉండాలని కోరుకుంటున్నప్పుడు ఈ అంశాన్ని నిశితంగా పరిశీలించాల్సి ఉంటుంది.
సమాజంలో అంతర్భాగమే కుటుంబం.తమ కంటె బలహీనమైన వాళ్ళను అణచి వేయటం,అణగద్రొక్కటం,వాళ్ళపై అధికారాన్ని చలాయించటం మన సమాజ లక్షణాలు.కాబట్టి మూలమైన మన సమాజాన్ని పరిగణలోకి తీసుకోవలసిందే!ఈ పురుషాధిక్య సమాజం కృత్రిమంగా నిర్మించిన స్త్రీ అణిచివేతా భావజాలం. తరాలు మారుతున్నా మారని స్త్రీ బానిసత్వ భావజాలాలు కూడా మహిళలు గృహహింసకు గురవటానికి కారణాలు.భర్త వదిలేస్తే సమాజం చిన్న చూపు చిన్న చూపు చూస్తుందేమోన్న భావన.గౌరవప్రదమైన జీవితాన్ని కోల్పోతామేమో.పిల్లల భవిష్యత్తు దెబ్బతింటుందేమోనన్న అభద్రతా భావం..చాలా కుటుంబాలలో మహిళలకు ఆర్ధిక పరమైన వెసులుబాటు, సంపాదనా ఉన్నా ఆర్దిక స్వేచ్చ లేకపోవటం.ఇవి కొన్ని కారణాలు.అయితే మహిళలను అనేక రకాలుగా,అనేక రూపాలలో గృహహింసకు గురి చేస్తుంటారు.వాటిలో కొన్ని….
* ఆమె వ్యక్తి స్వాతంత్యం మీద ఆమె క్యారెక్టరును పావుగా వాడుతూ బురదజల్లుతూ ఉంటారు.
* నలుగురి ముందు, పిల్లల ముందు చులకనగా మాట్లాడుతూ ఆమె వ్యక్తిగత గౌరవాన్ని,స్ధయిర్యాన్ని దెబ్బతీస్తారు.
* బయటి సమాజంతో సంబంధ బాంధవ్యాలను తుంచివేస్తారు.
* స్నేహితులు,బంధువులు ఇంటికి రావటాన్ని ఇష్టపడరు.
* ఆమె ఎవరితోనూ,ఆఖరికి తన పుట్టింటివారితోనైనా సరే మనసు విప్పి మాట్లాడుకునే అవకాశాన్ని ఇవ్వరు.
* బయటి సమాజంలో ఆమెకులేని స్వభావాన్ని ఆమెకు ఆపాదిస్తుంటారు.
* తమ చేష్టలతో, మాటలతో లైగిక హింసకు గురిచేస్తుంటారు.
* మానసికంగా,శారీరకంగా నిర్వీర్యపరచి తాను ఎందుకూపనికి రాదేమోనన్న ఆత్మన్యూన్యతను ఆమెకు కలిగిస్తారు.
* వ్యసనాలకు తాను బానిసై భార్యనూ బానిసను చేయాలనుకోవటం లాంటి కుటిలమైన,నీచమైన ప్రక్రియలను ప్రయోగిస్తుంటారు.
* అదనపు కట్నంకోసం హింసిస్తూ అభద్రతా భావనకు గురిచేస్తుంటారు.
గృహహింసకు గురయ్యే మహిళలు చట్టాన్ని ఆశ్రయించినా ఖచ్చితమైన ఆధారాలను చూపమంటారు.మానసిక హింసను ఆధారాలతో సహా ఎలా చూపించగలుగుతారు? సాధ్యమా? ఎక్కువశాతం మహిళలు తాగుడు వ్యసనానికి బానిసలై హింసిస్తున్నారని అంటున్నారు.మరి చట్టానికి ఇది కనపడదా? తాగుడును ప్రోత్సహిస్తూ మద్యాన్ని వీధి వీధినా ఏరులుగా పారిస్తున్న ప్రభుత్వాలు కనపడవా? సామాజిక, ఆర్దిక పరిస్దితులతో ముడిపడి ఉన్న గృహహింసను కుటుంబ సమస్యగానే చూడటం ఎంత వరకు సబబు? అని ఈనాడు అనేక మంది మహిళలు ప్రశ్నిస్తున్నారు.
సమాజంలో సమూలంగా మార్పు రానంతవరకూ చట్టాల ద్వారానో, కేసులు పెట్టటం ద్వారానో,పోలీస్టేషన్లచుట్టూ తిరగటం ద్వారానో ఈ సమస్యకు న్యాయమైన పరిష్కారం లభించదని మనకు అర్ధమయిపోయింది.సరియైన పరిష్కారాన్ని చూపగలిగినప్పుడే మహిళలు నిర్బయంగా,నిర్బీతిగా గృహహింసను ఎదుర్కొనగలుగుతారు.చట్టాలను తేవటం కాదు వాటిని సరిగా అమలయ్యేట్టు చూడాలని నేటి మహిళలు నినదిస్తున్నారు. తమ బిడ్డల భవిష్యత్తుకు ఖచ్చితమైన భరోసాను డిమాండు చేస్తున్నారు.ఉత్పత్తిలో భాగస్వామ్యం, సమాన హక్కులు, స్వేచ్ఛ కోసం మహిళలు ఉద్యమిస్తున్నారు.మనం కూడా భాగస్వాములవుదాం….పిడికిలెత్తుదాం…నినదిద్దాం…
– కవిని
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~