కాన్సెన్సుఅల్ రేపో వల్లనే రేప్ లు జరుగుతున్నాయని ఒకాయన బల్ల గుద్ది చెప్తాడు. ఒకామె పాపం స్త్రీలు పురుషులతో కలిసి పని చేయడం, వారితో కలిసిమెలిసి ఉండడం వల్లనే రేప్ లు జరుగుతున్నాయని నొక్కి వక్కాణిస్తుంది. ఆడవాళ్ళకు మొబైల్ ఫోన్లు ఇవ్వొద్దని, నలభైల్లోపు స్త్రీలసలు షాపింగ్ కు వెళ్లకూడదనీ ఏదేదో కూసేస్తున్నారు నోటికొచ్చినట్లు!
ఇవన్నీ మాట్లాడేవాళ్ళు సగటు ప్రజలనుకుంటే పొరపాటే! హర్యానా కాంగ్రెస్ నాయకుడు ధరమ్ బీర్ గోయత్, మమతా బెనర్జీ, బహుజన్ సమాజ్ పార్టీ ఎమ్ పీ రాజ్ పాల్ సైనీల స్టేట్ మెంట్స్ ఇవి! హర్యానా ముఖ్యమంత్రి ఇంకో అడుగు ముందుకేసి, స్త్రీల మానభంగాలను నివారించాలంటే వారికి పదహారేళ్ళకే పెళ్ళి చేసెయ్యాలని సూచించారు.
ఇంకొన్ని రోజుల్లో, ఆడపిల్లలు చదువుకోవడం వల్లనే మానభంగాలు జరిగే అవకాశం ఎక్కువని, బాలికలకు విద్యా హక్కును కూడా నిషేధిస్తారేమో! అప్పుడు స్వాత్ లోయలో కాల్పులకు గురైన మలాలాలు మన దేశంలో కూడా పెరిగిపోతారు. తాలిబాన్ ఆంక్షలకన్నా దారుణమైన ఆంక్షలు మనకు శాశనాలౌతాయి. ఏం చేద్దాం? ఇలాంటి రాజకీయ ద్రష్టల నోటి దురుసును, మూర్ఖత్వాన్ని ఇలాగే వదిలేద్దామా? ఇటువంటి వాళ్ళనే మళ్ళీ మళ్ళీ ఎన్నుకుందామా?
మానభంగాలకు కారణాలు, వాటికి నివారణ చర్యలు వీరు చెప్తున్నట్లుగానే చేస్తే దేశ భవిష్యత్తు ఏమిటి? చీకటి కొట్లోకి నెట్టేసి మహిళలను మానభంగాల నుండి రక్షిస్తారట! రకరకాల భారతీయ సంస్థలు, ప్రపంచ సంస్థలు జరిపిన సర్వేల్లో తేలిన నిజాలు చదివితే ఒళ్ళు జలదరిస్తుంది. భారతదేశం స్త్రీలకు క్షేమకరమైనది కాదని ప్రపంచం తేల్చేసిందంట! మహిళా భద్రతలేని దేశమని ఇహ జనరల్ నాలెడ్జ్ బిట్టుల్లో కూడా వచ్చేస్తుంది. ఏం చేద్దాం? పరిష్కారం మీ వ్యాఖ్యల్లో వినాలి!*
– విజయభాను కోటే
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
3 Responses to సమకాలీనం- భారతదేశం స్త్రీలకు భద్రత కరువైన దేశమట!!!