జాతీయోద్యమకారులను ఉత్తరాలతో ఉత్తేజపరచిన బేగం జాఫర్ అలీ ఖాన్
జాతీయోద్యమ చరిత్ర పుటలను కాస్త ఓపిగ్గా తెరిస్తే స్వాతంత్య్రోద్యమంలో భర్తలతో పాటుగా పలు త్యాగాలకు సిద్ధపడి, మాతృభూమి విముక్తికి పోరుబాటను ఎంచుకున్న తల్లులు ఎందరో మనల్ని పలకరిస్తారు. భర్త అడుగుజాడల్లో నడుస్తూ, జీవిత భాగస్వామికి సంపూర్ణ తోడ్పాటు అందచేయటం ఒకవంతైతే, బ్రిటీష్ పాలకుల కుయుక్తుల వల్ల భర్తలు నిర్వహిస్తున్న కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడిన సమయంలో, తామున్నామని రంగం విూదకు వచ్చి భర్త బాధ్యతల భారాన్ని స్వీకరించి సమర్ధవంతంగా మాత్రమేకాదు స్ఫూర్తిదాయకంగా నిర్వహించగలగటం గొప్ప విషయం. ఆ కోవకు చెందిన జాతి మహిళా రత్నాలలో ఒకరు బేగం జాఫర్ అలీఖాన్.
ప్రముఖ స్వాతంత్య్రసమరయోధులు మౌల్వీ జాఫర్ అలీఖాన్ సతీమణి బేగం జాఫర్ అలీఖాన్. భర్త జాఫర్ అలీఖాన్ పేరుతో ఆమె ప్రసిద్ధిచెందారు. 1904లో జాఫర్ అలీఖాన్ తండ్రి మున్షీ సిరాజుద్దీన్ ప్రారంభించిన ఉర్దూ పత్రిక జవిూందార్ సంపాదకత్వాన్ని 1909లో చేపట్టి, బ్రిటీష్ పాలకులకు వ్యతిరేకంగా దానిని బలమైన అస్త్రంగా తీర్చిదిద్దారు. బ్రిటీష్ వలసపాలకుల దాష్టీకాలను, దోపిడీ విధానాలను విమర్శిస్తూ జవిూందార్ పత్రిక ద్వారా ప్రజలలో బ్రిటీష్ వ్యతిరేకతను చాలా బలమైన ప్రచారంగావించారు. బ్రిటీష్ ప్రభుత్వం అకృత్యాల విూద జాఫర్ అలీఖాన్ అక్షరాగ్నులను కురిపించారు. బ్రిటీష్ వ్యతిరేక పత్రిక జవిూందార్ గొంతు నొక్కేయడానికి పలు విధాల ప్రయత్నించిన ప్రభుత్వం చివరకు జవిూందార్ పత్రికను, ఆ పత్రిక సంపాదకులు మౌల్వీ జాఫర్ అలీని శత్రువుగా పరిగణించింది.
ఆ కారణంగా జాఫర్ అలీఖాన్ పలుసార్లు జైలుకు వెళ్ళవలసి వచ్చింది. ఆయన నగర బహిష్కరణకు గురయ్యారు. లాఠీ దెబ్బలు రుచిచూశారు. బ్రిటీష్ అధికారులు ఎంత క్రూరంగా వ్యవహరించినా, మౌల్వీ మాత్రం ప్రభుత్వానికి తలవంచలేదు. మార్గం మార్చుకోలేదు. జవిూందార్ పత్రికను జాతీయోద్యమానికి ప్రాణంగా తీర్చిదిద్దారు. ప్రజలలో పోరాట స్ఫూర్తిని రగిలించారు. ఆనాటి పత్రికలలో జవిూందార్ పత్రిక ఉత్తమశ్రేణి ఉర్దూ పత్రికగా ఖ్యాతిగాంచింది. ఆ కృషి ఫలితంగా జాతీయోద్యమ చరిత్రలో మౌల్వీ జాఫర్ అలీఖాన్కు ప్రత్యేకస్థానం లభించింది.
ఆంగ్లేయ ప్రభుత్వం ఆయన పట్ల కినుక వహించింది. ఆయనకు వ్యతిరేకంగా పోలీసు అధికారులు సృష్టిస్తున్న భయానక పరిస్థితులను అధిగమిస్తూ మౌల్వీ జాఫర్ అలీఖాన్ మున్ముందుకు సాగారు. బేగం జాఫర్ అలీఖాన్ కూడా ఆ బాటలో నడిచారు. ప్రజల పక్షం వహించిన కలంవీరుడు జాఫర్ అలీఖాన్ జీవిత భాగస్వామి గా ఆమె అత్యవసర పరిస్థితులలో ప్రత్యేక పాత్ర నిర్వహించి చరిత్ర సృష్టించారు.
బ్రిటీష్ ప్రభుత్వం మౌల్వీ జాఫర్ అలీఖాన్ను 1920లో అరెస్టు చేసింది. ఆయనను అష్టదిగ్బంధనం చేయడానికి అసత్య ఆరోపణలతో పకడ్బందీగా కేసును నమోదు చేసింది. ఈ వాతావరణాన్ని గమనించిన ప్రజలు, ఉద్యమకారులు వ్యధ చెందారు. మౌల్వీ జాఫర్ అలీ ఖాన్ గురించి, జవిూందార్ పత్రిక భవిష్యత్తుగురించి ఆందోళన వ్యక్తం కాసాగింది. ఆ సమయంలో నేనున్నా..నేనున్నా నంటూ బేగం జాఫర్ అలీఖాన్ రంగం విూదకు వచ్చారు. జవిూందార్ పత్రిక ప్రచురణ బాధ్యతలను ఆమె స్వీకరించారు.
భారతావని నలుచెరుగులా ఉవ్వెత్తున ఎగసిపడుతున్న ఖిలాఫత్-సహాయ నిరాకరణ ఉద్యమకారులను, ప్రజలను, జవిూందార్ పాఠకులను ఉత్తేజపర్చుతూ, ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటన ఎంతో చారిత్రక ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆ ప్రకటన ప్రజలలో జాతీయ భావాలను ప్రజ్వరిల్లచేసి, ఎటువంటి త్యాగాలకైనా వారిని సిద్ధపడేట్టుగా కార్యోన్ముఖులను చేసి, ఖిలాఫత్ ఉద్యమచరిత్రలో ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ ప్రకటనలో, నా భర్త మాట, రాత ద్వారా ఎటువంటి అపరాధం చేయలేదు… ఆయన కార్యక్రమాల గురించి, ఆయన లక్ష్యం గురించి, ఆ లక్ష్య సాధనా మార్గం గురించి నాకంటే బాగా ఎరిగిన వారుండరు.. నేరం చేయనివారు నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు…. ఆయనకు నేనొక సలహా ఇచ్చాను. బ్రిటీష్ న్యాయస్థానం ఎటువంటి శిక్షనైనా విధించనివ్వండి, అది జైలు శిక్ష, బహిష్కరణ, జీవిత ఖైదు, ద్వీపాంతరవాసం, చివరకు ఉరిశిక్ష అయినా కానివ్వండి, తల వంచాల్సిన అవసరం లేదన్నాను… భగవంతుని మార్గాన, మహమ్మద్ ప్రవక్త చూపిన బాటలో ఎంతటి త్యాగానికైనా సిద్ధం కావాలి. పరీక్షాకాలం చాలా కఠినంగా ఉంటుంది. భగవంతుడి కరుణతో అన్ని అవరోధాలు తొలిగి పోతాయి…భారతదేశంలో సోదర-సోదరీమణులంతా ఖిలాఫత్-సహాయనిరాకరణ ఉద్యమం కోసం ఉద్యమించి, ప్రభుత్వం అనుసరిస్తున్న అణిచివేత విధానాలను వ్యతిరేకించాలి..ఖిలాఫత్ ఉద్యమం ప్రతి ఒక్కరి నుండి అత్నున్నత స్థాయి అర్పణను ఆశిస్తుంది. ఈ ధర్మపోరాటంలో ప్రతి ముస్లిం ధనమాన ప్రాణాలు అర్పించేందుకు సర్వదా సిద్ధ్దంగా ఉండాల్సిన సమయమిది. అంతా కలసి రండి. భగవంతుని అనుగ్రహంతో ఖిలాఫత్ను కాపాడుకుందాం, అంటూ ఆమె పిలుపునిచ్చారు. ఈ పిలుపును 1920 సెప్టెంబరు 24నాటి జవిూందార్ పత్రిక ప్రచురించింది.
బేగం జాఫర్ అలీఖాన్ వ్యక్తంచేసిన దేశభక్తి భావనలు, బ్రిటీష్ ప్రభుత్వం పట్ల వెల్లడించిన అభిప్రాయాలు, బ్రిటీష్ న్యాయస్థానం ఎదుట తలవంచవద్దని, అవసరమైతే జాతిజనుల లక్ష్య సాధన కోసం ప్రాణత్యాగానికి కూడ సిద్ధపడమని భర్తను కోరటం ద్వారా జాతీయోద్యమం-ఖిలాఫత్ పోరాటాల పట్ల ఆమెకున్న దృఢమైన అభిప్రాయం ప్రజలను ఉత్తేజితుల్ని చేసింది. ఈ ప్రకటనలోని వాక్యాలు ఖిలాఫత్ కార్యకర్తలకు, నేతలకు ప్రాణపదమైనాయి.
పరదాల చాటున కుటుంబ జీవనం సాగించే మహిళలలో త్యాగమయ జాతీయ భావనలు ఈ విధంగా స్పష్టం కావటం ప్రజలను ఆశ్చర్యచకితుల్ని చేసింది. ఆమె పిలుపు ఖిలాఫత్ ఉద్యమానికి కొత్త బలాన్ని సమకూర్చి పెట్టింది. ఆమె త్యాగనిరతి, దృఢనిశ్చయం, ఖిలాఫత్ ఉద్యమం పట్ల ఆమె వ్యక్తంచేసిన నిబద్ధతను గమనించిన ఖిలాఫత్ నాయకులు ఖిలాఫత్ కమిటీలో ఆమెకు ప్రత్యేక స్థానం కల్పించి గౌరవించారు.
ఆ తరువాత 1920 అక్టోబరు15న బేగం జాఫర్ అలీఖాన్ మరొక ప్రకటన జారీ చేసారు. ఈ ప్రకటన ద్వారా ఆమెలో నిబిడీకృతమైన ధైర్యసాహసాలు చాలా స్పష్టంగా బహిర్గతమయ్యాయి. జవిూందార్ లో ప్రచురితమైన ఆ ప్రకటనలో, పాలకులు ప్రజలకు వ్యతిరేకంగా అన్యాయాలకు, అక్రమాలకు పాల్పడుతూ నియంతల్లా వ్యవహరిస్తుంటే,జనసముదాయాలన్నీ ఏకమై నియంతృత్వశక్తుల విూద విరుచుకుపడాలి…వినాశన మార్గం నుండి మంచి మార్గం వైపుకు పాలకవర్గాలు మళ్ళేంతవరకు ఉద్యమాలు ఉధృతంగా సాగాలి. అంతిమంగా ప్రజలు విజయం సాధిస్తారు. ..మన మాతృభూమి భవిష్యత్తు దృష్ట్యా, మన గౌరవాన్ని కాపాడేందుకు ఈ గడ్డవిూది ప్రతి హిందూ-ముస్లిం ఈనాడు భుజం భుజం కలిపి పోరాడాల్సిన బాధ్యత ఉంది. సహాయనిరాకరణ ద్వారా దుష్టపాలకులను నిస్సహాయులనుచేయాలి. ఈ దేశంలోని ప్రతి ఒక్కరూ సహాయ నిరాకరణ చేపట్టినట్టయితే, ఈ దేశం సమస్యలు, ఖిలాఫత్ సమస్య పరిష్కారమైపోతాయి…స్వదేశీ ఉద్యమ ఫలితాలను గమనించండి. మనమంతా విదేశీ వస్తువుల బహిష్కరణను ఉద్యమంగా కొనసాగిస్తే సత్ఫలితాలను పొందగలం…ఈ రోజు నుంచి నేను విదేశీ వస్తువులను, బట్టలను త్యజిస్తున్నాను. నా ప్రాణం పోయినా విదేశీయత నా దేహాన్ని ముట్టుకోనివ్వను. భారత దేశంలో తయారైన బట్టలను, వస్తువులను మాత్రమే వాడుతానని ప్రమాణం చేస్తున్నాను., అని ఆమె పేర్కొన్నారు.
ఈ మేరకు ఆమె చేసిన ఆ ప్రమాణానికి బేగం జీవితపర్యంతం కట్టుబడి ఉన్నారు. మౌల్వీ జాఫర్ అలీఖాన్ వెంట ఆమె నిరంతరం నీడలా ఉంటూ స్వాతంత్య్రోద్యమంలో బేగం జాఫర్ అలీఖాన్ తనదైన భాగస్వామ్యాన్ని అందించి కృతార్థ్ధులయ్యారు.
విదేశీ వస్తు బహిష్కరణ ఉద్యమకారిణి ఇస్మత్ ఆరా బేగం
మాతృభూమి విముక్తి పోరాటం పట్ల నిబద్దత, కార్యచరణలో నిజాయితి గల నేతల చర్యలు ఆనాడు ప్రజలను బాగా ప్రభావితం చేశాయి. ఆ ప్రభావంలో పడ్డ ప్రజలు తమ సర్వం త్యాగం చేయడానికి, ఉద్యమబాట నడిచేందుకు ఏ మాత్రం వెనుకాడలేదు. ఆ విధంగా ఉద్యమకారులను ఉత్తేజితులను చేస్తూ ఉద్యమించిన యువతులలో ఒకరు ఇస్మత్ ఆరా బేగం.
ఆమె ప్రముఖ జాతీయోద్యమ నాయకులు, లక్నోలోని ప్రసిద్థ వైద్యులు హకీం అబ్దుల్ మేనకోడలు. ఖిలాఫత్ ఉద్యమం సందర్బంగా అలీ సోదరులు విరాళాల కోసం లక్నో వచ్చారు. ఖిలాఫత్ ఉద్యమం కోసం విరాళాలు అందిచమని ఆ నేతలు కోరగా ప్రజలు బాగా స్పందించారు. అక్కడిక్కడే మహిళలు తమ వంటి విూదున్న ఆభరణాలను వారికి అందచేశారు. ఆ దృశ్యం హకీం అబ్దుల్ను కదలించి వేసింది.
ఆయన బిరబిరా ఇంటికి వచ్చారు. ఇస్మత్ ఆరాను పిలిచి విషయం చెప్పారు. ఆ వివరాలు తెలుసుకున్న ఆమె తమ ఇంటిలోని మహిళలందర్ని సమావేశపర్చి ఖిలాఫత్- సహాయ నిరాకరణ ఉద్యమ కార్యాచరణ తమ ఇంటి నుండి ఆరంభించాలన్నారు. అలీ సోదరుల తల్లి బీబి అమ్మతో కలసి, మాతృదేశ సేవలో పునీతం కావల్సిన అవసరాన్ని ఉత్తేజపూరితంగా వివరించారు.
ఆ ప్రసంగంతో ఉత్తేజితులైన ఇస్మత్ అరా కుటుంబీకులు సర్వం త్యాగం చేయడానికి ముందుకు వచ్చారు. ఆమె ముందుగా తన పెండ్లినాటి ఖరీదైన ఆభరణాలన్నింటిని తెచ్చి గుట్టగా పోసి బీబీ అమ్మకు విరాళంగా అందజేశారు. ఆ తరువాత పుట్టింటి వారు సారెగా పంపిన అతి ఖరీదైన విదేశీ వస్త్రాలన్నిటిని తెచ్చి పోగేసి స్వయంగా తగులబెట్టారు. ఆమెను కుటుంబీకులంతా అనుసరించారు. వారితో ఇరుగుపొరుగు జత కలవటంతో ఆ ఇంట విదేశీ వస్త్రాల దహనం జరిగింది. ఆ చర్యతో విదేశీవస్తు బహిష్కరణ ఉద్యమకారిణిగా ఇస్మత్ ఆరా బేగం లక్నోలో అందరికి ఆదర్శంగా నిలిచారు.
– సయ్యద్ నశీర్ అహమ్మద్
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`
41