అతను మూడీగా వున్నాడు. రాత్రి నుండి అలాగే వున్నాడు. అత్తగారు, మామగారు కూడా వచ్చే ముందు చెప్పినా ముఖం అదోలా పెట్టుకున్నారు. ఎందుకిలా వున్నారు వీళ్లు? అనుకుంది మనసులో..
“ఎప్పుడూ నీ బాగేనా! నాకంటూ ఇంకేమీ వుండవా! నేనిప్పుడు మా సుపీరియర్ ఇస్తున్న పార్టీకి అటెండ్ కావాలి” అన్నాడు జయంత్.
“మీ సుపీరియర్ తో ఈ ఫంక్షన్ వుందని చెప్పుకుంటే సరిపోతుంది. ఇది మన పర్సనల్ కదా!” అంది.
భర్త చేయి పట్టుకుంది నచ్చచెబుతున్నట్లుగా.
అతనామె చేయిని నెమ్మదిగా తొలగించి “మన కాదు. నీ పర్సనల్. ఇంకెప్పుడూ ఇలాంటి వాటిని మన పర్సనల్ అనకు. అదేదో తీసుకోగానే త్వరగా ఇంటికి వెళ్లు. నేను రావటానికి ఆలస్యం అవుతుంది” అంటూ ఇంకేం మాట్లాడకుండా బైక్ స్టార్ట్ చేసి వెళ్లిపోయాడు.
అతనలా వెళ్లగానే ఆమెకోసం కాచుకొని వున్న కొందరు అభిమానులు తమ అభిమానధనాన్ని ఆమె పై కురిపిస్తూ ఆమె చుట్టూ చేరారు.
ఆమెకు తన మాట విని లోపలికి రాని భర్త గుర్తొస్తున్నా, ఆ అభిమానుల ప్రేమను మనస్పూర్తిగా ఆస్వాదిస్తోంది. ఆమెతోపాటే వాళ్లు లోపలకి నడిచారు. అప్పటికే చాలామంది ప్రేక్షకులతో హాలంతా నిండి వుంది. ప్రేక్షకుల్లో కూర్చుని సంలేఖ కోసం ఎదురుచూస్తున్న దిలీప్, హస్విత సంలేఖను చూడగానే నవ్వుతూ లేచి నిలబడ్డారు.
హస్విత సంలేఖను హగ్ చేసుకొని వదిలింది.
అంతలో హడావుడిగా సంలేఖను అప్పుడే చూసినట్లు కొందరు సభా నిర్వాహకులు వచ్చి ఆమె కోసం రిజర్వ్ చేసిన సీటు దగ్గరికి తీసికెళ్లి గౌరవపూర్వకంగా కూర్చోబెట్టారు.
అక్కడ తనకి వున్న ప్రత్యేకతను చూసి ఆమె గర్వపడలేదు. ఆత్మ తృప్తితో చూస్తోంది.
ఆ సభా ప్రాంగణం నిండా అభిమానులు, సాహిత్యకారులు, సాహితీప్రియులు, ఆ సిటీవాసులే కాక బయట నుండి వచ్చిన ప్రముఖులు వున్నారు. ఒక్క జయంత్ తప్ప.
తండ్రికి ఆరోగ్యం బాగాలేక రాలేనన్నాడు. రాలేకపోతున్నందుకు చాలా బాధపడ్డాడు. తిలక్ కి కాల్ చేస్తే ‘నాట్ రీచబుల్‘ అని వచ్చింది. తల్లి, రాజారాం అన్నయ్య, వినీల తమ హర్షాన్ని వ్యక్తం చేశారు. వాళ్లలా సంతోషపడుతుంటే ఇలాంటి అవార్డులు ఇంకా తీసుకోవాలని, ఇంకా మంచి రచనలు చెయ్యాలని మనసులో అనుకుంది.
జ్యోతి ప్రజ్వలనానంతరం అధ్యక్షులవారి తొలి పలుకులతో సభ ప్రారంభమైంది. ముఖ్య అతిధులు ఆ సందర్భాన్ని బట్టి వారి అభిప్రాయాలను తెలియజేశారు.
ఆనాటి జాతీయ పురస్కార గ్రహీత అయిన ప్రముఖ రచయిత్రి సంలేఖ గారి గురించి ఆ సంస్థ చైర్మన్ మాట్లాడారు. ఆయన స్వతహాగా సాహితీ పిపాసవున్న సాహితీ ప్రియులు కావడంతో ఆమె నవలలోని ప్రత్యేకతను చాలా సునిశితంగా వివరించారు. ఆమె ప్రతి నవల సామాజిక స్పృహతో జీవితాన్ని పరిశీలించి రాసిందే అన్నారు. సమస్యలను, మానసిక సంఘర్షణలను, కనుమరుగవుతున్న మానవ సంబంధాలను ప్రధానంగా తీసుకుని చాలా ఉద్వేగభరితంగా రాశారన్నారు. ప్రస్తుతం ఆమె రాసిన ఏ నవల చూసినా విశిష్టమైన ఇతివృత్తంతో, తేలికైన భాషతో, చదివించే శైలితో, అద్భుతమైన శిల్పంతో, సజీవమైన పాత్రలతో సాగి గొప్ప సెన్సేషన్ సృష్టిస్తున్నాయన్నారు.
ఇంత చిన్న వయసులోనే ఆమెలో కన్పిస్తున్న ప్రతిభను చూస్తుంటే ఎప్పటికైనా ఆమె ఆచంద్రార్కం భాసిల్లేవారి జాబితాలోకి చేరుతుందని అన్నారు. ఎందుకంటే వివిధ రంగాల్లో నిష్ణాతులు, దార్శనికులు, పోరాటయోధులు, కళాకారులు, రచయితలు, అసామాన్యులుగా ఎదిగిన సామాన్యులు, మహా సామ్రాజ్యాలను నిర్మించిన మట్టిలో మాణిక్యాలు ఇలా చిన్న వయసు నుండి కృషి చేసినవాళ్లే. సమాజానికి ఉపయోగపడినవాళ్లే. సంలేఖగారు ఎప్పటికీ ఇలాగే తన రచనా సృష్టిని సాగిస్తూ పాఠకులతో, సాహితీవేత్తలతో, తోటి రచయితలతో, విమర్శకులతో సత్సంబంధాలు కలిగి వుండాలని ఆశిస్తూ ముగిస్తున్నాను” అని ఆయన కూర్చున్నారు.
కరతాళ ధ్వనులతో ఆడిటోరియం మారుమోగింది.
-అంగులూరి అంజనీదేవి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~