ISSN – 2278 – 4278

భోజన్న
శ్రమ శక్తి మానవ జీవితాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకుపోతుంది. ఈ శ్రమ చేతనే సమాజంలో కులాలు పుట్టుకొచ్చాయి. నిరంతరం శ్రమ చేసే శ్రామికుడి కంటే, ఆ శ్రమను వాడుకునే వారే ఈ రోజుల్లో ఆనందాలతో తులతూగుతున్నారు. మన ప్రాచీన చరిత్రను జాగ్రత్తగా గమనిస్తే శ్రమ చేసే వారు శ్రమజీవులు, వీరు ఎప్పుడు శ్రమనే నమ్ముకున్నారు. మరికొందరు బుద్ధి జీవులు వీరు వారి శ్రమను దొంగిలిస్తునారు. చెమటోడ్చిన వారు పూరి గుడిసెలో జీవిస్తుంటే, ఆ శ్రమను దొంగలించిన వారు మేడల్లో, మిద్దెల్లో ఆనందంగా జీవిస్తున్నారు.
శ్రమ అనగానే కొన్ని కులాలు, కొన్ని తెగలు మాత్రమే వెంటనే గుర్తుకు వస్తాయి. కొన్ని తెగలు తెలియని తనంతో నేటికి సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నాయి. అందులో మాలి తెగ ఒకటి. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఒక చోట తెగగా, మరొక చోట బిసిగా, ఇంకో చోట ఓ.సిగా కనిపిస్తారు. వీరిని బారే, బరై, మట్ట తంబోలి వంటి పేర్లతో వీరిని పిలుస్తుంటారు. మీరు ఆదిలాబాద్ లోనే 3 లక్షల జనాభా ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రం మొత్తంలో దాదాపు 6 లక్షలు ఉంటారని అంచనా. జ్యోతిరావు పూలే వారసులుగా మాలీలను చెబుతారు. వీరు ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్, మహబూబ్ నగర్, మెదక్, నల్గొండ, నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లోనే కాకుండా మిగతా జిల్లాల్లో ఎస్టిలుగా గుర్తించారు. కరీంనగర్ లో ఓసీలుగా మిగతా జిల్లాల్లో బీసీలుగా కొనసాగుతున్నారు.
ప్రాచీన కాలం నుండి వీరు శ్రమ దోపిడికి గురవుతున్నారు, తోట మాలిగా, వ్యవసాయ కూలీలుగా, ప్రాంతాన్ని బట్టి జీవన విధానాన్ని ఎంచుకుంటారు. వీరు ఎంచుకున్న ప్రతి పని శ్రమతో ముడిపడి ఉంటుంది. వీరు గిరిజన తెగలతో సమానంగా పొడు వ్యవసాయం చేస్తున్నారు. కొత్తి మీర, మెంతి, కూర- గాయలు, ఆవాలు మొదలైన పంటలు పండిస్తారు. ఆడ వాళ్లు పంటలను అమ్ముకొస్తారు. వీరు ఉల్లి గడ్డలు ఎక్కువగా పండిస్తారు. చెరువులలో చేపలు పడతారు. పూల తోటలు పెంచుతారు. రోజుకు 100, 150 రూపాయలు సంపాదిస్తున్నారు. ప్రభుత్వం చేపట్టే ఇంకుడు గుంతలు, పనికి ఆహార పథకం వీరికి ఎంతో ఉపకరిస్తుంది.
బరో అనే పదాన్ని విశ్లేషిస్తే వెట్టి చాకిరి చేసే మనుషులని అర్థం. వెట్టి అనగా చేసిన పనికి ప్రతిఫలం ఇవ్వకుండా ఊడిగం చేయించుకోవడం. భారత దేశమంతటా, తెలంగాణలోనూ ఇది అధికంగా ఉండేది. నిజాం రాజుల కాలంలో దొరలు, భూస్వాములు, దేశ్ముక్ లు తక్కువ తరగతికి చెందిన తెగలను, కులాలను వెట్టి చాకిరీకి కేటాయించుకుని, వారి శ్రమను, మాన, ధన, ప్రాణాలను దోచుకున్నారు. మాలి తెగ కూడా ఉన్నతులకు వెట్టి చాకిరీ చేసిన తెగలలో ఒకటి. కాబట్టి “బరో” అనే మాటను వీరికి వాడడం కనిపిస్తుంది. వీరినే ఉల్లి గడ్డల బారో అంటారు.
పొలాల్లో ఎంత పంట పండించిన సరే 1/70 చట్ట ప్రకారం వీరికి భూమిపై హక్కు లేదు. వీరు కూలిగా లేదా కౌలు దారుగా మాత్రమే జీవితం సాగించాలి. వీరు పండించిన పంటను అమ్మడం చాలా కష్టంతో కూడుకున్న పని, దాని కోసం చాలా దూరం వెళ్ళవలసి వస్తుంది. అప్పుడు జొన్న రొట్టెలు, పెరుగు వంటి సద్ది మూటలతో ఆకలి తీర్చుకుంటారు, హోటల్ లాంటివి వీరి జీవితానికి చాలా దూరం అని చెప్పాలి.
వీరి పిల్లలు కుటుంబ పరిస్థితులు సరిగా లేనందున బడికి వెళ్లడం లేదు. చిన్న నాటి నుండే పొలం పనులకు పంపిస్తున్నారు. వీరి తెగలో బాల్య వివాహాలు ఎక్కువ అవుతుంటాయి. ఆడ పిల్లలకు సైతం పొలాల్లో, పనులకి, పశువుల కాపరులకు, చిన్న పిల్లల్ని ఆడించడానికి వీరిని ఉపయోగిస్తారు. కొన్ని ప్రాంతాల్లో ఈ తెగకు రిజర్వేషన్ లేక పాఠశాల, రేషన్ మొదలైన ప్రభుత్వ పథకాలు ఏమీ అందకుండా ఇబ్బందులు పడుతున్నారు. ఆదిలాబాదు జిల్లాలో 2001లో వేంపల్లి గ్రామంలో కుల ధ్రువీకరణ విషయంలో వివాదం తలెత్తి, వీరిని బీసీ తెగ నుండి తొలగించారు. వీరు 3 సంవత్సరాలు అన్ని రిజర్వేషన్లలకి దూరం కాబడి కోర్టుల ద్వారా మళ్లీ బీసీలో చేర్చబడ్డారు. తదనంతర కాలంలో వీరిని ST జాబితాల్లోకి తీసుకోవాలని పోరాటాలకు సిద్ధమయ్యారు.
నేటికి వీరిలో వస్తు మార్పిడి పద్ధతి అక్కడక్కడా కనిపిస్తుంది. డబ్బులు లేని కారణంగానే వారి దగ్గర వస్తువులను మరొకరికి ఇచ్చి తమకు కావలసినవి తెచ్చుకుంటారు. ఇప్పుడిప్పుడే వీరిలో కొందరు చదువులో రాణిస్తూ, అన్ని రంగాల్లో కొంత మంది కనిపిస్తున్నారు. వారికి ఇంకా ఎన్నో అభివృద్ధి పథకలు అందించాల్సిన అవసరం ఎంతో ఉంది.
మాలి తెగ భూస్వాముల దగ్గర, పరిశ్రమలలో, వ్యవసాయ క్షేత్రాలలో పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. పంటలు పండించడంలో వీరికి వీరే సాటి. ఇతర వర్గాల వ్యవసాయదారులు వీరి నుండి అనేక పద్ధతులను నేర్చుకోవచ్చు. ఆధునిక మానవులు డబ్బుచే అనేక మోసాలు, అన్యాయాలకి పాల్పడుతున్నారు. కానీ వీరి జీవితంలో డబ్బు సంబంధిత సమస్యలు లేవు, వస్తు మార్పిడిని నేటికి కొన్ని చోట్ల పాటిస్తున్నారు.
– డా.తాటికాయల భోజన్న
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~