హమ్మయ్య అని అనుకున్నంత సమయం పట్టలేదు. మామూలు పరిస్థితులకి వస్తున్నాం అని ఊపిరి తీసుకుంటున్న సమయంలో ఒక్కసారిగా అన్ని తలకిందులు అయిపోయాయి. ముందుగానే పరిశోధకులు , మేధావులు కోవిడ్ మహమ్మారి సెకండ్ వేవ్ గురించి హెచ్చరించిన కాని పట్టించుకోలేదు. ప్రపంచ పటంలో అన్ని దేశాలు కోవిడ్ నేర్పిన పాఠం నుంచి తేరుకుని అప్రమత్తంగా జీవనాన్ని సాగిస్తున్నాయి . కాని వీటికి భిన్నంగా భారత దేశం కోవిడ్ మహమ్మారి కదంబ హస్తాల్లో చిక్కుకుని అల్లాడుతుంది.
సరిగ్గా ఏడాది క్రితం ఇటలి ప్రపంచ పటంలో లేకుండా తుడిచి పెట్టుకుని పోతుంది అనే వార్త ప్రపంచంలోని అన్ని దేశాలలో వినిపించింది. అంతగా కోవిడ్ అక్కడ వ్యాప్తి చెందుతుంటే దేశాలన్ని ఇటలి వైపు చూసాయి . తమకు తోచిన సాయం అందించడానికి ముందుకు వెళ్ళాయి . కాని ఇప్పుడు అప్పటి ఇటలి కన్న ఇప్పటి మన దేశ పరిస్థితి ఒకటికి నాలుగు రెట్లు కోవిడ్ తో పోరాడుతుంది . ప్రపంచం లోని చిన్న దేశాల నుంచి అగ్ర రాజ్యాల వరకు అన్ని దేశాలు మన వైపు జాలిగా చూస్తున్నాయి . తమ వంతు సాయం చేయడానికి ముందుకు వస్తున్నాయి .
కోవిడ్ మొదటి దశలో భారత్ కోవిడ్ ని సమర్ధవంతంగా ఎదుర్కొంటుంది అని అగ్ర రాజ్యాల సైతం మెచ్చుకునేలా పోరాడిని మన దేశం యిప్పుడు ఎందుకు పరిస్థితులు ఇలా తారుమారయ్యాయి ?
ఎవరిది పొరపాటు ?
ఎవరిది తప్పు ?
ఈ నిర్లక్ష్యానికి ఫలితం ………..
కరోనా సెకండ్ వేవ్….దేశంలో కనీవినీ ఎరుగని విషాదాన్ని నింపుతోంది. ఆస్పత్రుల్లో ఒక్క బెడ్ కోసం రోగులు అలమటిస్తున్నారు. ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రపంచంలో అందరికంటే ముందే వ్యాక్సిన్ తయారు చేసుకున్నాం. దాదాపు 80 దేశాలకు కూడా వ్యాక్సిన్ను పంపించాం కానీ… ఏడాది కాలంలో కరోనాని అదుపులోకి తీసుకు రాలేకపోయాం .ఒకానొక సమయంలో మందులు, వ్యాక్సిన్, మెడికల్ ఎక్విప్మెంట్ కోసం మనదేశంపై ఆధారపడిన ఇతర దేశాలు కూడా ఇప్పుడు మనకు సాయం చేయడానికి ముందుకు వస్తుంటే దేశంలో ఏ స్థాయిలో కరోనా వ్యాప్తి చెందుతుందో అర్థమవుతోంది.
కేవలం ఆక్సీజన్ అందక ప్రాణాలు కోల్పోతున్నవారే ఎక్కువ.దేశం లో మారుమూల పల్లెటూరులు కూడా మృత్యు ఘోష తో అలమటిస్తున్నాయి. తమ వారిని కడసారి చూసుకోవడానికి కూడా ధైర్యం చేయలేని పరిస్థితులో కొట్టుమిట్టాడుతున్నారు సామాన్య ప్రజలు.
మన దేశ జనాభా ప్రకారం మే ఒకటి నుంచి 18 ఏళ్ళు వయసు ఉన్న వారి నుంచి ఆ పై వయసు వారందరికీ వాక్సిన్ ప్రక్రియ పూర్తి కావడానికి రెండు సంవత్సరాల నాలుగు నెలలు పడుతుందని ఒక అంచనా. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు రక్షణ ఎక్కడ ? మొదటి సారి కోవిడ్ వచ్చినప్పుడు ప్రజలోని భయం కాని , ప్రభుత్వలలోని బాధ్యతలు కాని ఇప్పుడు లేవు . అప్పుడు మరణాలు సంఖ్యా కూడా తక్కువే మరి ఇప్పుడు నిన్నటి తాజా నివేదిక ప్రకారం గడచినా 24 గంటల్లో 3.86 లక్షల మందికి పాజిటీవ్ వచ్చింది. ఈ ఏప్రియల్ నెలలోనే మన దేశంలో 66 లక్షల కేసులు నమోదు అయ్యాయి అంతే ఎంతగా కరోనా తీవ్రత ఉందొ తెలుస్తుంది.
ఇప్పుడు ప్రభుత్వాలు రాత్రి సమయంలో లాక్ డౌన్ విధించడం మొదలు పెట్టాయి. అది కూడా దేశం అంతా ఇంకా పూర్తి స్థాయిలో అమలు కావడంలేదు . తాజాగా దేశ అత్యున్నత న్యాయం స్థానం సంధించిన ప్రశ్నలు ప్రభుత్వానికి సవాలుగా మారాయి. సర్వోన్నత న్యాయస్థానం అడిగిన సమస్యలు తలెత్తకుండా కనీసం అదుపు చేసుకుని ఉంటె ఈరోజు భారత్ ఇలా విలవిలాడుతూ ఉండేది కాదు.
ప్రభుత్వాలు ప్రదర్శించిన నిర్లక్ష్యం వైఖరి ఒక వైపు , కోవిడ్ తో ఎన్నో సంఘటనలు చూసిన సామాన్య పౌరులు వాటినన్నింటిని మరిచిపోయి ఎమరపాటుగా ప్రవర్తించిన , ప్రవర్తిస్తున్న తీరే దీనికి కారణం .ఇప్పటికి దేశంలో కరోనా విలయ తాండవం చేస్తుంటే ఇంకా ప్రజలతో రద్దీగా ఉన్న ప్రదేశాలు , స్థలాలు కనిపించడం శోచనీయం .
ఎవరో వస్తారు , ఏదో చేస్తారు అని కాకుండా….ఎవరికి వారు తమ ప్రాణాలు , తమ వారి ప్రాణాలను కాపాడుకోవలసిన బాధ్యత ఉంది .
స్వచ్చందంగా ఎవరికి వారే స్వీయ నిర్భంధంలో ఉంటేనే ఈ కరోనా మహమ్మారితో పోరాడగలము.
మీ స్వీయ నిర్భంధమే మీ ఇంటిల్లిపాదికి రక్ష.
-అరసి శ్రీ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~