క్రీ.శ.1744నవంబర్ 22 న అమెరికా లోని మాసా చూసెట్స్ రాష్ట్రం వేమౌత్ లో నార్త్ కా౦గ్రి గేషన్ చర్చ్ లో విలియం స్మిత్, ఎలిజబెత్ లకు ఆబిగైల్ ఆడమ్స్ జన్మించింది .తల్లి రాజకీయంగా చురుకుగా ఉన్న క్విన్సి కుటుంబానికి చెందినది .ఆడమ్స్ తండ్రి లిబరల్ కాంగ్రి గేషనల్ మినిస్టర్, యాంకీ సంఘ నాయకుడు . అయినా విలియమ్స్ మాత్రం వీటికి దూరంగా ఉ౦డి , హేతువుకు నైతికతకు ప్రాదాన్యమిచ్చాడు .ఆబిగైల్ తల్లి ఎలిజబెత్ 33ఏళ్ళ వైవాహిక జీవితాన్ని భర్తతో అనుభవించి మసూచికం సోకి ,తండ్రి విలియమ్స్77వ ఏటచనిపోయారు .
ఆబిగైల్ తరచూ జబ్బు తో బాధ పడుతు౦డటం తో ప్రాధమిక విద్య సరిగ్గా సాగలేదు .ఆకాలం లో ఆడపిల్లల చదువును ప్రోత్సహించేవారు కాదు . తల్లి చదవటం రాయటం ప్రాథమిక గణితం ఇంటి దగ్గరే నేర్పింది .అయితే తండ్రి, మేనమామ మాతామహుడు లకున్న పెద్ద లైబ్రరీలలో పుస్తకాలు చదివి ఇంగ్లిష్, ఫ్రెంచ్ సాహిత్యం అధ్యయనం చేసింది .తెలివిగల పిల్లకనుక ఆడవాళ్ళ హక్కులు ,ప్రభుత్వ నిర్వహణ విషయాలపై మంచి అవగాహన ఏర్పరచుకొని అమెరికా రాజ్య వ్యవస్ద ఏర్పడటానికి తానూ కారకురాలైంది .
జాన్ ఆడమ్స్ స్మిత్ తో తన 15వ ఏట 1759లో మొదటిసారి పరిచయమై ప్రేమ లోపడింది .వీరి వివాహానికి ఆమె తండ్రి అనుమతించలేదు కాని తల్లికి అల్లుడు లాయర్ కనుక ఇష్టపడింది .25-10-1764 వీరిద్దరి పెళ్లి జరిగింది .వివాహం అవగానే భర్తతో ఒకే గుర్రం మీద భర్త ఇంటికి వెళ్ళింది .అది చిన్నకాటేజ్ .తర్వాత దంపతులు బోస్టన్ కు వెళ్ళారు. అక్కడ ఆడమ్స్ లా ప్రాక్టీస్ బాగా విస్తరించింది .12 ఏళ్ళలో ఆరుగురి ని సంతానం గా పొందారు .పిల్లలను తీర్చి దిద్దటం లో, ఆడమ్స్ వంశ గౌరవం నిలపటం లో ఆబిగైల్ గొప్ప నైపుణ్యాన్ని చూపింది .భర్త తరచుగా కాంప్ లకు వెడితే,ఆయన పెన్సిల్వేనియాలోని ఫిలడెల్ఫియాలో ‘’కా౦ టి నెంటల్ కాంగ్రెస్ ‘’ సమయం లో ఉన్నప్పుడు ఇద్దరిమధ్య జరిగే ఉత్తర ప్రత్యుత్తరాలలో సాహిత్యం బాగా చోటు చేసుకొనేది .ఆమె కున్న విజ్ఞానం, మేధస్సుకు ఆడమ్స్ ముచ్చటపడి ప్రోత్సహించేవాడు .ఏడాది కేడాది జాన్ న్యాయవాద వృత్తి పెరుగుతుంటే దానికి తగినట్లు ఇల్లు మార్చాల్సి వచ్చేది .భర్త వ్యవసాయ క్షేత్ర యాజమాన్యం ,ఫైనాన్స్ లావాదేవీలు కూడా ఆమె జాగ్రత్తగా బాధ్యతగా చూసి భర్త అవసరాలకు ఎప్పుడూ డబ్బు లోటు రాకుండా నిర్వహించేది .ఆయనకూడా చాలావిషయాలలో ఆమె సలహాలను కోరేవాడు .
1784లో ఆడమ్స్ కు పారిస్ లో రాయబారి పదవి రావటం తో భర్త ,పిల్లలతో ఆబిగైల్ మొదటి సారి యూరప్ వెళ్ళింది .ఇక్కడ పెద్ద భవనం ,నౌకర్లు ,చాకర్లు ఉండటంతో చాలా ఆనందంగా గడిపింది .1785లో ఆమె భర్త బ్రిటన్ మొదటి జేమ్స్ రాజు కోర్టు లో అమెరికా మినిస్టర్ అవటం తో ఆమె గౌరవం పెరిగింది .స్నేహితులు లేక లండన్ ఆమెకు నచ్చలేదు .కాని తర్వాత థామస్ జెఫర్సన్ చిన్నకూతురు మేరీ తో పరిచయమై ఆనందం కలిగించింది . 1788లో కుటుంబం మళ్ళీ అమెరికా చేరి క్విన్సి లో ఓల్డ్ హౌస్ అనే దానిలో ఉంటూ క్రమంగా దాన్ని అభివృద్ధి చేశారు .
1797మార్చి 4 జాన్ ఆడమ్స్ అమెరికా రెండవ ప్రెసిడెంట్ గా ఫిలడెల్ఫియాలో పదవీ బాధ్యతలు చేబట్టాడు .అత్తగారు మంచం లో ఉండటం వలన సేవచేస్తూ, ఉండిపోవటం వలన భర్త పదవీ బాధ్యత స్వీకరణ ఉత్సవానికి హాజరు కాలేక పోయింది .భర్త ప్రెసిడెంట్ గా ఉన్నకాలం లో ఆమె ఫిలడెల్ఫియాలో ప్రతివారం పెద్ద టీపార్టీలుఇస్తూ, అవసరమైనప్పుదు ప్రజలకు కనిపిస్తూ ఉండేది .ఇప్పుడు అబిగైల్ మొదటి ఫస్ట్ లేడీ .అమెరికా రెండవ ప్రెసిడెంట్ జాన్ ఆడమ్స్ భార్య కనుక సెకండ్ ఫస్ట్ లేడీ అన్నారు .మొదటి ప్రెసిడెంట్ జార్జి వాషింగ్టన్ భార్య మార్తా లాగా కాకుండా ఆబిగైల్ చాలా చురుకుగా రాజకీయాలలో పాల్గొనేది .అందుకే ఆమెను ప్రతిపక్షం వాళ్ళు ‘’మిసెస్ ప్రెసిడెంట్ ‘’అని విమర్శించేవారు . భర్తకు అన్ని రకాల మద్దతిస్తూ ,రాజకీయాలపై అత్యంత అవగాహన పె౦చుకొని, భర్తకు విదేశీ వ్యవహార ,రాజద్రోహ చట్టాలు ఆమోదం పొందించటం లో గొప్ప కృషి చేసింది .1800లో ఫిలడెల్ఫియాలో భర్త ఆడమ్స్,పిల్లలతో పాటు ప్రెసిడెంట్ హౌస్ లో ఉన్నది . రాజధాని వాషింగ్టన్ డిసి కి 1800లో మారినపుడు వైట్ హౌస్ లోనవంబర్ లో వచ్చి ఉండి మొదటి ఫస్ట్ లేడీ అయింది .అవి ఆడమ్స్ పదవీకాలం లో చివరి నాలుగు నెలలు .చుట్టూ దట్టమైన అరణ్యం ,భవనాలు ఇంకాపూర్తికాకపోవటం కొంత అసంతృప్తి కలిగించింది.ఫైర్ ఉడ్ నరికి తెచ్చిపెట్టే నౌకర్లూ ఉ౦ డేవారుకాదు.భర్త ఆరోగ్యం కూడా బాగుందేదికాదు.
రెండవసారి ప్రెసిడెంట్ పదవికి పోటీ చేసి జాన్ ఆడమ్స్ ఓడిపోవటంతో కుటుంబం మళ్ళీ క్విన్సీకి చేరింది .బ్రిటన్ ప్రధాని జఫర్సన్ కూతురు, లండన్ లో తనకు స్నేహితురాలు మేరీ మరణం తెలిసి, ఆయన తనభర్త రాజకీయానికి వ్యతిరేకమైనా ,లండన్ వెళ్లి పలకరించి వచ్చింది .తనమనవడు జార్జి వాషింగ్టన్ ఆడమ్స్ ,మనవరాళ్ళ ఆలనా పాలనా చూసింది .1818 అక్టోబర్ 18న అలిగైల్ ఆడమ్స్ టైఫాయిడ్ జ్వరంతో బాధపడి 76ఏళ్ళ వయసులో చనిపోయింది .చనిపోతూ ‘’డియర్ ఫ్రెండ్ జాన్ నాకోసం ఏడవకండి .నేను వెళ్ళిపోతున్నాను ‘’అన్నది భర్త తో .మాసా చూసెట్స్ లోని క్విన్సిలోఉన్న చర్చ్ ఆఫ్ ది ప్రెసిడెంట్స్ లో ఖననం చేశారు .
అలిగైల్ కు రాజకీయంగా కొన్ని దృఢ అభిప్రాయాలున్నాయి . .రివల్యూషన్ వస్తుందేమో నని భయపడేది .సుస్థిరత ఉండాలని కోరేది .కుటుంబ వ్యవస్థ, మతాలకు గొప్ప ప్రాధాన్యమిచ్చింది . .మహిళలు కుటుంబ వ్యవస్థ చక్కబరచటానికి న్యాయ ,సామాజిక గౌరవం అడ్డురావన్నది .18శతాబ్ది స్త్రీల బాధలగురించి రాసింది .వివాహిత స్త్రీలకూ ఆస్తిహక్కు ఉండాలని కోరింది .స్త్రీవిద్య ప్రోత్సహించాలని చెప్పింది .భర్తకు సాహచర్యంతో తృప్తి పడకుండా ,మహిళలు తమను తాము తీర్చి దిద్దుకోవాలని ,తమమేధాశక్తితో పిల్లలకు,భర్తకు మార్గ దర్శనం చేయాలని హితవు చెప్పింది .ప్రెసిడెంట్ అయిన తనభర్త జాన్ ఆడమ్స్ కు1776మార్చి లో లేఖ రాస్తూ ‘’ఆడవాళ్ళను గుర్తుంచుకోండి .మీ పూర్వీకులకంటే వారిపట్ల ఉదారంగా ,అనుకూలంగా వ్యవహరించండి .భర్తలకు పరిమితిలేని హక్కులు ఇవ్వకండి .ప్రతిభర్త అధికారంతో క్రూరంగా ప్రవర్తిస్తాడని గుర్తించండి .ఆడవాళ్ళ సంరక్షణ ,వారిపై సరైన దృష్టి మీరు చూపకపోతే ,మా మహిళలంతా తిరుగుబాటు చేస్తాం .మాకోసం ప్రత్యేక చట్టాలు .మా గోడు వినిపించే అవకాశాలు ,మా కు ప్రాతినిధ్యం లేని మీ నిబంధనలేవీ మమ్మల్ని బంది౦చ లేవని గమనించండి ‘’అని ఘాటుగా రాసింది .ఐతే భర్తప్రెసిడెంట్ ఆడమ్స్ ఈ అసాధారణ నియమాలను తిరస్కరించాడు .
అమెరికా ప్రజాస్వామ్యానికి బానిసత్వం సాంఘిక దురాచారమని ,ముప్పు అనీ ప్రకటించింది .ఫిలడెల్ఫియాలో ఉండగా 1791లో ఒక నల్లజాతి యువకుడు ఆమె దగ్గరకు వచ్చి తనకు చదవటం రాయటం నేర్చుకోవాలని ఉందని చెప్పగా, అతడిని స్థానిక ఈవెనింగ్ స్కూల్ లో చేర్పించి చదివించింది .’’ముఖం నల్లగా ఉన్నంత మాత్రాన అతడు స్వేచ్ఛా పౌరుడుకాదా,అతడు చదువుకోకూడదా ,అతడి జీవికకు ఆధారం చూసుకోరాదా? .అందుకే ఆ కుర్రాడి చదువుకు ప్రోత్సహించాను .ఇందులో నాకు ఆత్మగౌరవం పోయిందని భావించను ‘’ అన్నది .
అలిగైల్ ఫిన్సిలో ఉండగా ఫస్ట్ పారిష్ చర్చి లో చురుకైన కార్యకర్తగా ఉండేది .ఈ విషయాలను చనిపోవటానికి కొన్ని రోజులముందు ఆమె కొడుకు 1816మే5న రాసిన ఉత్తరం లో ‘’నేను యునిటేరియన్ గా గుర్తిపు పొందాను. తండ్రి ప్రభువు యేసు ఒక్కడే దైవం అని నమ్మాను ‘’అని రాసింది .అలిగైల్, జాన్ ఆడమ్స్ ల మధ్య 1200ఉత్తర ప్రత్యుత్తరాలు నడిచి ,అమెరికాచరిత్రలో ఘనత వహించిన భార్యాభర్తలమధ్య జరిగిన కరెస్పా౦డెన్స్ గా రికార్డ్ సృష్టించాయి .ఆమె పేర అనేక స్మారక చిహ్నాలు నెలకొల్పారు .అమెరికా మొదటి ఫస్ట్ లేడీ ఐన ఆమెకు గౌరవ చిహ్నంగా అమెరికాప్రభుత్వం 10డాలర్ల బంగారు నాణాలు 2007జూన్19 ముద్రించింది .ప్రెసిడెంట్ అయిన భర్తకు విలువైన సలహాల౦దిస్తూ ,కుటుంబాన్ని పద్ధతిగా తీర్చిదిద్దితూ,మహిళా హక్కు,విద్య ,ఆస్తిలో వాటా కోసం ,బానిసత్వ నిర్మూలనకోసం తపన పడిన ‘’అమెరికా ఫస్ట్ లేడీ ‘’అలిగైల్ ఆడమ్స్ చిరస్మరణీయురాలు .
-గబ్బిట దుర్గాప్రసాద్
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~