కబుర్ల మీద కబుర్లు వెళ్ళినా ఆరు నెలలు గడిచిపోయినా ఆ ఇంటి నుండి కృష్ణకు పిలుపు రాలేదు.ఆ ఇంటి స్వంత బంధువు ఎవరో? ఎక్కడుoటారో? ఎవరికి చెప్పి, ఎవరి సమ్మతి మీద, ఎవరి హామీ మీద, ఎవరి చేతుల్లో తన బిడ్డను వదలాలో అర్ధంకాని రావు దంపతులు, గొడ్డును సావిట్లో వదిలేసి వచ్చినట్టు తన బిడ్డను కాదంటున్న అల్లుడి దగ్గర దిగబెట్టి రావడానికి మనస్సంగీకరించక ఏమి చెయ్యలా?’ అని తలబద్దలు కొట్టుకుంటున్నారు. వాళ్ళు ఈ ఆరు నెలల్లో చేతులు ముడుచుకుని కూర్చోలేదు. రాజశేఖరం బంధువులన్న ప్రతి వాడి గడ్డమూ పట్టుకున్నారు. వాళ్ళ దగ్గర నుండి సానుభూతేగాని ఎలాoటి సహాయమూ లభించలేదు. హఠాత్తుగా ధనవంతుడైన రాజశేఖరాన్ని నొప్పించి, అతని నుండి అడపాదడపా వాళ్ళు పొందే సహాయాన్ని పొగొట్టుకునే సాహసం ఆ బీద బంధువులకు కలగలేదు. పైగా చనువుగా స్వతంత్రంగా వుండే బంధువులు అసలు రాజశేఖరానికి లేరనే చెప్పొచ్చు.
అతని బాబాయ్ మటుకు నాలుగైదు సార్లు చెప్పిచూసి ‘మూర్ఖపు వెధవ్వి నువ్వు. డబ్బుండగానే సరిపోదు. మనిషి అనే వాడికి కాస్త మనసు కూడా వుండాలి’ అని ఛడామడా తిట్టి ఆ బొంబాయి మహా పట్టణంతో రాక పోకలకి స్వస్తి చెప్పి వెళ్ళిపోయాడు.
ఇది ఇలా వుండగా రాత్రింబగళ్ళు అతని వింత మనస్తత్వం గురించి, చిత్రమైన తన వైవాహిక జీవితం గురించి ఆలోచిస్తూ కూర్చునేది కృష్ణ.
‘ఇలా ఎందుకు జరిగింది? తీయగా అపురూపంగా దాచుకోవాలనుకున్న తొలి స్మృతులు ఎందుకిలా చిన్నాభిన్నమై పోయాయి ? తన కలలెందుకిలా వంచించబడ్డాయి ?’
‘ఒక ప్రియమైన వ్యక్తి మరణిస్తే ఆ వ్యక్తి నిష్క్రమణ తాలూకు దుఃఖాన్ని మర్చిపోవడానికి మరో ప్రియమైన వ్యక్తి ఆదరణను ఓదార్పును కోరుకుంటుంది మనస్సు. అలాoటిది ఈయన తన ఉనికినెందుకు అసహ్యించుకున్నట్టు? కేవలం తను ఆ ఇంటి గడప త్రొక్కిన క్షణంలో ఆయన తల్లి పోయిoదనే భావంతో, తనని శాశ్వతంగా దూరం చేసుకునేంత సంకుచితుడా తన భర్త! లేక మధ్య రాయబారాల్లో ఏమైనా లోపాలున్నాయా?’
‘ఆయన మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడని తను మౌనంగా దానిని అంగీకరించడమేనా? ఆయన మూఢత్వాన్ని రూపుమాపే ప్రయత్నమేదో తను చెయ్యకుండా చేతులు ముడుచుకుని కూర్చోవడమేనా? ఇంకెంతకాలం ఇలా పుట్టింట్లో నలుగురి కుతూహలానికి కారణంగా వుండిపోవడం!’
”అమ్మా! స్నేహితురాలింటికెళ్తున్నాను”. అని అబద్ధమాడి భర్తతో ముఖాముఖీ మ్లాడడానికి బయలుదేరింది కృష్ణ ఒకరోజు. ఆమెకు ఈసాహసం చెయ్యడానికి ఆరునెలల వ్యవధి కావలసి వచ్చింది. తల్లితో ఆమె కావాలనే అబద్ధమాడింది. నిజం చెప్తే తల్లి అంగీకరించకపోవచ్చు. తన బిడ్డ నిరాకరించబడడం, అలుసుకాబడ్డం ఏ తల్లికీ ఇష్టం వుండదు.
తలవంచుకుని ఏదో వ్రాస్తున్న రాజశేఖరం తన ఎదురుగా పడిన నీడను గమనించి తలెత్తాడు.అతని కళ్ళల్లోకి చూసిన కృష్ణ ఒక్క క్షణం అక్కడే నిలబడిపోయిoది.లోతుకు పోయిన కళ్ళు, పోషణలేని గడ్డమూ, అతను తల్లి జ్ఞాపకాల నుండి ఇంకా విముక్తి పొందలేదనే సత్యాన్ని గుర్తుతెస్తున్నాయి .
”రండి కూర్చోండి”. చాలా నిదానంగా, ఇంటి కొచ్చిన బంధువునో, స్నేహితులనో ఆహ్వానించినట్టుగా ఆహ్వానించాడు. అంతమాత్రం ఆదరణను కూడా ఊహించని కృష్ణ మనసులోనే సంతోషపడ్తూ అతని ఎదురుగా కుర్చీలో కూర్చుంది. ఆమెను సాదరంగా ఆహ్వానించిన అతను ఆతర్వాత ఆమె ఉనికినే మర్చిపోయినట్టు వ్రాసుకోసాగాడు.మెల్లిగా గొంతు సవరించుకుంది కృష్ణ.
”మీతో మ్లాడాలని వచ్చాను.”
అతను తలెత్తి ‘మాట్లాడు’ అన్నట్టుగా చూసాడు.
”మనకి పెళ్లై ఆరు నెలలయిoది. అత్తయ్య పోయిన విచారంలో మీరు నన్ను గురించి పూర్తిగా మర్చిపోయారు. ఇంకెన్ని రోజులని నేనక్కడుండను?” కృష్ణకు తొలిమారు ఆతనితో మాట్లాడినప్పటి బెరుకు ఇప్పుడు లేదు. ఈ ఆరు నెలలుగా అతనితో మాట్లాడకపోయినా అతనిని గురించి ఆలోచిస్తూనే వుంది ఆమె.
”నాకు మనసు బాగాలేదు మరెప్పుడైనా రండి” అనేసి మరలా వ్రాతలో మునిగిపోయిన తన భర్త ఉపేక్షాభావాన్ని ఆమె సహించలేకపోయిoది.
”నేను మీకు భార్యను ఆ సంగతి మీకు గుర్తుందా?”
ఆరు నెలల క్రితమతే తన ప్రియమైన తల్లి చావుతో పిచ్చివాడై తనుఏమన్నా ఎంతగా నిరసిoచినా సహించింది. కానీ కాలం గాయాన్ని మాన్పిన తర్వాత ఈ రోజు కూడా అతను ఈ విధంగా తనను వెళ్ళిపొమ్మంటుంటే సహించలేకపోయిoది.
”మా అమ్మ బలవంతం మీద మిమ్మల్ని చేసుకున్నాను. ఆమె ఈ రోజు లేదు.” నివ్వెరపోయినది కృష్ణ. తిరస్కారంగా అంది.
”మీ అమ్మగారు లేనంత మాత్రాన నేను మీ భార్యను కాకపోను. మన వివాహానికి సాక్షి ఆమె ఒక్కరే కాదు”
”కాకపోవచ్చు. కానీ నువ్వంటే నాకిష్టం లేదు. ” సూటిగా అన్నాడు.
– డా.పెళ్లకూరు జయప్రద సోమిరెడ్డి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~