వాళ్ళ ప్రయత్నాలపై ఎప్పటికప్పుడు కన్నేసి ఉంచిన దళిత సంఘం విషయం తెల్సి తీవ్రంగా స్పందించింది. ‘ఇనాం’ భూమి వెంటనే అప్పజెప్పాలనీ లేదంటే తామేం చేయాలో అది చేస్తామని హెచ్చరిస్తూ ఆందోళనకు దిగారు. అంత వరకూ తాము ఊర్లో ఎవరికీ పనులు చేయమని స్పష్టం చేశారు. లింగాల, అచ్చంపేట, వాజిద్నగర్ గ్రామాల్లోని దళితులు సైతం వీళ్ళనే అనుసరించారు.
దాంతో చచ్చిన జంతు కళేబరాలు అలాగే ఉండాల్సి వచ్చింది. ఊరు శుభ్రం చేయక, పశులు కాసేవాళ్ళు లేక, పొలాలకు నీరందక, ఇళ్ళలో పనిచేసే వాళ్ళు లేకపోయే సరికి అగ్రకుల, భూస్వామ్య వర్గాల పెద్దల చెయ్యి విరిగినట్లయ్యింది. భూమి కంపిచినట్లు తల్లడిల్లిపోతున్నారు. రెడ్డి, కాపుల కుటుంబాల కారణంగా నాలుగు గ్రామాల్లోనూ పనులాగిపోవడం చుట్టుపక్కల పెద్ద వింత వార్తయిపోయింది.
గతంలో ఎన్నడు వాళ్ళకు తెలియదు. ఉన్నత వర్గాలపై నిరసన తెలియజేయడం ఎలాగో… అసలా ఆలోచనే లేదు వాళ్ళకు. బండచాకిరీ చేయడం తప్ప. ఆ నాలుగు గ్రామాల్లోనూ వెనుక బడిన వర్గాల వారు, కొందరు ఉన్నత వర్గాల, కులాల వారు కేవలం ఇద్దరి కారణంగా తామంతా ఇబ్బంది పడడం ఏమిటనుకున్నారు. ముఖ్యంగా రాజాగౌడ్కి ప్రతాపరెడ్డి కుటుంబం మరోసారి గ్రామ ఎన్నికల ముఖచిత్రంలో అడుగు పెట్టలేదులే అనే ఆనందంతో, ఇన్డైరక్టుగా దళితులకే సపోర్టు ఇస్తున్నాడు. కారణం మండల ఎన్నికలు దగ్గర పడుతూండడం కూడా కావచ్చు. హైదరాబాద్లో ఉండి ప్రయత్నం చేసే జానారెడ్డికీ, జలపతిరావు కొడుకుల్కి మధ్య వర్తిత్వం గడిపారు రాజాగౌడ్, వెంకన్న పటేల్, శివప్ప.
చివరికి సర్పంచ్ పోశవ్వ, దళిత నాయకులు సైదులు, యాదయ్య, మహిళా నాయకురాలు జోతక్కల నాయకత్వంలో ఇనాం భూమి వాళ్ళకు అందింది, దాదాపు నెల రోజుల ఆందోళన అనంతరం. ఈ నెల రోజుల్లో సద్ది బువ్వ, ఎండిన రొట్టె ముక్క కూడా దొరక్క, ఆకలితో అలమించినా ఆత్మగౌరవంతో, అంతా కలిసి కట్టుగా మెలిగారు. అందులో ఉన్న బలం ఏంటో సంఘటితం కావడం వల్ల తాము ఎంత లబ్ది పొందారో అర్థమైంది. ఇక నుండి చెప్పింది విని గుడ్డెద్దు చేలో పడ్డట్టు, ఆలోచన లేకుండా పనులు చేసుకుంటూ పోవడమే కాదు, తన్నులు, గుద్దులు, చీదరింపులు, చివాట్లు అందుకోవడం కాదు. తమని తాము తెల్సుకుని సంఘటితంగా, సమిష్టిగా ఉంటే ఏదైనా సాధించగలమన్న ధీమాను పెంచింది. ఈ సంఘటన పోశవ్వ పేరు ప్రతిష్టల్ని మరింత పెంపొందించింది.
ఆ తర్వాత కొద్ది రోజులకే ఆమెకో వర్తమానం అందింది. స్థానిక సంస్థల్లో స్త్రీలకు స్థానం కల్పించి మహిళల రాజకీయ పునాదివేసిన రోజును పురస్కరించుకుని ఇండియన్ ఇనిస్టిట్య్ట్ ఆఫ్ సోషల్ సైన్సస్ గత రెండేళ్ళుగా ఏప్రిల్ 24-25 తేదీలలో మహిళా దినోత్సవం నిర్వహిస్తోంది.
ఈ సంస్థ ఈ సందర్భంగా దేశం నలుమూలల నుండి పంచాయితీ వ్యవస్థలో ప్రతినిధులుగా సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్న మహిళలను ఎంపిక చేసి దేశ రాజధానికి ఆహ్వానించి వారు ఒకర్నొకరు కలుసుకొనే అవకాశం కల్పిస్తోంది. అట్టడుగు స్థాయిలో గురించి కూలంకషంగా చర్చిస్తోంది. ఈ సమావేశాల్లో పాల్గొనే పంచాయతీ రాజ్ వ్యవస్థలోని ప్రజాప్రతినిధులు తమ సమస్యలను విప్పి చెప్పుకుంటారు . పరిష్కారాలను అన్వేషిస్తారు. ఆదర్శంగా నిలుస్తారు. ఈ కార్యక్రమానికి వచ్చి అందులో పాల్గొనవలసిందిగా పోశవ్వకి ఆహ్వానం అందింది. ”మగవాళ్ళ ఆధిపత్యంలో నామ మాత్రంగా మిగిలిపోతున్న మహిళా ప్రతినిధులు” అన్నం అంశంపై విపులంగా చర్చ జరిగింది. అక్షరాస్యతా కార్యక్రమంలోనో, మరో చోటులోనో నేర్చుకున్న సంతకం తప్ప చదవడం రాయడం రానివారే చాలా మంది. అయినా తమ హక్కులు, అధికారాలు, బాధ్యతలు ఏమిటో తెల్సుకున్నవారు. తమంతట తామే కార్యనిర్వహణా బాధ్యతలను నెరవేర్చాలని కృతనిశ్చయంతో ఉన్న వారు కొద్ది మందే. మగవారి నీడలో, వాళ్ళ అజమాయిషీ కింద సర్పంచ్ గిరీ వెలగ పెడుతున్న వాళ్ళే ఎక్కువ.
– శాంతి ప్రబోధ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~