ఆ తరువాత ఆ దంపతులకు మరో ముగ్గురు బిడ్డలు కలిగారు. అందర్ని అదే వేడుకతో అపురూపంతో పెంచారు. ఆఖరి పిల్లకు
ప॥ ఏమే ఓ చిట్టీ ఏడవకేయీ రోట్టీ
ముక్కావిరచిపెట్టీ నిను పాడుతూనే జోకొట్టీ
చ॥ 1. అడుగో బూచివాడు మన అటకమీదున్నాడు
ఏడిస్తే నిను వాడు ఎత్తుకొని పోతాడు ॥ఏమే॥
2. మిట్లగుడ్ల వాడు పొణకంత పొట్టవాడు
ఆ తట్టలో దాగున్నాడు జడ పట్టుకొని లాగుతాడు ॥ఏమే॥
3. అల్లరి చేయకమ్మా బుల్లి పల్లకి ఇదిగోనమ్మా
నా తల్లీ నీకేనమ్మా బుల్లి చెల్లికి ఇవ్వనమ్మా ॥ఏమే॥
4. బెల్లము పెడతాను నీ అల్లరి ఇకమాను
ఇలా అల్లరి చేస్తే బుల్లక్కకి పెట్టేస్తాను ॥ఏమే॥
5. ఉయ్యాల ఊపించుతాను బట్ల పెయ్యని చూపిస్తాను
ఏడవకుండా వుంటే నాన్నగారూ ఎత్తుకుంటారు ॥ఏమే॥
6. హుష్ కాకిరావే పెద్ద శేషునెత్తుకు పోవే
రంగదాసు నేలిన శివలింగాన్ని మరువకమ్మా ॥ఏమే॥
అని పాడారు సీతమ్మ గారు.
ఖగోళశాస్త్రంలో జరిగే అరుదైన మార్పుల్లో గ్రహణం ఒకటి. విజ్ఞాన శాస్త్ర ప్రకారం భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. చంద్రుడు కూడా భూమి చుట్టూ తిరుగుతాడు. ఈ పరిభ్రమణం వలననే అహోరాత్రులూ, పూర్ణిమ నుండి అమావాస్య వరకూ వుండే 16 తిథులు, 360 రోజులు గల సంవత్సరం ఏర్పడ్డాయి. భూమికీ, సూర్యునికి మధ్య చంద్రుడూ, చంద్రునికీ, సూర్యునికీ మధ్య భూమి అడ్డం వచ్చినప్పుడు సూర్య, చంద్ర గ్రహణాలు ఏర్పడుతున్నాయి. అని ఆధునిక ఖగోళ విజ్ఞానం చెబుతుంది. జ్యోతిష్య శాస్త్రంలో అఖండ ప్రజ్ఞావంతులైన భారతీయ శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని అవగతం చేసుకున్నా ఆయా సమయాల్లోని అసాధారణ పరిస్థితిని గుర్తించి, దానికి తమ అపూర్వ కల్పనా శక్తిని జోడిరచి పురాణ గాథలు కల్పించారు. క్షీరసాగర మథన వేళ ఉద్భవించిన అమృతాన్ని శ్రీ మహావిష్ణువు జగన్మోహినీ వేషాన్ని ధరించి అసురుల్ని వంచించి సురులకు ఇచ్చాడు కదా. రాహువు, కేతువు అనే ఇరువురు రాక్షసులు దేవతా రూపాలు దాల్చి దేవతల పంక్తిలో కూర్చొన్నారు. ఆ విషయాన్ని గమనించిన సూర్యచంద్రులు జగన్మోహినీ దేవికి సంజ్ఞ చేశారు. వారు సూర్య చంద్రుల్ని చంప వస్తే విష్ణువు తన చక్రంతో వారి శిరస్సులు ఖండిరచాడు.
అమృత బిందువులు ఇంకా గొంతుకలోనే వుండటం వలన కేతువు తల సజీవంగా వుంది. మొండెం నిర్జీవమయిపోయింది. అమృతం గొంతు దిగి కడుపులోకి పోవడం వలన రాహువు తల నిర్జీవమై మొండెం సజీవంగా వుంది. వీరిరువురు పర్వదినాల్లో సూర్య చంద్రుల్ని మ్రింగుతూ వుంటారు. ఆ తేజో మూర్తులు కొంత సేపటికి పట్టు విడిపించుకొని బైటకు రావడంతో గ్రహణం వీడుతుంది. పగ వలన రాహుకేతువులు సర్పాలుగా వుంటారు. ఇది భారతీయ పౌరాణిక గాథలు చెపుతున్నాయి. వరాహమిహురుడు, ఆర్యభట్టు మొదలైన భారతీయ ఖగోళ శాస్త్రవేత్తలు నేటికీ అబ్బురమైన ఎన్నో ఖగోళ శాస్త్ర విషయాలను ఆనాడే కనిపెట్టారు. గ్రహణ సమయం విశిష్టమైనది ఆ సమయంలో ఖగోళంతో పాటు భూమిపైన భూమ్యాకర్షణ శక్తిపైనా, భూమిపైన నివసించే జీవులపైనా కొన్ని మార్పులు జరుగుతున్నాయన్నది శాస్త్ర నిరూపితమైన విషయం. హిందువులు ఈ గ్రహణ సమయాన్ని పర్వ కాలంగా పరిగణించారు. గ్రహణ సమయాన వారు పుణ్య నదుల్లోనూ, సముద్రంలోనూ స్నానాలు చేస్తారు. మంత్రోపదేశాన్ని పొందిన వారు ఆ గ్రహణ సమయంలో పురశ్చరణ చేస్తే అధిక ఫలాన్నిస్తుందని హిందువులు నమ్ముతారు. పోతనగారికి సాయంకాల సమయాన గంగ ఒడ్డున జపనిమగ్నమై వున్నవేళ సీతా సమేతుడైన శ్రీరామచంద్రమూర్తి గోచరించి భాగవతాన్ని ఆంధ్రీకరించమని ఆనతిచ్చాడని భాగవత అవతారికలో చెప్పారు. గ్రహణ సమయంలో చక్రవర్తులూ, మహారాజులూ అనేక దానాలు చేసి శిలా శాసనాలు, తామ్ర శాసనాలు వేయించారు. ఓ గ్రహణ సమయాన సీతమ్మగారు తన నేస్తురాండ్రతో కలిసి పిల్లలను తీసుకొని కాకినాడ సమీపాన గల ఉప్పాడ సుముద్ర స్నానానికి వెళ్లారు. ఉప్పాడలో సముద్రం కాకినాడలోలా స్తబ్ధంగా కాకుండ ఉత్తుంగ తరంగాలతో వుంటుంది. ఉప్పాడ గ్రామం అనాదిగా నేత పరిశ్రమకు ప్రసిద్ధి పొందింది.
120 నెంబరు మేలు నూలుతో ఉప్పాడ నేతగాండ్రు వెండి జరీ చీరలు నేస్తారు. అవి నాటి ఢాకా చీరలకూ, నేటి వేంకటగిరి జరీ చీరలకు సరితూగుతూ వుండేవి. నేటి జరీబుటా పనీ, జంతువులు, పక్షులు లతల నేత నాటి వారు ఎరుగరు. జరీ అంచులతో మాత్రమే నేసేవారు. పట్టు చీరల నేతకు కూడా ఉప్పాడ ప్రసిద్ధి. బొటనవేలు వెడల్పు చుట్టు జరీతో బెత్తడు జరీ పైట అంచుతో గులాబి, నీలం, బ్రౌన్ రంగుల్లో ఉప్పాడ పట్టుచీరలు నాణ్యంగా తరచు ధరించడానికి అనువుగా వుండేవి. సీతమ్మగారు, మిత్రురాళ్లు నేత పరిశ్రమ చూచి తమకు నచ్చిన చీరలు కొనుక్కున్నారు. మగ్గాల మీద చీరలు బజారు ధరకన్నా చాలా తక్కువ ధరకు లభిస్తాయి. నేటి బస్సు సౌకర్యాలు ఆనాడు లేవు. వ్యవసాయం వున్న వారు పొలం చేసే రైతును దుక్కిటెడ్లను బండికి పూన్చి తెమ్మనేవారు. మిగతా వారు అద్దెకు లభించే ఒంటెద్దు బండ్లపై పయనించేవారు. మన సీతమ్మ బృందం తెల్లవారు రaామున 4 గంటలకు ఇంటి వద్ద బయలుదేరి తెల్లవారేసరికి ఉప్పాడ సముద్రం చేరారు. పట్టే పట్టే అనగానే పంది గుంటలోనైనా సరే మునగాలట అందరూ సముద్రంలో పట్టు స్నానం చేసారు. తమ వెంట తెచ్చుకున్న వెదురు పేళ్ల సజ్జలలోని ధర్భ పుల్ల కొంగున ముడివేసి ఆరవేసిన పట్టుచీరలు కట్టుకొని ఆ సముద్ర తీరాన ఇసుకలో పద్మాలు పెట్టుకొని పసుపుతో గౌరీదేవినిచేసి పూజ చేసుకున్నారు.
– కాశీచయనుల వెంకట మహాలక్ష్మి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~