సంక్షుభిత ఇటలీ దేశం లో నిత్యం యుద్ధ మేఘాలు కమ్ముకొని జన జీవితాన్ని అస్త వ్యస్తం చేస్తే శాంతికోసం పరితపించి ఉద్యమాలు నడిపిన ఇద్దరు మహిళా వజ్రాలను గురించి తెలుసుకొందాం .
1-ఇటలి శాంతి పోరాట యోధురాలు సాంఘిక నవలా రచయిత్రి –గ్విస్ అడామి రొసాలియా
శాంతికే ప్రాధాన్యత :
ఇటలీ లో ఇరవై వ శతాబ్దం లోని మహిళలు అనేక రంగాలలో అగ్రభాగాన ఉన్నారు .అందులో గ్విస్ అడామి రొసాలియచాలా ప్రాముఖ్యం పొందింది .శాంతి ని సాధించటం లో అవిశ్రాంతం గా కృషి చేసిన సాంఘిక నవలా రచయిత్రి రొసాలియా .దేశం లోని స్త్రీలను శాంతి సాధనా ఉద్యమం లో లో సమాయత్తం చేసిన మహితాత్మురాలు .సాంఘిక ,మానవ హక్కులు ,మహిళా వోటు హక్కుల కంటే శాంతికే ప్రాముఖ్యతనిచ్చింది .
జీవితం –నవలా రచన –శాంతి ఉద్యమం :
గ్విస్ అడామి ‘’రిసేర్జి మెంటో పేట్రియట్స్’’కుటుంబం లో 30-7-1880 నఇటలీలోని ఎడోలో లో జన్మించింది . .ఈ సంస్థ ఆమెకు ప్రముఖ ఇటలీ నాయకులు జిసేప్పీ మాజ్జిని ,జిసేప్పీ గరిబాల్డి ల ప్రజాస్వామ్య జాతీయ భావాలను రంగ రించి పోసి తీర్చి దిద్దింది .సాంఘిక ఇతి వృత్తాలతో మొదటి సారిగా రచనలు చేయటం ప్రారంభించింది .1905 లో మొట్ట మొదటి సాంఘిక నవల ‘’కాన్షన్స్ ‘’రాసి ప్రచురించింది .ఇటాలియన్ శాంతి ఉద్యమంలో చేరింది .అకుంఠిత దీక్ష తో పని చేసి అందరి దృష్టినీ ఆకర్షించి ఇటలీ శాంతి పత్రిక ‘’ఇన్టర్నేషనల్ లైఫ్ ‘’లో అనేక వ్యాసాలూ రాసి శాంతి ఆవశ్యకతను చాటి చెప్పేది .తర్వాత ‘’అవుట్ సైడ్ ది నెస్ట్-ది గోల్డెన్ వర్జిన్ ‘’నవల రాసి ముద్రించింది .ఇందులో 1914లో ఉన్న సాంఘిక సమస్యలను చర్చించింది .
యువ మహిళా సంస్థ –మహిళా విద్యా వ్యాప్తి :
1909 లో ఇటలీ లోని మిలన్ లో ‘’ఇటాలియన్ యంగ్ వవుమెన్ సొసైటీ ఫర్ పీస్ ‘’ని రొసాలియా స్థాపించింది .ఈ సొసైటీ ద్వారా బాలికా హైస్కూలు విద్యార్ధినులు ,టీచర్లు స్వచ్చందం గా యువతులకు ఇతర దేశాన్ని విధ్వంస వినాశం చేయకుండా ధనాత్మక దేశ భక్తీ బోధించే ఏర్పాటు చేసింది .యువతలో అంతర్జాతీయ సహకారం సాధించటం ,వినాశకర యుద్ధ ఆయుధాల ను యూరప్ లో తగ్గంచే ప్రయత్నానికి కృషి చేసింది .సొసైటీ కి విరాళాలు సేకరించి టీచర్ స్టూడెంట్ బృందాలు ఇతర దేశాలలో పర్యటించటం ఆ దేశాల వారు ఇటలీ లో పర్యటి౦చ టానికి తోడ్పడింది . దీనివలన ఇటాలియన్ మహిళలు ఇతర దేశాలకు వెళ్లి చదువుకోవటానికి గొప్ప అవకాశాలు కలిగాయి .ఈ సందర్భం గా గ్విస్ అడామి ప్రముఖ ఇటాలియన్ శాంతి ఉద్యమ నాయకుడు ఎర్నేస్టో దియడరో మొనాటో తో కలిసి పని చేసింది .ఇద్దరూకలిసి మిలన్ లోను ,బెర్న్ లోని అంతర్జాతీయ శాంతి సంస్థ లో సేవలు అంద జేశారు .
ఇటలీ స్వేచ్చకు ప్రాముఖ్యం 1911లో శాంతి మంత్రాన్ని వదిలేసి ఇటలీ దేశం లిబియా సిరనైకా లపై దాడిని రొసాలియా సమర్ధించింది -ఇటలీకి జాతీయ స్వాతంత్ర్యం అన్నిటికంటే ముఖ్యమైనదని భావించింది .అప్పుడే ఇటలీ అసలైన అంతర్జాతీయ నేతృత్వం వహించే సావకాశం ఏర్పడుతుందని గట్టిగా నమ్మి కృషి చేసింది . ఇంగ్లాండ్ ,ఫ్రాన్స్ ల కాలనీ రాజ్య కబంధ హస్తాల నుండి ఇటలీ విముక్తి పొందాలని స్వతంత్ర దేశమై స్వయం సమృద్ధి సాధించాలని వా౦చి౦చింది .కాని ఆల్మా డోలేన్ వంటి శాంతికాముకులు ఇటలీ చేసే యుద్ధాన్ని సమర్ధించకుండా రోసాలియా ను వ్యతి రేకి౦చారు .
యూరప్ ఐకమత్యం
1912 లో గ్విస్ అడామి జెనీవాలో జరిగిన అంతర్జాతీయ పీస్ కాంగ్రెస్ లో ఇటలీ దేశానికి ప్రాతి నిధ్యం వహించి హాజరైంది .ఐరోపా ఐకమత్యాన్ని నొక్కి చెప్పింది అక్కడ .1914 జూలై లో బ్రసెల్స్ లో జరిగిన శాంతి స్థాపక సమావేశానికి వెళ్ళింది .కాని మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైన నేపధ్యం లో తన దేశం ఇటలి తటస్థ దేశం గా ఉండగలుగుతుందా అని సందేహించింది .యుద్ధ కాలం లో గ్విస్ మహిళలను యుద్ధానికి సానుకూలం గా మార్చ టానికి పత్రికలలో చాలా వ్యాసాలూ కరపత్రాలురాసి ప్రచురించి ఉద్బోధించింది .అందులో ‘’ఇన్ ది ఫ్రై’’వంటి పాంఫ్లెట్ చాలా ప్రభావం చూపించాయి .స్త్రీ ల తోడ్పాటు వలన యుద్ధం అయిన తర్వాత అనేక రాజకీయ హక్కుల సాధనకు తోడ్పడుతుందని అనుకొన్నది .చనిపోయే దాకా’’ లీగ్ ఆఫ్ నేషన్స్ ‘(నానా జాతి సమితి )ను గ్విస్ అడామి రొసాలియా ను సమర్ధిచింది .’’there are not two moralities –one for nations and one for individuals ‘’అనేది రొసాలియా నిశ్చితాభిప్రాయం .యాభై ఏళ్ళు మాత్రమే సార్ధక జీవితం గడిపిన గ్విస్ అడామి రొసాలియా 1930 లో మరణించింది .
2- స్త్రీ వాద రిపబ్లికన్ ,నవలా కారిణి – అలైడ్ గుల్బర్టా బెకారి
అగ్రగామి ఫెమినిస్ట్ :
1842 లో ఇటలీ లోని పాడువా లో జన్మించి 64 సంవత్సరాలు మాత్రమె జీవించి 1906 లో చనిపోయిన ఇటలీ ఫెమినిస్ట్ రిపబ్లికన్ రచయిత్రి అలైడ్ గుల్బర్టా బెకారి .తలిదండ్రులకున్న 12 మంది సంతానం లో బతికి బట్టకట్టిన ఒక్కగానొక్క బిడ్డ బెకారి .తండ్రి పాడువా లో సివిల్ ఉద్యోగి .అది అప్పుడు ఆస్ట్రో హంగేరియన్ సామ్రాజ్యం లో ఉండేది .తండ్రి ఇటలీ ఐక్యతను కోరే ఉద్యమం లో ఉండేవాడు .1848 రిసార్జి మెంటా తిరుగు బాటుదళం లో పని చేశాడు .దీన్ని అణచి వేయగా టూరిన్ కు పారిపోయాడు .తండ్రికి సేక్రేటరిగా పని చేసింది బెకారి .పాడువాను లా౦బార్డి వేనేషియా ఆక్రమించుకొన్న తర్వాత తల్లీ కూతుళ్ళు పాడువాకు తిరిగి చేరుకొన్నారు .
ఉమన్ పక్ష పత్రిక :
16 వ ఏట బెకారి వెనిస్ చేరి అక్కడ’’ఉమన్ ‘’పక్ష పత్రికను స్థాపించి నడిపింది .అందులో స్త్రీ సమస్యలమీద ఎన్నో ఆర్టికల్స్ రాసింది .ఇటలీ ఐక్యత కోరుతూ నిరంతర రచన చేసింది. ఇవన్నీ ఫలించి 1861లో ఎట్టకేలకు ఇటలీ ఐక్యత సాధించింది .బెకారికి సాంఘిక సంస్కరణలపై ఆసక్తి ఎక్కువ .ఇంగ్లాండ్ ఫ్రాన్స్,అమెరికా దేశాలలో వచ్చిన సంస్కరణలు గమనించి ఇటలీలో సంస్కరణల కోసం పెద్ద ఉద్యమమే నడిపింది .1870-1880దశాబ్దం లో ఇటలీలో మహిళల హక్కులకోసం ,భాష కోసం నిలిచి పోరాడింది ఉమన్ పత్రికఒక్కటి మాత్రమే .దీనిలో ప్రముఖ ఫెమినిస్ట్ అన్నా మేరియా మోజోన్నీ వ్యాసాలూ చాలా ప్రభావితంగా ఉండేవి .వ్యభిచారాన్ని చట్ట సమ్మతం చేయరాదని ఈ పత్రిక పోరాడింది .
స్త్రీ విముక్తి ఉద్యమం –మహిళా వోటు హక్కు :
’’స్త్రీ విముక్తి ‘’జరగాలని సర్వ శక్తులు ఒడ్డి పోరాడింది బెకారి .ఇటలీ ఐక్యత వల్లనే ఇది సాధ్యమవుతుందని చెప్పి ప్రజలను సమాయత్త పరచింది .అన్నా మేరియా మోజాని ఇటలీ చట్టాలలో సంస్కరణల కోసం ఉద్యమిస్తే ఉమన్ పత్రిక పూర్తిగా సమర్ధించింది .మోజానితోకలిసి బెకారి ‘’సిటిజన్ ఉమన్ ‘’ ‘’పేట్రి యట్ మదర్ ‘’ అనే వాటిని అందరికి అర్ధమయ్యేట్లురాసి ముద్రించి అవగాహన కల్గించారు . .గొప్ప చైతన్యమే తెచ్చారిద్దరూ .జోసఫైన్ బట్లర్ భావాలకు ప్రాచుర్యం కల్పించింది ఉమన్ పత్రిక .ఈ పత్రికలో పడిన ఆర్టికల్స్ తర్వాత ఇతర భాషల్లోకి అనువాదం పొంది ప్రపంచమంతా ప్రచారమయ్యాయి .ఉమన్ పత్రిక ౩౦౦౦ మంది మహిళలతో ఇటలీలో మహిళా వోటు హక్కు కోసం సంతకాలు పెట్టించి పిటీషన్ దాఖలు చేసి చరిత్ర సృష్టించింది .
మగవారు యుద్ధాలలో పోరాటాలు చేస్తుంటే స్త్రీలు సంతానాన్ని చక్కగా తీర్చి దిద్దుకోవాలని బెకారి హితవు చెప్పేది .శాంతి ఉద్యమాలెక్కడ జరిగినా విధిగా హాజరై శాంతి తోనే ఇటలీ సౌఖ్యం సాధించగలదని ప్రచారం చేసేది .అంతర్జాతీయ మహిళా సమాఖ్య ఏర్పడటానికి సహాయ సహకారాలను ఉమన్ పత్రిక ద్వారా అందించింది .
నాటక రచన-ప్రదర్శన : బెకారి మంచి రచయిత్రి .సామాజిక నాటకాలు రాసింది ..అందులో ‘’ఏ కేస్ ఆఫ్ డైవోర్స్ ‘’నాటకం రాసి 1881 లో ప్రదర్శించింది .అదొక సెంటిమెంటల్ స్టఫ్ అన్నారందరూ .డ్రామాలో రెండోపెళ్ళి లేదు .ఆ కాలం లో ఇటలీ లో స్త్రీ రచయితలూ అరుదు గా ఉండేవారు .రాసినా వాటిని ప్రచురించటం జరిగేది కాదు .బెకారి నాటకం రాయటమేకాక ప్రచురించి ప్రదర్శన కూడా ఇచ్చి రికార్డు సృష్టించింది .ఇది ఆనాటి సమాజం లో అరుదైన అద్భుతం .1945లో ఫాసిస్ట్ ప్రభుత్వ పతనం తర్వాతనే ఇటలీలో స్త్రీలకు వోటు హక్కు లభించింది .బెకారి లాంటి ఎందరో మహిళల పోరాట ఫలితం ఇది .అలాగే 1970లో మాత్రమే విడాకుల హక్కు చట్టమైంది .
పిల్లల పత్రిక మామ్మ: అనారోగ్యం పాలైన బెకారి 1887 లో ఉమన్ పత్రిక సంపాదకత్వాన్ని వదులుకొని ఎమిలీ మారియానా కు అప్పగించింది .ఆఖరు వరకు బెకారి రాస్తూనే ఉంది .పిల్లలకోసం ‘’మామ్మ ‘’పత్రిక పెట్టి నడిపింది .స్త్రీలు తమ కార్య రంగాన్ని ఎంచుకోవటానికి బెకారే తోడ్పడి ఆదుకొనేది .ఇటలీలో మహిళా కార్యక్రమాలకు ప్రభుత్వం ప్రజల తోడ్పాటు చాలా నిరాశా జనకం గా ఉండటాన్ని జీర్ణించుకోలేక పోయింది .
సోషలిజం కు సమర్ధన సోషలిజం ను వాచాఅంటే మాటలతో సమర్ధించింది .ఇది సామాన్య ఫెమినిస్ట్ లకు మింగుడు పడలేదు .బెకారికి వీరు మద్దతు ఇవ్వలేదు .
– గబ్బిట దుర్గా ప్రసాద్
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`~~~