కళ ని ఒక కళగానే నేర్పించండి . ఒత్తిడి దూరం అవుతుంది . మానసిక బలం పెరుగుతుంది . మన సంస్కృతి సంప్రదాయాలను ముందు తరాల వారికి అందించాల్సిన బాధ్యత మనదే కదా అంటున్న నాట్యాచార్య శ్రీమతి రమాదేవిగారి తో ఈ నెల నర్తనకేళి ముఖాముఖి ……..
*నమస్కారం రమాదేవి గారు?
నమస్కారం రండి , కూర్చోండి .
*మీ తల్లిదండ్రులు గురించి , మీ స్వస్థలం ఎక్కడ ?
మా నాన్న పేరు వీరబాబు వ్యాపారస్తులు . మా అమ్మ పేరు రమణ గృహిణి . నేను ఒక్కదాన్నే .
*మీకు నాట్యం పై ఎలా ఆసక్తి కలిగింది ?
మా ఊరిలో ప్రతి సంవత్సరం గణపతి , దసరా , మహా శివరాత్రికి జరిగే ఉత్సవాలలో ఆలయ నాట్యం ప్రదర్శనలు జరుగుతూ ఉండేవి . పైగా మా నాన్న గారికి నాట్యం సంగీతం అంటే ఆసక్తి ఇష్టం . ఆయన ప్రోత్సాహంతోనే నాట్యం లో చేరాను .
*మీ తొలి గురువు ?
శ్రీమతి జ్యోతి గారి వద్ద ఆంద్ర నాట్యం లో శిక్షణ ప్రారంభించాను. తరవాత కూచిపూడి లో సర్టిఫికేట్, డిప్లమో చేసాను .
*మీ తొలి ప్రదర్శన ఎప్పుడు , ఎక్కడ జరిగింది ?
నా ఎనిమిది సంవత్సరాల వయస్సులో కాకినాడలో సత్కళా వాహినిలో నా అరంగేట్రం జరిగింది .
*మీ కుటుంబం గురించి చెప్పండి ?
మా వారి పేరు గణేష్ కుమార్ . వ్యాపార వేత్త . మాకు ఇద్దరు అమ్మాయిలు పేరు భువనేశ్వరి , రాగిణి .
* మీ నృత్య శిక్షణా సంస్థ పేరు , ఎప్పుడు ప్రారంభించారు ?
“ఈశ్వరిరాగ నృత్య అకాడమి” 2005 లో మొదలుపెట్టాను .
*మీ నృత్య అకాడమి ద్వారా ఎన్ని ప్రదర్శనలు ఇచ్చారు ?
మా నృత్య అకాడమి నుంచి సుమారుగా 1000 ప్రదర్శనలు ఇచ్చాము . ధనుర్మాసం , దసరా, మహాశివరాత్రి ఇలా కొన్ని ప్రత్యేక సందర్భాలలో ప్రతి ఏటా చేస్తున్నాము .
*మీ శిష్యులకి ఇచ్చే శిక్షణ ఏ విధంగా ఉంటుంది ?
నేను మా శిష్యులకి ఆంద్ర నాట్యం , కూచిపూడి రెండు సంప్రదాయాలలోనూ శిక్షన్ ఇస్తాను.
*ఆంద్ర నాట్యం , కూచిపూడి రెండింటికి ఉన్న తేడా ఏమిటి ?
ఆంద్ర నాట్యంలో ఆలయ సాంప్రదాయంగా వచ్చే దేవ నర్తకి , రాజాస్థానంలో చేసే రాజ నర్తకి , పేరిణి సాంప్రదాయం , ఉన్నాయి . కూచిపూడి నాట్యం లో యక్షగాన ప్రక్రియ నుంచి వచ్చింది .
*పేరిణి అంటే ఏమిటి ?
శుద్ధ , దేశి , కలశ , దండిక ,కుండలి, ప్రేంఖణ , ప్రేరణ అనే శివుని తాండవాలలో పేరిణి ఒకటి . ఈ నాట్యం కాకతీయుల కాలంలో ఆదరణ చూరగొంది . శివుని ప్రేరణ చేసి ,శివశక్తి ని తనపై ఆవహింపజేసుకుని కళాకారుడు ఈ పేరిణి తాండవాన్ని చేస్తాడు .
*ఆంద్ర నాట్యం ప్రదర్శన విధానం ఎలా ఉంటుంది ?
ఆంద్ర నాట్యాన్ని మూడు భాగాలుగా విభజించవచ్చు . కుంభ హారతితో ప్రదర్శన ప్రారంభిస్తారు . తర్వాత పుష్పాంజలి తర్వాత కవుతం ,కైవారం మొదలైనవి చేయడం జరుగుతుంది .
*కూచిపూడి ప్రదర్శన విధానం ఎలా సాగుతుంది ?
కూచిపూడిలో ముందుగా రంగ పూజ ఉంటుంది . తర్వాత వినాయక కౌతం , కీర్తనలు , జావళీలు , రామాయణ కీర్తన మిగిలిన ప్రదర్శన మొదలవుతుంది .
*కూచిపూడిలో రంగ పూజ అంటున్నారుకదా ? ప్రస్తుత కాలంలో రంగ పూజ ప్రదర్శన అంతగా జరగటం లేదు , దీనికి మీరేమంటారు ?
అవునండి . రంగ పూజ అనేది ఇప్పుడు చాలా తక్కువ మంది చేస్తున్నారు . అయితే కొంత మందికి తెలియక , మరికొంత సమయం సరిపోక కూడా రంగ పూజ చేయడానికి కుదరడం లేదు అనే చెప్పాలి .
*మీరు చేసిన ప్రదర్శనలు కొన్నింటి గురించి మా చదువరుల కోసం ?
అన్నమయ్య కీర్తన ల పై ఒక నృత్య రూపకం, పదాలు , జావళీలు చేసాము .
*మీ భవిష్యత్ ప్రణాళిక ?
సంస్కృతి పరిరక్షణ పై ఒక నృత్య రూపకాన్ని కూడా చేయడానికి ప్రయత్నిస్తున్నాను .
*మా విహంగ చదువరులకి మీరిచ్చే సలహా ?
కళ ని ఒక కళగానే నేర్పించండి . ఒత్తిడి దూరం అవుతుంది . మానసిక బలం పెరుగుతుంది . మన సంస్కృతి సంప్రదాయాలను ముందు తరాల వారికి అంటే ఒక నాట్యం అనే కాదు అది ఏ రంగంలోని కళ అయిన భావితరాల వారికి అందిచవలిసిన బాధ్యత మనపైనే ఉంది .