గత 25 సంవత్సరాలు నుంచి అమెరికా హ్యుస్టన్ , టెక్సాస్ లో నివాసం ఉంటున్న కోసూరి ఉమాభారతి ప్రముఖ కూచిపూడి నాట్య కళాకారిణి . నాట్యం ద్వారా దేశ విదేశాలలో పర్యటించి ప్రదర్శనలు ఇచ్చి, స్వచ్చంద సంస్థలకి సమాజ సేవకి అంతర్జాతీయంగా గుర్తింపు పొందారు . పలు నృత్య రూపకాలను రూపొందించి ప్రదర్శనలు ఇచ్చిన ఆమె సాహిత్యం లోను పలు రచనలు చేశారు . ప్రవాసాంధ్రుల జీవన విధానం తోపాటు , మాతృ దేశంలోని మధ్య తరగతి కుటుంబాల జీవన విధానం , వారి సమస్యలు ఆమె రచనలలో ప్రతిఫలిస్తాయి. ఆమె రాసిన రెండవ నవల ఎగిరే పావురమా . ఈ నవల చదువుతున్నంత సేపు మనం నిత్యం చూస్తున్న సంఘటనలే మన కళ్ళ ముందు మరొకసారి కదుల్తాయి . ఈ నవల రాయాడానికి కారణం రచయిత్రి మాటల్లోనే “ మహారాష్ట్రలో కొద్ది మంది గ్రామీణులు తమ ఆడపిల్లలకి నకూసా అని పేరు పెడతారని , నకూసా అంటే అవాంఛిత అని అర్ధం . నకూస వద్దంటే పుట్టిన ఆడపిల్ల . చంపలేక వదిలేసినా ఆడపిల్లే నకూసా . “ ఈ కధనం తనని ఎంతో కలిచి వేసిందని దాని పలితమే ఈ నవల అంటారామె .
ఈ నవలలో అన్ని పాత్ర.లు ప్రధాన పాత్రలే అని చెప్పాలి . గాయిత్రి , సత్యం , ఉమ , పూజారి , చంద్రమ్మ , రాములు , కమలమ్మ , డా .మల్లిక్ , గోవింద్ , రాంబాబు , సరోజీని దేవి , జేమ్స్ . కథ అంతా గాయిత్రి చుట్టూనే తిరుగుతుంది . కథ నడిచే క్రమంలో పాత్రలు కన్పిస్తాయి కాని అనవసరమైన పాత్రలు ఉన్నట్లు ఎక్కడా అనిపించదు . మనం నిత్యం చూసే పాత్రలు ప్రతీకలే కాబట్టి ఎక్కడా వర్ణనలు , అతిశయం ఉండవు .
గాయిత్రి ఒక నకూస . ఆ పాపని సత్యం తాత పెంచుకుంటాడు . ఆ ఊరి గుడిలో పని చేసి జీవనం సాగిస్తూంటాడు . సత్యం తాత అంటే చంద్రమ్మ కి , రాములు కి అభిమానం . కష్ట కాలంలో వారిని ఆదుకున్నాడు తాత .రాములు కూడా ఆ గుడిలోనే పనిచేస్తుంది. గాయిత్రి కాళ్లు చచ్చుబడిపోయాయి , మాటలు కూడా రావడం లేదు . తాతకి గట్టి నమ్మకం మెరుగైన వైద్యం చేయిస్తే తప్పక నయమవుతాయని . పూజారి సాయంతో గాయిత్రికి పెద్ద ఆసుపత్రిలో వైద్యం చేయించాలని ఆశఆరాతపడుతుంటాడు .తల్లి లేని ఆడపిల్ల అని ఆన్ని అవసరాలకు సాయం ఉంటారు చంద్రమ్మ , రాములు . పెరిగి పెద్దదవుతున్న గాయిత్రికి పూజారి గారి అమ్మాయి ఉమ చదువు చెబుతుంది . ఆ నాలుగు ముక్కలైన వస్తే లోకం తీరు గాయిత్రికి తెలుస్తుందని తాత ఆశ .డా . మల్లిక్ సలహా , వైద్యం వల్ల గాయిత్రి కి మెరుగైన వాద్యం అందడంతో కొంత కాలానికి ఊత కర్ర సాయంతో పట్టుకుని నడిచే స్థితికి వస్తుంది గాయిత్రి . తన మామకి ఆరోగ్యం బాగోలేదని ఊరెళ్ళి పోయిన రాములు స్థానంలో కమలమ్మ పనిలోకి వస్తుంది . గాయిత్రి మనసుని పాడు చేసి తాత నుండి దూరం చేసి పట్నం తీసుకుపోతుంది కమలమ్మ . కమలమ్మ , ఆమె తమ్ముడి మాటల నమ్మి పట్నం వెళ్ళిన తరవాత కాని తెలియదు గాయిత్రికి .
చిన్నతనం నుంచి గుడి దగ్గర తన చుట్టూ నూకల కోసం వచ్చే పావురాలు , నూకలు తిని ఎగిరి పోతుంతే వాటిని చూసి నేను వాటిలా ఎగరలేక పోతున్నాను (నడవలేక పోతున్నాను ) అని బాధపడే గాయిత్రి అసలు ఎగరడం వలన కలిగే కష్ట సుఖాలు గురించి తెలియలేదు . పట్నం చేరిన గాయిత్రి జేమ్స్ ద్వారా ఎదురైన పరిస్థితులు మన చుట్టూ ఆడ పిల్లలకే కాదు , అంగవైకల్యం ఉన్న వాళ్లు కూడా ఎలాంటి బాధలను గురవుతున్నారో తెలుస్తుంది . గాయిత్రి మీద బెంగతో తాత ఆరోగ్యం నానాటికి క్షీణిస్తుంది . చిరవకి తిరిగి గాయిత్రి తాతని కలుసుకుందా లేదా ? చిన్నతనం నుంచి అమ్మ ఒడిలా ఆదరించిన గుడి పొదరింటికి ఈ ఎగిరిన పావురము చేరిందా లేదా అనేది నవల చదివి తెలుసుకోవాల్సిందే .
ఈ నవల మొత్తం ఉత్తమ పురుషలోనే సాగుతుంది . గాయిత్రి తన కథని , వ్యధని స్వయంగా నా కళ్ళ ముందు నిలబడి చెబుతున్న అనుభూతి కలిగింది నాకు . ఇక గుడి వాతావరణం చదువుతుంటే దేవాలయంలో కలిగే ప్రశాంత , హాయి మనసుని పలకరిస్తుంది . రచయిత్రి కొన్ని సంవత్సరాలుగా అమెరికాలో స్థిర పడిన కాని పల్లెటూరి యాస, భాష అద్భుతంగా తన రచనలో చూపించారు . ఎంత దూరంలో ఉన్న మాతృ భాష పై ఉన్న మమకారం ,ఆ వాతావరణం వారి గుండెల్లో పదిలంగా ఉంటాయి అనడంలో ఈ రచన శైలి ఒక తార నిదర్శనం .
నవల చదువుతున్నంత సేపు ఒక వైపు ఆహ్లాదకరమైన గుడి వాతావరణం , మరొక వైపు పల్లెటూరి ప్రేమలు , ఆప్యాతలు , వెనువెంటనే కన్పించే మోసకారితనం అన్ని దర్శనమిస్తాయి . నిస్వార్ధమైన ప్రేమ , స్వార్ధమైన మనుషులు , ఆర్ధిక పరిస్థితులు , ఇక ఆడపిల్ల పై జరిగే దౌర్జన్యాలు , నిరాదరణ ఇవి తరాలు మారుతున్న ఇప్పటికి ఎక్కడో అక్కడ జరుగుతూనే ఉన్నాయి అనడానికి ఈ నవలే ఒక ఉదాహరణ . తప్పక చదవాల్సిన నవల .
ఈ ప్రతుల కొరకు :
రచయిత్రి : కోసూరి ఉమాభారతి
వెల :75
నవదోయ బుక్స్ హౌస్
ఆర్య సమాజ మందిరం , బాడి చౌడి , హైదరాబాద్ .
– శ్రీనివాస్ గొర్రిపాటి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
3 Responses to కోసూరి ఉమా భారతి – ఎగిరే పావురమా