ISSN 2278-478
సాహిత్యంలో ప్రాచీనం , ఆధునికాలకు ఎంత వైవిధ్యం ఉందో, గ్రాంధికం , వ్యవహారిక భాషలకి ఎంత వైరుధ్యం కలదో , పద్యానికి , వచనానికి అంతే వ్యత్యాసం ఉంది . ప్రాచీనులకి పద్యం , ఆధునికులకి వచనం ఆలవాలమైంది . సాహిత్యాన్ని పామరులకు సైతం దగ్గరగా తీసుకు వెళ్లిన ఘనత వచనానికే దక్కుతుంది . అందుకే ఆధునిక సాహిత్యం వచనంతోనే ప్రకాశిస్తుంది అంటూ
“ పాత కాలం పద్యమైతే / వర్తమానం వచన కవిత్వం “ వచనానికి అధిక ప్రాముఖ్యం ఇచ్చిన కవి , వచన కవితా పితామహుడిగా పేరుగాంచిన వ్యక్తి కుందుర్తి .
కుందుర్తి గా ప్రసిద్ధి చెందిన . ఈయన పేరు ఆంజనేయులు . కుందుర్తి ఇంటి పేరు . 19 22 డిసెంబర్ 16 న కామయ్య , నరసమ్మ దంపతులకు నర్సారావు పేట సమీపంలోని కోట వారి పాలెంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించాడు . నిఘంటువులు అవసరంలేని భాషలో కవిత్వం రావాలని ఆశించాడు . 19 7 6 లో ప్రీవర్స్ ఫ్రంట్ ను స్థాపించి వచన కవితోద్యమానికి మూల స్తంభంగా నిలిచాడు . సోవియట్ ల్యాండ్ నెహ్రు అవార్డు , ఆంద్ర ప్రదేశ్ సాహిత్య అకాడమి అవార్డు అందుకున్నారు . నయాగరా , తెలంగాణ , నగరంలోని వన , యుగే ..యుగే , నాలోని నాదాలు , మాతృ గీతం , ఇదేనా దేశం మొదలైనవి వీరి రచనలు . కుందుర్తి , బెల్లంకొండ రామదాసు , ఏల్చూరి సుబ్రహ్మణ్యం వీరిని నయాగరా కవులు అంటారు . కుందుర్తి రచనల్ని కుందుర్తి కృతులు పేరుతో ప్రచురించబడ్డాయి .
తెలంగాణ కవితా సంపుటిలో మొత్తం 26 కవితలున్నాయి . మొదటి కవిత ప్రస్తావన లో భారత దేశం యొక్క చరిత్రని , వర్తమానాన్ని ఈ కవితలో వివరించాడు . భారత దేశంలోని రాజులు గురించి , రాచరికాలు గురించి తెలుపుతూ
“పూర్వం ఒకనాడు
ఒక రాజు యింకోరాజును
దండెత్తి ఓడించాడు
ఓడినరాజు వారసులు విజేత రాజును బలిగొని
అతని రాజ్యం ఆక్రమించాడు .” అంటూ పూర్వం భారత దేశం లో రాజుల గురించి , ఒకరు మీద ఒకరు ఏవిధంగా ఆధిపత్యం చెలాయించాలి అని ఆరాట పడేవారో చివరకి అందరు కలిసి పాలన అధికారాన్ని విదేశీయుల పరం చేసారో చెప్పాడు .
రాను రాను కొన్నాళ్లకు
వారు రాజులయ్యారు
ప్రజలు బానిసలయ్యారు “ అనడంలో విదేశీయులు మనపై అధికారాన్ని ఎలా చేజిక్కించుకున్నారో తెలుస్తుంది . అలాగే సింహాసన కవితలో హైదరాబాద్ సంస్థానం గురించి , అక్కడి ప్రజల అవస్థలను చెబుతూ …” దేశంలోని సంస్తానాలన్నింటిలో / హైదరాబాదు పెద్దది / భూస్వామికుల బాధల్ని ప్రజలు సహించిన / చిట్టచివరి హద్ద అది “ తెలంగాణాలోని హైదరాబాద్ స్థానంతెలుస్తుంది . ప్రజలు ఉద్యమించాల్సిన సమయం వచ్చిందని “ప్రజోద్యమ” కవితలో …
“ఏ రోజు కారోజు రాజు గారి కొలువులో
వెట్టి చేసే వాడు
ఏ పూట కాపూట కడుపును
నిందించుకునే వాడు
చరిత్ర రధ చక్ర గమనాన్ని
శాసించ బూనుకున్నాడు “ బానిసత్వం , పేదరికం ఏ స్థాయిలో ఉన్నాయో అవగతమవుతాయి .
కుందుర్తి పేరు చెప్పగానే గుర్తుకు వచ్చే కవిత “ నగరంలోని వాన “. ఈ కవిత నగరంలోని వాన కవితా సంపుటిలోని మొదటి కవిత . నగరంలో కురిసే వాన మనుషులతో ఆడే దాగుడుమూతలు , నగర వాసులకు కలిగించే ఇబ్బందులు , అలాగే వాళ్ల మీద అప్పుడప్పుడు చూపించే కనికరం అన్నింటిని హృద్యంగా వర్ణించాడు కుందుర్తి . ఈ కవితలో రచయిత తనకు తెలిసిన నగరంలోని వాన అంటే హైదరాబాదు నగరంలోని వాన అని ముగిస్తాడు . కాని ఈ వాన ప్రతి నగరం లో కురిసే వానకి ప్రతీకగా ఉంటుంది .
“ నగరంలో వాన
కవిత్వం నా ఊహాంచలాల్లో కదిలాడుతున్నట్లు
జల్లులు జల్లులై కురుస్తుంది “ అంటూ మొదలవుతుంది . నగరంలోని భవానాలు , రోడ్లపై , పడే వర్ష వలన అవి ఎలా కన్పిస్తున్నాయో ఈ విధంగా వర్ణిస్తాడు రచయిత . “నున్నగా తెల్లగా తళతళలాడే/ సిమెంటు రోడ్డు అద్దాలోకి /మింటి నుంచి మెడలు వంచి” మిల మిలా మెరుస్తున్నాయి మేఘాలు అంటాడు కవి . నగరంలో కనిపించే రెండతస్తుల బస్సులను చూసి గిరిశిఖరాలు అనుకుని మేఘాలనుకుని భ్రాంతి పడ్డాయని చమత్కరిస్తాడు .
నగరంలోని బ్రతికే మధ్య తరగతి వాడికి వర్షం వస్తే పడే అవస్థను వివరిస్తూ , వాడి ఆర్ధిక పరిస్థితిని మించి కొనలేనిస్థితిలో తడిసి ఇంటికి వచ్చి కుంపటి ముందు కూర్చుని ఉన్న ఉద్యోగి చూస్తూ తను చేసిన ఘన కార్యం కనులార చూసుకోవాలని /కిటికీ లోంచి తొగి చూస్తుంది చిటపట చిలిపి జల్లుల్తో . నగరంలో కురిసే వాన గడుసరిదే దానికి కాస్తో కూస్తో జాలి , దయ ఉన్నాయని మూడునాళ్ల పసిపాపను /ముద్దుగా ఒడిలో గుండెలకు కద్దుకుంటూ / ఆసుపత్రినుంచి ఇంటికి వచ్చే బాలెంతరాల మీద పూలజల్లు కోరుస్తుందే కాని జోరున వర్షం పడదు , అంటూ వర్ష జాలిని తెలియజేస్తాడు .
యుగే …యుగే కవితా సంపుటిలో నేను కవితలో తన కవిత్వం ఎవరికి చేరాలో తెలుపుతూ “ ఇది నా కవిత్వం గీత , వినేవాడు నరుడు /చదువు సంధ్యలు రాణి రోడ్డు మీద పామరుడు “ . రేడియో ఏడ్చింది . మహాత్ముని అస్తమయం గురించి రేడియోలో విన్న వార్త . మహాత్ముడిక లేడు . అనే కవితలో “ గౌరీ శంకర శిఖరం యేరుగా పారింది /గంగానది శోక బాష్పములు కాల్వలు కట్టింది /వెన్నెల హృదిలో /తమస్సు తెర విరిసింది /నీవు వాటికి సహోదరుడువు /వాటి కీర్తికి సహోదరుడవు “ ఆ మహాత్ముని కీర్తిని తెలియజేసాడు . తని గువువైన కవి సామ్రాట్ విశ్వనాధ షష్టి పూర్తికి రాసిన ఈ కవిత “ పూంభావ సరస్వతి , పూజ్య పాదులు /గురువుగారికి నమస్కారం / షష్టి పూర్తి సన్మాన సంఘం , నిర్వాహకులకు అభినందనలు / అప్పుడే అరవై నిండాయి / కాలానికి ఎందుకోయింత వేగం ? / ఆగమంటే ఆగదు /ఆయన ప్రభావంతో /మీలాగే రాసి ,అలాగే చదివి /ఉపన్యాసాలు చేద్దామని ఉవ్విళ్ళూరే రోజుల్లో /అనుకరణ లని ఎవరేనా చెప్పినా సరే /అవమానం లేని రోజుల్లో ……..ఐ ఇంకా వెలుగులోకి రాలేదు /దాని పేరు “సౌప్తికం “, పాపం ! ఇంకా నిద్రిస్తూనే ఉంది . “ తన గురువు ప్రభావాన్ని వివరిస్తాడు .
బుద్ద జయంతి కవితలో “ అంతగా బుద్దుడిని పూజించడం మానేసి /అనుసరిద్దాం ఆయన బోధనలు /అహింస తో , సత్యంతో /పరిష్కరిద్దాం మన బాధలు “మనం స్వాతంత్ర్యం కోసం చేసిన పోరును చూసిన ఇతర దేశాల వారు దానిని అనుసరిస్తుంటే , వలస రాజ్యాల ప్రభువుల బ్రతుకుల్లో చీకటి ప్రారంభమైందని తెలియజేస్తూ పంచశీల గురించి , అహింసను గురించి దేశ విదేశాలపై వాటి ప్రభావాన్ని వివరించాడు .
మాతృ గీతం కవితా సంపుటిలో మాతృ గీతం లో తల్లిని తలుచుకుని రోదించే సందర్భంలో….
“ అమ్మ! నిన్ను చూడాలని ఉంది /నువ్వింక మా ఇంటికి లేవన్న ఊహ /నాలో ఒక వింతైన నవ్వుగా పరిణమిస్తున్నది “ విలపిస్తాడు . అమ్మ దూరమయ్యిన క్షణంలో తన స్థితిని చెబుతూ “ అమ్మ క్షణంలో నన్ను /ప్రాణం ఉన్న మట్టి బొమ్మగా చేశావు /ఓదార్పుల గాలి లేంది కదల్లేని /చెట్లు కొమ్మగా చేశావు అంటూ తన బాధను వ్యక్తపరుస్తాడు .
ఇదీ నా దేశం కవితలో ఇది నా దేశం / అని చెప్పుకోవడానికి కొంచెం సిగ్గుగా ఉంది “ అంటూ మొదలైన ఈ కవితలో ప్రతి పాదం తరవాత ఈ పదాలు కన్పిస్తాయి . సమాజంలోని ధర్మం గురించి , జరిగిన దోపిడీ వ్యవస్థను , దానిని క్రమబద్దంగా చేయలేని నిస్సహాయతని ప్రశ్నించుకుంటూ , సామాన్యుడి పరిస్థితిని చెబుతూ “ దేశ స్థితిని వివరిస్తూ / తినేది తక్కువా తీసి పారేసేది ఎక్కువ /సీతాఫలం పండులా ఉంది నా దేశం “అని దేశలోని పరిస్థితిని వివరిస్తాడు .
ఈ విధంగా కుందుర్తి కవితలన్నింటిలోనూ మానవీయత , దేశభక్తి , ప్రకృతి , సామాజిక సమస్యలు , సంఘటనలు , మహనీయుల గురించి వచన రూపంలో ఆవిష్కరించారు . సామాన్య చదువరునికి కూడా చేరేలా చేయవచ్చని నిరూపించారు .
– అరసి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`
One Response to వచన కవితా పితామహుడు “కుందుర్తి”- అరసి