పోయిన నెల సి.ఉమాదేవి గారి పుస్తకాలు ఆరు అవిష్కరించబడ్డాయి అని చెప్పుకున్నాము. వాటిల్లో, కేర్ టేకర్, మటే మంత్రము,సాగర కెరటం గురించి పరిచయం చేసాను. ఈ నెల మిగిలిన మూడు పుస్తకాలను పరిచయం చేస్తాను.అందులో మొదటగా “మంచి మాట-మంచిబాట” గురించి. . .
.
రెండు విభిన్న కుటుంబాలకు చెందిన యువతీ , యువకులు వివాహబంధంతో ఒకటవుతారు.అప్పటి వరకూ విడి విడిగా ఉద్యోగాలు చేసుకుంటూ తమ తమ జీతాలను ఖర్చు పెట్టుకున్నవారు ఒకేసారిగా ఉమ్మడిగా ఖర్చు చేసుకునేందుకు సిద్దంగా వుండరు.నీకు , నీ స్నేహితులకు ఖర్చు చేస్తున్నావని భార్య,నీ చీరలు , సినిమాలే తలక్రిందులుగా చేస్తున్నాయని భర్త , కీచులాటలు మొదలవుతాయి. జీతాలూ , జీవితాలూ పంచుకోవాలి అని వారికి తెలిపేది ఎవరు?
గృహిణిగానే కాక ఉద్యోగినిగా కూడా జోడుగుర్రాల మీద స్వారీ చేస్తున్న మహిళకు తన గురించి తాను పట్టించుకునే తీరిక వుండదు. అకస్మాత్తుగా తన శరీరం పెరిగిపోయిందని , బరువు పెరిగి పోయిందని చింత మొదలవుతుంది. మరి అలాంటప్పుడు డైట్ ప్లాన్ తో సన్నబడవచ్చా ?
వివాహమై అత్తవారింట అడుగుపెట్టిన అమ్మాయి తనకు నచ్చినా , నచ్చకపోయినా అన్నిటికీ మనసు చంపుకొని తనే సద్దుకుపోవాలా ?
తలనొప్పి గుండెదడ ఏదో టెన్షన్ గా వుంటోంది.అలజడిగా వుంటుంది. మరి ఏమి చేయాలి?
నేను ఈ పని చేయగలనా ? ఇందులో విజయం సాధించగలనా ? అని నెగిటివ్ థాట్స్ తో పనులు మొదలుపెట్టవద్దు అని భోదిస్తారు రచయిత్రి.
మనిషికి మాత్రమే లభించిన అపురూపవరం వాక్కు. మరి దాని సరిగ్గా ఎలా ఉపయోగించుకోవాలి?
కొద్దికాలం క్రితం వరకూ ఉమ్మడి కుటుంబాలు వుండేవి. బామ్మలు, అమ్మమ్మలు, తాతయ్యలు పిల్లలకు నీతి కథలు చెబుతూ లోక రీతిని భోధించేవారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా వారి అనుభవంతో పరిష్కారం చూపించేవారు. మరి ఈ రోజులలో ఉమ్మడి కుటుంబాలు లేవు. పిల్లలు చదువుల భారం లో మునిగిపోయివున్నారు. చిన్నతనము లోనే చదువుల కోసం హాస్టల్స్ లలో వుండటమూ, విదేశాలకు వెళ్ళటము తో పెద్దవాళ్ళ దగ్గర గడిపే సమయము వుండటము లేదు. చదువుల ప్రపంచం నుంచి బయట పడ్డాక లోకమంతా కొత్తగా వుంటుంది. ఎంతసేపూ చదువులూ, రాంకుల పరుగులతో వున్నవారికి లోకజ్ఞానం తక్కువ .ఏ కొద్దిపాటి సమస్య వచ్చినా ఉక్కిరిబిక్కిరి ఐపోతారు. ఏమి చేయాలో , ఎవరిని అడగాలో తెలీదు అలాంటి వారు, వారనేముంది సమస్య వచ్చిన ప్రతి వారికీ ఇలాంటి నిత్యజీవితము లో ఎదుర్కొనే అనేక సమస్యలకు , ఓ అమ్మలా , అమ్మమ్మలా పరిష్కారాలు చూపించారు రచయిత్రి ,”మంచి మాట-మంచిబాట”లో.
అమ్మంటే . . . !
(కవితలు)
రచయిత్రి సి.ఉమాదేవి గారు చెప్పినట్లు “సాహితీవనం లో నర్తించే కవితలలోని చమక్కులు , చురుక్కులు వ్యక్తిలో అవ్యక్తం కాని భావలాహిరిని ఊయలలూపి మనసు లోయులని స్పృశిస్తాయి. అవి ఒకసారి పాటలై జోలపాడుతాయి.మరొకసారి శతఘ్నులై గర్జిస్తాయి.ఏ కవితకైనా సామాజిక శ్రేయస్సే ప్రధానము .”
అమ్మ లాలిత్యము గురించి “అమ్మంటే” అనే కవితలో,ముత్యాల మాల తో,రతనాల హారము తో బంధీ చేసిన మగువను తెగువ చూపించమంటూ “బంధి” లో, జీవన్నటకం లో ఎవరికీ అక్కరలేని వృద్ధపాత్రల గురించి “వ్ర్ర్ధక్య చిత్ర్మ్” లోనూ ,గల్లంతైన చిరునామా గురించి “మానవతకు చిరునామా ” లోనూ జీవన పరుగులో ర్యాంకు, బాంకు మంత్రాక్షరాల గురించి , ఆంధ్రప్రభ – అభినందన లో ఉత్తమ కవితగా బహుమతి పొందిన కవిత “మనిషి నిర్వచనం” లోనూ , ఇలా వివిధ విషయాల మీద చక్కగా మనసుకు హత్తుకునేలా కవిత వ్రాశారు సి. ఉమాదేవి గారు. వాటి ని ఇంగ్లీష్ లో కూడా అనువాదము చేసారు. “అమ్మతనం” కవితకు డాక్ట్ర్-పోతుకూచి అవార్డు,”మానవతకు చిరునామా” కవితకు ఎక్స్ రే అవార్డు,ఆంధ్రప్రభ- ఆరాధన సమ్యుక్తంగా నిర్వహించిన కవితల పోటీలో “మనిషి నిర్వచనం” కవితలు బహుమతులు పొందాయి.
చల్లని సాయంకాలము,మలయమారుతాలు వంటిని తాకుతూవుంటే హాయిగా , ఆస్వాదిస్తూ చదువుకునేలా , ఆహ్లాదంగానూ , ఆలోచనా భరితము గానూ వున్నాయి కవితలన్ని!
ఏ కథలో ఏముందో
సమీక్షలు
పసితనము లో అమ్మ లాలిపాటల తో పాటు కథలు వినని వారు వుండరు. చెవిలో మృదుమధురం గా అమ్మ చెప్పే కథలు మనసులో హత్తుకొని పోతాయి. ఆ కథ లోని నాయకుడు , నాయకి లని అమ్మ వర్ణించి చెపుతూ వుంటే ఎప్పుడెప్పుడు వారిని చూస్తామా అని ఆతృత పడుతాము.పెద్ద వాళ్ళైనా ఆ కథ లు ,ఆ వర్ణనలు మనసు లో నుంచి పోవు. ఆ కథ ల పుస్తకాలు చదువుతూ వుంటే అమ్మ వడే గుర్తొస్తుంది. ఇంకా ఉత్సాహం గా ఆ కథను చదువుతాము. పుస్తక పఠనం లో ఆసక్తి కలుగుతుంది. అదే అలవాటు తో ఏదైనా పుస్తకం చదివేందుకు తీయగానే ముందుగా వెనక అట్ట మీద రచయత పరిచయం చూస్తాము. పీఠిక లో ఆ పుస్తకం గురించి ఏమిరాసారా అని చూస్తాము. ఆ తరువాతే చదవటం మొదలుపెడుతాము.కొన్ని సార్లు ఆ సమీక్ష నచ్చక పోతే ఆ పుస్తకం చదవకుండా వదిలేస్తాము కూడా. పుస్తక పఠనం లో సమీక్ష అంతగా చోటు చేసుకుంటుంది.
సి. ఉమాదేవి గారు వివిధ పత్రికలకు పుస్తక సమీక్షలు పంపుతుంటారు. అలా పంపిన పుస్తక సమీక్ష లన్నీ , ” ఏ కథలో ఏముందో” అనే పుస్తకము లోకి చేర్చారు. ఇందులో , కథల పైన,నవలలపైన, కథాజగత్ లో ప్రచురించబడిన కథల పై విశ్లేషణ , కవితా సమీక్షలు వున్నాయి. అన్నీ సరళమైన బాషలో సమీక్షించారు. ఆ సమీక్షలు చదవగానే ఆ పుస్తకం వెంటనే చదవాలనిపిస్తుంది.కథాజగత్ లో ప్రచురించిబడిన కథల పై వ్రాసిన విశ్లేషణల లో ” కొడిగట్టరాని దీపాలు” పై సమీక్షకు మొదటి బహుమతి లభించింది.
కథైనా , కవితైనా, నవలైనా , పుస్తక సమీక్షైనా పాఠకుడిని తనతో తీసుకెళ్ళే నేర్పరి సి.ఉమాదేవి. ఏదైనా చదవటము మొదలు పెడితే పూర్తైయ్యెవరకూ వదలలేము.
– మాలా కుమార్
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~