ఓయినం

Gowri jajula ఎల్లమ్మ పరుగునొస్తున్న తల్లిగోడు విన్న నీలమ్మ ”ఓయ్యో మా అమ్మొచ్చిందే లేయే” అంటూ బిగ్గరగా అరిచి తల్లి దిక్కు చేతులు చాపంగానే ఎల్లమ్మ ఒక్క ఉదుటన ఇంట్లోకి వచ్చి బిడ్డను పట్టుకుని బోరుమన్నది. తల్లిని చూస్తుండగానే నీలమ్మ దుఃఖం కట్టలు తెంచుకుంది. పదకొండు పన్నెండయ్యేసరికి చుట్టాలు పక్కాలందరు వచ్చారు. సత్తయ్య వాకిలంతా ఏడ్పులు పెడబొబ్బలతో నిండిపోయింది. పెద్దలందరు ఒక్కదగ్గర చేరి ”ఇంగో ఆళ్ళ పెద్దనాయిన ఉర్లో లేడు నిన్న పొద్దుగాల్ళనే బర్లబారంకి పోయిండట. ఏ వూరికి పోయిండో తెల్వదు గిప్పుడు సావుదినాలు ఎట్ల జేస్తరు చెప్పండ్రి” అన్నారు. ”ఎట్లంటే మేమందరం లేమా” అన్నాడు చంద్రయ్య. ”గదికాదు కొడ్కా సత్తిగాడు ఇంకా రాకపాయే ఆడు వచ్చేదాకా ఆపుదామా” అన్నాడు.
”గట్లేం వద్దు ఇప్పటికే రాత్రింపగళ్ళు రెండు పూటలాయే ఇంకెంతసేపు పీనుగుని ఇంట్ల పెడ్త జెప్పండ్రి. చలో సావు ఎవళ్ళు జేస్తరో జెప్తె కట్టెబట్ట తీసుకొద్దాం” అన్నాడు ఇంకొకతను.

పక్కనే నిలవడ్డ ముత్తమ్మ ”ఎవలో ఎందుకే నా తమ్ముని సావు నేనూ జేస్త ఆడు నా తోడ పుట్టకున్నా నా పెద్దనాయిన కొడుకే నా తమ్ముని సావు నేను చేస్తా” అని ముందుకు వచ్చింది. ”మీ యింటి ఆడపిల్ల సావుజేస్తానంటోంది. ఒకలెక్క తీర్గనైతే యింటి ఆడపిల్లలకీ సావుజేసే హక్కుంది మూడోద్దులు దినాలు ఇంగ మీరు సోంచాంచుకోండ్రి చంద్రయ్య కట్టెబట్టుకు పోదాం నడ్వండ్రి” అంటూ పెద్దలంతా లేచారు. ముత్తమ్మ రూపాలు ఇయ్యంగానే పెద్దలందరు బజారుకు పోయి కట్టెబట్ట తెచ్చారు. ఇంటి బయట డప్పుల మోత మొదలై ముందుకు కదులుతుండగా సురేందరుకు తెల్ల రుమాలు కట్టించి బాయి దగ్గరకు తీసుకుపోయి నీళ్ళుపోసి నుదుటన విబూది రుద్ది కొత్త కుండలో నీళ్ళు తీసుకువచ్చి బయటనున్న నిప్పుల మీద నీళ్ళు కాచారు.
డప్పుల మోతను వింటుంటే నీలమ్మ గుండెల్లో గునపాలు గుచ్చినట్లుగా ఉంది ఇంకా కొద్దిసేపటి వరకే భర్త రూపు తన కళ్ళముందు ఉంటుందని అర్థమయి ఆమె దుఃఖం మరింత కట్టలు తెంచుకుంది.

శవంపైన ఏడుస్తున్న వాళ్ళనందరిని పక్కకు జరిపి వాకిట్లో పీటమీద కూర్చోపెట్టి మొగులయ్యకి కుండలోని నీళ్ళుపోస్తుంటే
మరోదిక్కు నీలమ్మకు ఆడవాళ్ళంతా కల్సి నీళ్ళుపోసి చెరోదిక్కు ఇద్దరికి బట్టలు కట్టించి బయట అరుగుమీద పీటలేసి పంచకు కూర్చోబెట్టాక ఎల్లమ్మ సాలయ్య కూతురు అల్లుడికి ఓడిబియ్యం పోస్తూ, నీలమ్మను పసుపు బట్టల్లో చూసి ”బిడ్డా నాతోటి బియ్యం పోసుకొనుడు ఇదే ఆకరా” అంటూ గుండెలవిసేలా ఏడ్చింది. అప్పటికే మరోదిక్కు పాడె సిద్దమైంది. మొగులయ్యని పాడెపై పడుకోబెట్టి బట్టకప్పి సుతిలి తాళ్ళతో బిగించాక పాడేలేచింది. లేచిన పాడెవెంట పాడెకట్టను పట్టుకొని భర్తవెంట చివరిసారిగా జీవచ్ఛవంలా అడుగులేస్తు. ”ఓయ్యా నీముందే నా పానం పోవాలన్కున్ననే, నా ముందలనే నువ్వు గిట్లయి నన్ను యిడిసి పోతున్నవా నువ్వులేక నేను ఎట్ల బత్కలేనే, నన్ను కూడా నీ ఎంట తీస్కపోరాదే, నీ దిక్కెల్లి పిల్లలడిగితే నేనేం సెప్పాలే నేనెట్ల బత్కాలే” అంటూ దారంతా తలబాదుకున్నది.

”నీలమ్మ ఇంగ ఊకో ఊకో పిల్ల, నువ్వుగూడా సస్తే నీ పిల్లగాలేంగావాలే జెర ధైర్యం తెచ్చుకో నీలమ్మ” అంటూ సంగమ్మ ఓదార్చినా నీలమ్మనూ ఆపటం ఎవరి తరం కాలేదు. శ్మశానం దగ్గరకు వెళ్ళాక దింపుడుకళ్ళెం చేసి మొగులయ్యని చితిపైకి చేర్చారు. సురేందరు చేత్తో చితికి మంట అంటించేసరికి ఆ దృశ్యాన్ని చూసిన నీలమ్మ స్పృహ తప్పింది.
మూడొద్దులు జరిగే నాటికి కూడా సత్తయ్య ఇంటికి రాలేదు. చుట్టుపక్కల గుసగుసలు పోచమ్మ చెవిన పడంగనే ”అడ్డమైనోళ్ళంతా నువ్వు మంత్రాలు జేసిన వంటుండ్రయ్య, నువ్వు ఏ పనిమీద ఏ ఊరికి పోయినవో గాని ఆ పత్తా నాకెర్కలేదయ్య, మంది నోర్లుగట్ట నాతరమా, ఈళ్ళమీద మన్ను వడనయ్యో, ఈళ్ళ మీద దుమ్ముపడనయ్యో” అంటూ అందరు వినేట్టుగానే వాకిట్లో కూర్చుని సోకాలు పెట్టింది. ”గీడ ఓ దిక్కు పోరడు సచ్చిండన్న పికరు లేకుండా ఆడట్లన్నడని ఈడిట్లన్నడని ఏడుస్తుందేందన్నా మొగులయ్యగాన్ని రవుసువెట్టి రవుసు పెట్టి సాగనంపిరి.

ఇంగ ఇంకేందంట ఇల్లుగాని ఒకడేడుస్తుంటే ఇంకేదో అయి ఇంకొకడేడ్సినట్లు మొగని దిక్కెళ్లి ఏడుస్తుంది ఇనుండ్రియ్యా” అని కోప్పడ్డాడు రంగయ్య.”పోనీ తమ్మి గిప్పుడు గీ సుద్దులన్ని కెలికితే అది రాసపుండు లెక్క సలసల మంటుంటది. గిప్పుడు గీ పోల్లెట్ల పిల్లల్నేసుకుని బత్కుతోదనని సోంచాంచాలే గాని కోట్లాటలు తిట్లాటలు కాదురా” అని చంద్రయ్య సముదాయించాడు.
పోచమ్మ మాటలు, సోకాలు నీలమ్మకు వినపడ్డ వాటి గురించి ఆలోచించే స్థితిలో లేదు. మనస్సంతా భర్తేనిండి ఉండి అతని జ్ఞాపకాలే ఆమె చుట్టూ మూగాయి. రెండు మూడు రోజులు దాటాక తండ్రి చచ్చిపోయాడని గ్రహించిన సురేందరు, సుభాషు తండ్రికోసం తల్లిని అడుగుతున్నారు. ఆశగా అటుఇటు చూస్తున్నారు. ఇది నీలమ్మకు మరింత రంపపుకోతలా ఉండి కొడుకులను సముదాయించలేక సతమతమౌతూ కన్నీరు పెట్టింది.

మిగతా సమయాల్లో మౌనంగా ఓ మూల కూర్చుంటే కళ్ళెదుట సంసారం జ్ఞాపకాలు ఇల్లంతా పరుచుకున్నట్లు అమాస చీకట్లో వెన్నెల ముగ్గేసినట్లు కాని అది అసాధ్యమని గుర్తుకు వచ్చి భవిష్యత్తంతా అంధకారంలా తోచింది. వారం రోజులు గడిచాకా సత్తయ్య ఇంటికి తిరిగివస్తూనే విషయం తెల్సుకుని సురేందరును, సుభాషును దగ్గరుకు తీసుకుని మొసలి కన్నీరు కార్చాడు. నీలమ్మను కన్న బిడ్డలా చూసుకుంటానని సాలయ్యకు మాట ఇచ్చాడు. కసాయి వాడిచేతిలో మేకపిల్లను పెట్టినట్లు నీలమ్మను మళ్ళీ సత్తయ్య చేతిలోనే పెట్టడం పాలోళ్ళకు నచ్చలేదు. కాని నీలమ్మ బతుకుదెరువుకు మరోదారి లేదని ఎవ్వరు కిమ్మనలేదు. దినాలు పూర్తయి ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయేసరికి తూకం ఏస్తానని గంపలో వేసిన వరి విత్తనాలు సగం మొలకెత్తి సగం మొలకెత్తక ఎండిపోయి అంతా పనికిరాకుండా పోయింది. నీలమ్మ ఆ గంపను అట్లనే తీసుకుపోయి మొగులయ్య దున్నిన పొలంలో పడేసింది.

ఇక ఇప్పట్నించి చాలా తెలివిగా పావులు కదపాలని నిర్ణయించుకున్నాడు సత్తయ్య. మొగులయ్య చావుకి తానే కారకుడినని నీలమ్మకు తెలియనియ్యొద్దనుకుని ఆ ఏడు తన పంట పొలం వరకే దున్నుకుని నాట్లు ఏసుకున్నాడు. మొగులయ్య పొలం ఇప్పుడు అందరి దృష్టిలో నీలమ్మది, నీలమ్మ పిల్లలదైపోయింది. ఆ ఏడు ఆమె జీవితంలాగే పొలమంతా బీడుపడింది. ఎంతటి గాయాన్నైనా కాలం మాన్పుతుంది. ఎంతటి ముఖ్యమైనదాన్నైనా దగ్గరకు చేసి దూరం చూసే శక్తి ఒక్క కాలానికే ఉంది. ప్రతినెల జీతాలు రాగానే కూతురికి రాషను ఇప్పించి ఆమె ఆలనాపాలనా చూస్తోంది ఎల్లమ్మ.

తన జీవితంలాగే పొలం కూడా మోడు పారగూడదని, తల్లి తన దగ్గరికి వచ్చిన ప్రతిసారి మళ్ళీ పొలంలో పంట వేసే విషయాన్ని నీలమ్మ ప్రస్తావిస్తూనే ఉంది. ”బిడ్డా సెల్లి పెండ్లికి తెచ్చిన అప్పు తీరంగనే పదివేల సిట్టేసి నీకిస్త పంట ఏస్కుందువుగాని” అంటూ కూతుర్ని అనునయించింది. కాలం పరుగులు పెడ్తూనే ఉంది. అందరి పొలాల్లో మళ్ళీ కోతలు మొదలయ్యాయి. నీలమ్మ ఇంటి పట్టున కూర్చుని ఏమి చెయ్యాలని తన పాలోళ్ళ పొలాల్లోనే వరికొయ్యపోతే సురేందరు ఇంటిదగ్గర తమ్ముడ్ని చూసుకున్నాడు. నెల పదిహేను రోజులు జరిగిన కళ్ళాలల్ల పనిచేస్తే సంచిడు వడ్లు వచ్చాయి.

వాటిని వాకిట్లో ఆరేసి రెండు మూడు రోజులైనంక రోట్లో ఏసి దంచుతుంటే అక్కడికి పోచమ్మ వచ్చి ”ఏంది పిల్లా గట్ల దంచుతున్నవు గిర్నికి తీస్కపోతే కాదా” అంది. ”సంచిడు వడ్లు గిర్నికి ఎట్ల మోస్కపోనత్తమ్మ, మీ కొడుకుంటే బండిమీదనో సైకిలు మీదనో ఏస్కపోవు, నాకేడికని అయితది” అంటుంటే, గది కూడా నిజమే అంటు యింటికి పోయి మరో రోకలితో తిరిగి వచ్చి నేను గూడ దంచుత పట్టు బిరానైతయి అని రోలు దగ్గరికి వస్తుంటే ”ఒద్దత్తమ్మ” అని వారించింది. ”అయ్యో గట్లంటవేందే మాయింట వచ్చి చేయ్యకు తియ్యరాదు” అనే సరికి నీలమ్మ మారుమాట్లాడలేదు. ఇద్దరు కల్సి రోట్లో వడ్లువేసి పోటు మీద పోటెస్తుంటే ఆమె ఇంటి పరిస్థితుల గురించి అడిగింది. ”నీలమ్మ పొలం మాటేం జేసినవు” అని అడిగింది.

”మా అమ్మ సిట్టేసి రూపాలు దెస్తన్నదత్తమ్మ గవి రాంగానే ఈ పంట నుంచే పొలం దున్నిపిద్దాం అన్కుంటున్న” అనంగానే ”నువ్వు మంచిగా ఉండుడే మాకు కావాలే పిల్లా, పిల్లలని మంచిగా నడ్పుకో” అంటూ ”ఔనే పిల్లా నువ్వు పాటలు పాడి మస్తు రోజులైంది ఓ పాట పాడరాదూ” అంది పోటేస్తూనే. నీలమ్మ నవ్వుతూ అత్త దిక్కుచూసి ”నేను పాడ్తగాని మల్లా నువ్వుగూడా పాడాలే” అన్నది. ”ఆ నువ్వు యింకొకరిని పాడించక ఎప్పుడుండాలే ఆఖరికి మా మొగిలిగాన్ని కూడా పాడిస్తివి” అనంగానే సంతోషంగా తామిద్దరు పాడుకున్న రోజులు నీలమ్మకు జ్ఞప్తికి వచ్చి ఆ జ్ఞాపకాలు గుండెను తాకి కళ్ళల్లో నీళ్ళు సుడులు తిరిగాయి గానీ కొంచెంసేపటికి తమాయించుకొని వడ్లలోకి పోటు మీద పోటేస్తుంటే ఆమె కోడలి పరిస్థితి గ్రహించి తానే పాటందుకుంది.

”సోలపురం బోయినా
సాలెడొడ్లు దెచ్చినా
దంచనైన దంచవే ఓనా కోడలా
హహ్హా నేను దంచా
ఉహ్హూ నేను దంచా
దంచకుంటే దంచకపోతివి
చెరగనైన చెరగవే ఓనా కోడలా
హహ్హా నేను చెరగా
ఉహ్హూ నేను చెరగా
చెరగకుంటే చెరగపోతివి
నేనైనా చెరుగుకుంట
బువ్వైన ఒండవే ఓనా కోడలా
హహ్హా నేనొండా
ఉహ్హూ నేనొండా
ఒండకుంటె ఒండకపోతివి”

అని పాడుతూ ఎదురుగా సత్తయ్య రావటం చూసి ఠక్కున ఆపేసి ”పిల్ల.. పెద్దమామొస్తుండు” అంటూ తల నేలకేసింది.
సత్తయ్య ఇద్దర్నీ కిందికి మీదికి తేరిపార చూస్తూ ఇంట్లోకి పోయి ”ఏందే పాలోళ్ళ తోటి జేరి ఇది బాగనే తైతక్కలాడ్తుందేంది” అని భార్యతో అనేసరికి పోచమ్మ మూతిని మూడువంకర్లు తిప్పి ”ఆ గిన్ని రోజులు మొగులయ్యగాడు పాలోళ్లతోటి కల్సిండు ఇప్పుడు ఇది” అంది.

సత్తయ్య కళ్ళల్లో నీలమ్మ లీనమై పాట పాడ్తూ పోటేస్తున్న దృశ్యంమే మెదిలి అతనిలో అశాంతిని రేపింది.
వెంటనే లేచి ఎల్లయ్య ఇంటికి పోయాడు. ”ఒరే ఎల్లిగా మొగుడు సచ్చినంక దాని అమ్మోళ్ళు తీస్కుపోతరేమో అంటే అట్ల తీస్కపోలే, బత్కుదెరువు కష్టమైయి అట్లన్నా ఎల్లిపోతదేమొనంటే తల్లే రాషను దెచ్చి పొయ్యవట్టే ఇంగ ఇది తిని ఇంట్లనే కూకోక ఆడనో ఈడనో కష్టం జేసుకుంట గట్టి గావట్టే దీన్ని ఈడ్కేని తోలుడు ఎట్లరా” అన్నాడు. ”ఇగోన్నా దేనికైనా ఒక టయిము రావాలనే గిప్పుడు దాన్ని ఈడ్కేని పంపజూసిన వనుకో నీకాళ్ళ కిందికే నీల్లొస్తయి అది సిన్న పిల్ల గదా తీస్కపోయి మళ్లా పెళ్లిజేస్తే పొలం నీకైత దన్కున్నవు గానీ అది జరిగెటట్లు లేదు కాని ఓపిక పట్టి జూడు అది ఉప్పుకారం తింటున్నదిరా జరిగే కత జర్గక మానదు గప్పుడు తప్పుల వట్టి ఒక్క తన్ను తంతే మొత్తం పొలం నీదే” అంటూ గుంబనంగా మాట్లాడేసరికి, ”మల్లా గట్ల జరుగకపోతే ఎట్లరా” అన్నాడు ”ఎట్లేది మల్లా ఆ కత ఏరేనే ఉంది గాని ఎన్నటికైనా ఆ పొలం నీదే అసలైనోడే లేడు ఇంగ ఇది నీకో లెక్కా” అంటుంటే సత్తయ్య అక్కడ్నించి కదిలాడు.
 
అందరి చేలల్లో మళ్ళీ పొలం దున్నడం మొదలుపెట్టేసరికి ఈసారి పంటను ఎలాగైనా వెయ్యాలని తల్లి దగ్గరకు వెళ్ళి ప్రాధేయపడింది నీలమ్మ. చీట్టి చేతికి రాకున్నా నానా అగచాట్లు పడి ఐదువేలు జమచేసి కూతురి చేతిలో పెడ్తు బిడ్డా పాలోల్ల నడుమ జెర భద్రం అంది ఎల్లమ్మ. ”అమ్మ అందరు నన్ను కన్నబిడ్డలెక్క జూస్తరు ఆల్లే నా అండ ఉండకుంటే గిన్ని దినాలు ఆడ టికాయిస్తున్నా?” అంటూ డబ్బు తీసుకుని ఇంటికి వచ్చి సరాసరి సత్తయ్య దగ్గరికి పోయి ”మామా గీసారి నుంచి చేను ఏద్దం అనుకుంటున్న గందుకని. మా అమ్మోల దగ్గరి నుంచి అయిదువేలు తీసుకొచ్చినా యింగో కరెంటుకి రెండేలు కట్టు మామా” అంటూ డబ్బులను చేతిలో పెట్టేసరికి అతనిలో పగ మళ్ళీ బుసలు కొట్టింది. ”మొగుడు సచ్చిన ముండ యింకెన్ని రోజులుంటదన్కుంటే ఇప్పుడు ఏకు మేకైనట్లు పొలం పండిస్తనంటదేంది” అని గుటకలు మింగుతూ ”గట్లనే గట్లనే జేయి” అని నీలమ్మతో అన్నా ”దీన్ని ఎట్లా ఆపాలే” అంటూ చేతులు నలుపుకుంటూ సతమతమయ్యాడు.

”గిప్పుడు పొలం నాదని సెప్తె మొగులయ్యగాడు ఎందుకు రంజివడి సచ్చిండో దానికి ఎర్కయి లొల్లిజేస్తే ఉన్న పొలం గూడా దక్కకుండా పోతది గిప్పుడు గమ్మునుండటమే మంచిది కొన్ని రోజులైనంక దీన్ని ఎట్లైన జేసి ఇడికెని తోలిస్తా” అని తీర్మానించుకున్నాడు. బయట నుంచి కూలోళ్ళను పిలిపించి పొలాన్ని దున్నించి తూకం పోసి వరినాట్లు ఏసింది నీలమ్మ. పొలంలో వరినాట్లు పూర్తయిన రోజున అందరికి కూళ్ళు ఇచ్చి తుమ్ముచెట్టు కింద కూర్చొని భర్తనే తల్చుకుని కుమిలి కుమిలి ఏడ్చింది. పొలం అంతా కలిసి దున్నించి మొత్తం పొలంలో నాట్లు వేసేసరికి పాలోళ్లంతా ఆశ్చర్యపోయారు. ”లోపల లోపల జరిగిందేంది ఇప్పుడు జరుగుతున్న దేంది, సత్తెన్న ముందు జేసిందేంది, ఇప్పుడు కళ్లముందు జరుగుతున్న దేంది” అని తమ కళ్ళను తామే నమ్మలేకపోయారు.

”మొగులయ్య సచ్చినంక సత్తెన్న మారాడు” అనుకున్నారు. ముండమోసిన కోడలికి పెద్ద దిక్కుగా నిలబడి నీలమ్మ తల్లిదండ్రులకిచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు అనుకున్నారు. నీలమ్మ పంటను కంటికి రెప్పలా కాపాడుతూ పోలంల రెక్కలు ముక్కలు చేస్కుంట పనిలో మున్గుతున్నది, కానీ మనసంతా పిల్లల దిక్కే వాళ్ళు గుర్తుకు వచ్చి చెండ్లల్ల సెల్కల్లోనే ఉండి పనిచేస్తూ కొడుకులు జ్ఞాపకానికి వస్తుంటే

”లాలిలాలి జోలాలి
ఓ ఓ హాయి
కండ్ల నీళ్లా నా తండ్రి
ఓ ఓ హాయి
ఓలాలో ఓలాలో హాయి….” అని పాడుకుంటూ..

కలుపుతీసి మందులు చల్లింది. వరి కోతకు వచ్చేసరికి పొద్దున పొలం దగ్గరకు వచ్చిందంటే పొద్దుగూకిన తర్వాతనే ఇంటికి పోయేది. అందరి పొలాల్లో వరికోతలు మొదలయ్యాయి. నీలమ్మకు భర్తలేని లోటు అనుక్షణం తెలిసివస్తుంటే ఆ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ వరికోస్తూ కుప్పలన్ని ఒక్క దగ్గరకు చేర్చి కట్టకట్టి మొగులయ్య తీసుకుపోతున్నట్లు, పక్కనే ఉండి కొడవలితో వరికోస్తున్నట్లు, తనతో మాట్లాడు తున్నట్లు అన్పించ సాగింది. చుట్టుపక్కల అందరి సేన్లల్లో పంట కళ్లాలు జోరుగా సాగుతున్నాయి. తమ సేన్లో ఇద్దరు ముగ్గురు వరికోస్తుంటే తానే కట్టలు కట్టి కళ్ళం దగ్గర వెయ్యసాగింది. రెండు ఎడ్లకు జతగా పాడిఆవును కలిపి లంకెగట్టి గుండ్రంగా వరిపైరు జల్లుతూ పశువులను దానిమీదికి తోలి, చుట్టూ తిప్పసాగింది. కొంచెంసేపయ్యాక సురేందరు చేతికి కర్ర ఇచ్చి ”కొడ్కా నువ్వు పసుల ఎన్క ఉండి బంతి కొట్టు నేను గడ్డేస్తా”నంటూ పశువులను ఆ బంతి మీద సురేందరు గుండ్రంగా తిప్పుతుంటే వెనక నడుస్తూ వరిపైరును చల్లసాగింది.

అప్పుడప్పుడు కొడుకును బంతి తిప్పమని చెప్తూ సేన్లోకి పోయి దబదబా వరి కట్టలను కట్టి తెచ్చి కళ్ళంలో చల్లసాగింది.
అట్లా ఒక రోజంతా బంతిని తిప్పి మర్నాడు కూలీకి వచ్చిన ఆడవాళ్ళతో కల్సి, నలుగురు నాలుగు దిక్కుల నుంచి గడ్డిని దులిపి వెనక ఏస్తుంటే వరిగడ్డిలోంచి వడ్లు జలజలా రాలి కింద పడసాగాయి. మునుము పట్టినట్టుగా స్త్రీలంతా ముందుకు జరుపుతూ గడ్డిని దులపసాగారు. గడ్డిని దులపటం పూర్తయ్యాక గుండ్రంగా ఉన్న వడ్లు ఎండకు మెరుస్తూ సూరీడుని తలపించాయి. వాటినంతా ఒక్క దగ్గరకు కుప్పచేసి మరోచోట రాసిగా పోసి గడ్డేసి కప్పేశాక అదే స్థలంలో మళ్ళీ బంతిని కట్టింది నీలమ్మ.
మళ్ళీ గడ్డిని దులపటం వడ్లను రాసిలో చేర్చి మళ్ళీ బంతిని కట్టడం చేస్తుంటే వారం రోజుల్లో గడ్డి ఒక దిక్కు వరిధాన్యం అంతా ఒక దిక్కు విడివడ్డాయి.

రాసిగా పోసిన వడ్ల కుప్పలోంచి చేతులతో ధాన్యాన్ని ముంచి ఇద్దరు అందిస్తుంటే మరో ఇద్దరు గాలివాటుకు తూర్పార పట్టగానే నాణ్యమైన వడ్లు రాసిగా పడి తాళు పక్కకు చేరింది. తాళును పక్కకు తీసి చెరిగి మిగిలిన వడ్లను రాసిలో కలిపాక మీదమీద ఉన్న రాళ్లపెడ్డలను ఏరేశారు. కల్లం జరిగిన చివరిరోజున కూలీలకు అడ్డతో వడ్లు కొలిచి కూలీకి పోసింది నీలమ్మ. కూలీలు వెళ్ళిపోయాక కొడుకులను కళ్ళెం దగ్గర కాపలాపెట్టి ఈత గంపతో వడ్లను ఇంటికి మోయసాగింది. కళ్లెం నుంచి తెచ్చిన వడ్లను ఆ మూలకు ఈ మూలకు రాసిగా పోస్తుంటే పొలం దగ్గరున్న వడ్లరాసి ఎంతకు తరగదు. చీకటి పడేవరకూ వడ్లను మోసిన నీలమ్మకు రాత్రిపూట కళ్ళం దగ్గర ఎవర్ని కాపలా ఉంచాలో అర్థంకాలేదు. ఒకవేళ పిల్లలను ఏసుకుని కాపలాకీ తానే అక్కడుంటే అత్తమామలు సూసినోళ్ళు ఏమనుకుంటారోనని జంకింది.

”ఎవలని పిలుద్దు అందరు కళ్ళాల్లోనే ఉండ్రు ఎట్లజెయ్యలే” అనుకుంటూ నేరుగా సత్తయ్య దగ్గరకు పోయి ”మామా గిప్పటి దాకా నా శాతనైన కాడికి అన్నిజేసిన గాని వడ్ల కుప్ప దగ్గర పిల్లల నేసుకుని ఒక్కదాన్నే ఎట్లుందు” అన్నది. ఆమాట వినేసరికి సత్తయ్యకు తిక్కరేగింది. ఇన్ని రోజులు ఉగ్గపట్టుకున్న కోపాన్ని మాటల్లో చూయిస్తూ ”ఎట్లేంది గిన్ని దినాలు అన్ని పన్లు ఎట్ల జేస్కున్నవో గట్లనే గిది సేసుకో” అని అన్నాడు కాని వెతకబోయిన తీగ కాలికి తట్టినట్లు ఎప్పుడు అవకాశం వస్తుందా అని చూసిన అతనికి ఇదే మంచి తరుణం అనుకొని మళ్ళీ వెంటనే మాటమారుస్తూ… ”సరే తియ్యి నేనేదన్నా యింత జాముసేస్తకాని నువ్వు యింటికి పో” అన్నాడు. సత్తయ్య మాటలకు స్థిమితపడ్తూ తిరిగి కళ్ళాం దగ్గరకు పోయి వరికుప్ప మీద దట్టంగా గడ్డిపరిచి పిల్లలను తీసుకుని చీకట్లో ఇల్లు చేరింది.

అందరు కళ్ళాల్లో పనులను ఆపేసి ఇళ్ళకు మళ్ళుతున్న సమయంలో సత్తయ్య తన కళ్ళంలోంచే ”ఓ ఎల్లిగా” అని కేకేశాడు.
ఇంటికిబోతున్న ఎల్లయ్య వెనక్కు తిరిగొచ్చి ”ఏందన్నా పిల్సినవు” అన్నాడు ”ఏమ్లేరా నీతోని పని పడింది” అంటూ చేయిపట్టి గడ్డిమీద కూర్చోపెట్టాడు. అప్పటికే అందరు కళ్ళాలలోంచి వెళ్ళిపోయారు. సత్తయ్య అటుఇటు చూస్తూ ”ఏం లేదురా ఎల్లి ఎన్ని దినాల కాడ్నించి సందు దొర్కుతదా అని సూస్తున్న గిన్నిదినాల నుంచి నాకు నేనే పుసుక్కున బయటపడ్తిని. అందరి ముందల నవ్వు బట్ల పాలైతినని గాని మొగిలిగాని పెండ్లాము ఆఖరికి పంట పండించి అందరి లెక్క కళ్ళెం గూడా జేసే గాని గియ్యాల దానికి మన అక్కరొచ్చిందిరా’ అని ఆగిపోయాడు.

”ఏం అక్కరొచ్చిందే అన్నా” ఎల్లయ్యలో ఆసక్తి తొంగిచూసింది.
”గిప్పుడు దానికి పంట కుప్పకాడా కాపలోడు కావాలే మన సేండ్లన్ని ముందుండే దాని సేను ఎన్కుండే పంట కుప్పను ఎవలన్నా ఎత్కపోతరని దాని భయం” అంటూ కళ్ళల్లోకే సూటిగా చూశాడు.
”అయితేందన్నా నువ్వు ఏం జెయ్యాలన్కుంటున్నవు” అని అడిగేసరికి
”ఒరేయ్‌ ఎల్లిగా మేకను కుక్కగా జేసే కత నీకు యాదికుందిగా” అంటూ వికృతంగా నవ్వాడు.
”అంటే అన్నా” అంటూ తనకు అర్థం అయినట్లుగా ఎల్లయ్య కూడా పకపకా నవ్వేసరికి ”గదేరా గదే ఇప్పుడు.

 – జాజులగౌరి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

80
ధారావాహికలు, , , , , , , , , , , , , , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో