
Naseer Ahammad
మహిళా చైతన్యం కోసం అహర్నిశలు శ్రమించిన బేగం షరీఫా హవిూద్ అలీ జాతీయోద్యమంలో రాజకీయ-సాంఘిక సంస్కరణలు సమాంతరంగా సాగాయి. ఆనాటి రాజకీయాలలో ప్రత్యక్షంగా పాల్గొనలేక పోయిన ఉద్యమకారులు సామాజిక సంస్కరణల పోరులో భాగస్వాములయ్యారు. ఈ విధంగా రాజకీయోద్యమంలో పరోక్షంగా పాల్గొంటూ సంస్కరణోద్యమంలో పత్యక్షంగా కార్యాచరణకు దిగిన యోధులలో బేగం షరీఫా హవిూద్ అలీ ఒకరు. ప్రగతిశీల భావాలను స్వాగతించే కుటుంబంలో ఆమె జన్మించారు. ఉర్దూ, గుజరాతీ, ఆంగ్లం, సింధి, మరాఠి, ఫ్రెంచ్ భాషలను నేర్చుకున్నారు. చిత్రకళ, సంగీతంలో మంచి పట్టు సంపాదించారు. ఇండియన్ సివిల్ సర్వీసెస్ అధికారి హవిూద్ అలీని ఆమె వివాహం చేసుకున్నారు. భర్త హవిూద్ అలీ ప్రోత్సాహంలో ఆమె భాషాపరమైన సామర్ధ్యాన్ని మరింత పెంచుకుంటూ, సంగీతం, కళా సాంస్కృతిక కార్యక్రమాలలో పూర్తికాలాన్ని వ్యయం చేస్తూ ఆయా రంగాల అభివృద్దికి కృషి ఆరంభించారు.
1907లో కలకత్తా నగరంలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలలో ఆమె భాగస్వాములయ్యారు. ఆనాటి నుండి జాతీయోద్యమంలో చురుకైన పాత్ర నిర్వహించారు. స్వదేశీ ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించారు. మహిళల సంక్షేమం, హరిజనుల అభివృద్ధి తదితర కార్యక్రమాల విూద షరీఫా హవిూద్ అలీ దృష్టిసారించి అధిక సమయాన్ని ఆ రంగాలలో వ్యయం చేశారు. మహిళలలో చైతన్యం కోసం, తల్లీ-బిడ్డలు తీసుకోవాల్సిన ఆరోగ్యపరమైన జాగ్రత్తల ప్రచారం కోసం పలు కార్యక్రమాలను చేపట్టారు. గ్రావిూణ మహిళల సమస్యల పరిష్కారానికి ఆచరణాత్మక సలహాలు- సూచనలిచ్చి సమస్యల పరిష్కారానికి తోడ్పడ్డారు. మహిళలు తమ శక్తిసామర్ధ్యాలను పెంపొందించుకునేందుకు వీలుగా వారి బిడ్డల బాగోగులు చూడడానికి నర్సరీలను ఏర్పాటు చేశారు. అఖిల భారత మహిళా కాన్ఫెరెన్స్లో సభ్యత్వం స్వీకరించి ఆ కాన్ఫెరెన్స్ శాఖలను పలు ప్రాంతాలలో ఏర్పరచి మహిళలను సంఘటిత పర్చారు. మహిళల వివాహవయస్సుకు సంబంధించి ఉనికిలోకి వచ్చిన శారదా చట్టం ప్రకారంగా మహిళల వివాహ అర్హత వయస్సును పెంచాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్కు అనుకూలంగా మహిళల సంతకాల సేకరణ కార్యక్రమాన్ని పెద్దఎత్తున నిర్వహించారు. ముస్లిం మహిళలకు తగిన భద్రత ఇచ్చేలాగు ఆమె ప్రత్యేక నిఖానామా తయారు చేశారు. ఆ నిఖానామా ఈనాటికి పలు ప్రాంతాలలో అమలులో ఉంది.
1933లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి హజరైన ముగ్గురు మహిళా ప్రతినిధుల బృందంలో సభ్యురాలుగా మహిళల స్థితిగతుల గురించి సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఎదుట సాక్ష్యం చెప్పేందుకు ఆమె ఇంగ్లాండ్ వెళ్ళారు. పురుషులతోపాటుగా స్త్రీలకు సమాన ఓటింగ్ హక్కుల కోసం ఆమె తన వాదనను బలంగా విన్పించారు. 1937లో శాంతి, స్వేఛ్చ ప్రధానాంశాలుగా జెకస్లోవేకియాలో జరిగిన అంతర్జాతీయ సమావేశానికి హాజరయ్యారు. 1940లో అఖిల భారత మహిళా కాన్ఫెరెన్స్కు ఉపాధ్యకక్షురాలిగా, ఆ తరువాత అధ్యకక్షురాలిగా బాధ్యతలు నిర్వహించారు. అఖిల భారత మహిళల విద్యాసంఘం గవర్నింగ్ బాడీ చైర్మన్గా మహిళా విద్యాభివృద్దికోసం ఎన్నో కార్యక్రమాలను నిర్వహిం చారు. ఆమె సమాజసేవకు గుర్తింపుగా ఐక్యరాజ్యసమితిలోని మహిళలకు సంబంధించిన విభాగంలో భారతదేశ ప్రతినిధిగా నియుక్తురాలయ్యారు. భారతీయ మహిళల సంక్షేమం కోసం మాత్రమే కాకుండా మహిళల హక్కుల పరిరక్షణకు ఆమె ఎంతో కృషి చేశారు
ప్రజల భవిష్యత్తు ప్రజలే నిర్ణయించుకోవాలని కోరిన బేగం అక్బర్ జెహాన్ స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్న మహిళలు తొలిథలో భర్తల ప్రోత్సాహంతో రంగ ప్రవేశం చేసినా ఆ తరువాత ఉద్యమబాటలో ఎదురయ్యే పరిస్థితులను బట్టి తమ వ్యక్తిత్వాలను, సంపూర్ణ శక్తిసామర్ధ్యాలను ప్రదర్శించి చరిత్ర సృష్టించిన సంఘటనలు ఉన్నాయి. బేగం హసరత్ మోహాని, కుల్సుం సయాని, సాదత్ బానో కిచ్లూ, షంషున్నీసా అన్సారి ఈ కోవలోకి వస్తారు. ఆ కోవకు చెందిన కశ్మీరి మహిళ బేగం అక్బర్ జెహాన్. అక్బర్ జెహాన్ 1916లో కశ్మీర్లోని గుజ్జర్ కుటుంబంలో జన్మించారు. ఆమె తల్లి గుజ్జర్ కమ్యూనిటీకి చెందిన ఆడపడుచు కాగా తండ్రి మైఖేల్ హ్యారి నిడోయ్ . తల్లి తండ్రులది ప్రేమ వివాహం. ఆమె తండ్రి మైఖేల్ హ్యారి నిడోయ్ క్రైస్తవ మతానికి చెందిన సంపన్న వ్యాపారి. ఆయన ఇస్లాం మతం స్వీకరించి తన పేరును షేక్ అహమ్మద్ హుస్సేన్గా మార్చుకున్నారు. షేక్ అహమ్మద్ హుస్సేన్ అక్బర్ జెహాన్ బేగం తల్లిని ప్రేమించి మరీ వివాహం చేసుకున్నారు. ఆ వివాహం వలన తల్లి సంబందీకులైన గుజ్జర్ కమ్యూనిటీ ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేసి వారికి దూరమయ్యారు. ఆ వ్యతిరేక పరిస్థితులలో కూడా ఆ దంపతులు ఎంతో ధైర్యంతో తమ జీవితాలను ఉజ్వలంగా మలచుకున్నారు. ఆ దంపతుల తొలి సంతానంగా అక్బర్ జెహాన్ బేగం జన్మించారు. అక్బర్ జెహాన్ బేగం మంచి కాన్వెంటు విద్యను గరిపారు. విద్యార్థిగా మంచి తెలివితేటలను ప్రదర్శించిన అక్బర్ జెహాన్ చక్కని సౌందర్యరాశిగా ప్రజల మనస్సులను దోచుకున్నారు. ఆమె అందంలో అగ్రగామి మాత్రమే కాకుండా ధైర్యసాహసాలలో కూడా అగ్రగణ్యురాలుగా ఖ్యాతిగాంచారు. చిన్నతనంతో తన తల్లికి సంబంధించిన గుజ్జర్ కమ్యూనిటీ ప్రజలు దూరం కావటం, తండ్రి పరదేశం నుండి వచ్చి కశ్మీరులో స్థిరపడిన వ్యక్తి కావటంతో ఆ కుటుంబం తొలిథలో పలు ఇక్కట్లను ఎదుర్కొంది.
తొలి సంతానంగా ఆ ఇక్కట్లును స్వయంగా అనుభవించిన అక్బర్ జెహాన్ బేగం ధైర్యశాలిగా స్వతంత్ర భావనలతో ఎదిగారు. చిన్నవయస్సులో కరామత్ షా అను ఓ మత గురువుతో ఆమె తల్లితండ్రులు వివాహం జరిపించారు. ఆ వివాహం ఎక్కువ కాలం నిలబడలేదు. చివరకు ఆక్బర్ జెహాన్ బేగం భర్తను నుండి విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత ఆమె 1932లో షేక్ ముహమ్మద్ ఇబ్రహీం కుమారుడు, షేర్-యే-కశ్మీర్గా ఖ్యాతిగాంచిన షేక్ ముహమ్మద్ అబ్దుల్లాను వివాహం చేసుకున్నారు. ఆమె వివాహాన్ని ప్రముఖ కవి డాక్టర్ ముహమ్మద్ ఇక్బాల్ తోడ్పాటుతో ముఫ్తీ జియాయుద్దీన్ నిర్వహించారు. విద్యాధికుడైన డాక్టర్ అబ్దుల్లా తొలి నుండి ప్రజల సమస్యల పరిష్కారానికి కృషిచేయడానకి ఆసక్తి చూపారు. ఆయనలోని నాయకత్వ లక్షణాలు విద్యావంతులైన తన మిత్రులతో కలసి రీడింగ్ రూం పార్టీ అను సంస్థ ఏర్పాటుకు దారి తీశాయి. ఈ సంస్థ ద్వారా ప్రజల సమస్యల పరిష్కారానికి వ్యవస్థాగతంగా శ్రీకారం చుట్టారు. ఆ క్రమంలో కశ్మీర్ ప్రజల సమస్యలను బయటి ప్రపంచానికి తెలియచేసేందుకు రీడింగ్ రూం పార్టీ సభ్యులు కృషిచేశారు. ఆ ప్రయత్నాలు ప్రజల మన్నన పొందాయి, కశ్మీరేతర ప్రజల అభినందనలు డాక్టర్ అబ్దుల్లాకు దక్కాయి. ఆ అనుభవంతో 1932లో ఆయన ప్రత్యక్ష రాజకీయాలలోకి ప్రవేశించారు. ఆయన ఆల్ జమ్ము అండ్ కశ్మీర్ ముస్లిం పొలిటికల్ కాన్ఫెరెన్స్ ఏర్పాటు చేశారు.
ఆ పార్టీ పేరులో ముస్లిం అని పదం ఉన్నా, ఆల్ జమ్ము అండ్ కశ్మీర్ ముస్లిం పొలిటికల్ కాన్ఫెరెన్స్ కమ్యూనల్ పార్టీ ఏమాత్రం కాదన్నారు. కశ్మీర్ ప్రజల ఉద్యమం మతఉద్యమం కాదని ఇది రాజకీయ ఉద్యమమని ఆయనఅన్నారు. జమ్మూ-కశ్మీర్ ప్రజలందరి సమస్యల పరిష్కారం కోసం పోరాడుతుందని డాక్టర్ అబ్దుల్లా ప్రకటించారు. ఆ ప్రకటన మేరకు అబ్దుల్లా బడుగు బలహీన వర్గాల పక్షాన నిలిచారు. మతంతో సంబంధం లేకుండా ఆల్ జమ్ము అండ్ కశ్మీర్ ముస్లిం పొలిటికల్ కాన్ఫెరెన్స్లో అందరికి ప్రవేశం కల్పించారు, ఆ సందర్భంలో బేగం అక్బర్ జెహాన్ భర్త అబ్దుల్లాకు తోడుగా నిలిచారు. ఆ క్రమంలో మహాత్మాగాంధీ, మౌలానా ఆజాద్, పండిత నెహ్రూ, అలీ సోదరుల ప్రభావంతో 1938 ప్రాంతంలో అబ్దుల్లా తన ఆల్ జమ్మూ అండ్ కశ్మీర్ ముస్లిం పొలిటికల్ కాన్ఫెరెన్స్ ను ఆల్ జమ్మూ అండ్ కశ్మీర్ నేషనల్ పొలిటికల్ కాన్ఫెరెన్స్గా మార్చారు. ద్వితీయ ప్రపంచ సంగ్రామం సందర్భంగా భారత జాతీయ కాంగ్రెస్ క్విట్ ఇండియా ఉద్యమానికి పిలుపునిచ్చింది. ఆల్ జమ్మూ అండ్ కశ్మీర్ నేషనల్ పొలిటికల్ కాన్ఫెరెన్స్ కూడా క్విట్ ఇండియా తీర్మానానికి మద్దతు పలికింది. జాతీయ కాంగ్రెస్ నేతలను ప్రభుత్వం అరెస్టు చేయడాన్ని అబ్దుల్లా తీవ్రంగా ఖండించారు. జమ్మూ-కశ్మీర్లో క్విట్ ఇండియా నినాదం ప్రతిధ్వనించింది. ఈ సందర్భంగా డాక్టర్ అబ్దుల్లా మాట్లాడుతూ ఇండియా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడుతుంది. ఇండియా భూభాగంలోని నాల్గవ వంతు కలిగి ఉన్న సంస్థానాధీశులు స్వరాజ్యం విషయంలో విద్రోహులయ్యారు. సంస్థానాధీశులు వెళ్ళిపోవాలన్న డిమాండ్ క్విట్ ఇండియా ఉద్యమానికి కొనసాగింపు మాత్రమే, అని ఆన్నారు. 1946 ప్రాంతంలో భారత దేశానికి బ్రిటీష్ ప్రభుత్వం పంపిన క్యాబినెట్ మిషన్ ఫెడరల్ యూనియన్ ఆఫ్ ఇండియా ను ప్రతిపాదించింది.
ఇండియా నుండి బ్రిటీషర్లు వైదొలిగాక సంస్థానాధీశుల స్థానంలో ప్రజల ప్రభుత్వం ఏర్పడాలని డాక్టర్ అబ్దుల్లా ఆశించారు. ఈ మేరకు ప్రజలను చైతన్యవంతుల్ని చేయడానికి ఆయన ఉపక్రమించగా ఆయనతోపాటుగా బేగం అక్బర్ జెహాన్ ఉద్యమించారు. ఈ ఉద్యమాన్ని ఆ దంపతులు కశ్మీర్ సంస్థానం వరకు పరిమితం చేయలేదు. ఆనాడు ఇండియాలోని సుమారు 600 సంస్థానాలలోని ప్రజలను ఈ విషయమై చైతన్యపర్చేందుకు సిద్దమయ్యారు. ఈ మేరకు డాక్టర్ అబ్దుల్లా క్యాబినెట్ మిషన్కు మహజరు కూడా సమర్పించారు. బ్రిటీషు ప్రభుత్వం అధికారంలో నుండి వైదొలిగాక ప్రభుత్వాధికారాన్ని ప్రజల పరం చేయాలని, సార్వభౌమత్వం ప్రజల చేతుల్లో ఉండాలని ఆ మహజరు కోరింది. ఆ నేపథ్యంలో క్విట్ కశ్మీర్ ఉద్యమానికి డాక్టర్ అబ్దుల్లా శ్రీకారం చుట్టారు. ఉద్యమం ఉదృతంగా సాగింది. అరెస్టుల పరంపరలో భాగంగా 1946 మే మాసంలో బేగం అక్బర్ జెహాన్ భర్త అబ్దుల్లాను ప్రభుత్వం అరెస్టు చేసింది. రాజద్రోహానికి పాల్పడ్డారన్న ఆరోపణల విూద తొమ్మిది సంవత్సరాల జైలు శిక్షను విధించింది. ఆ సమయంలో బేగం అక్బర్ జెహాన్ రంగంలోకి దిగారు. అంతవరకు పరోక్షంగా భర్త అబ్దుల్లాకు సహాయకారిగా ఉన్న ఆమె ప్రత్యక్షరాజకీయాలలోకి ప్రవేశించారు. ఆమె స్వయంగా గ్రామాలకు గ్రామాలు పర్యటిస్తూ ప్రజలను కూడగట్టారు. బాధితులను ఆదుకున్నారు. ప్రజలలో భయాలను తొలగించి ఆశాజ్యోతులను వెలిగించారు. క్విట్ కశ్మీర్ ఉద్యమానికి ప్రజల మద్దతు సాధించేందుకు ఆమె నడుం కట్టారు. జనసమూహాలను ప్రభావితం చేయగల విధంగా చర్యలు తీసుకున్నారు. ఆ కారణంగా క్విట్ కశ్మీర్ ఉద్యమానికి ప్రజల నుంచి మంచి మద్దతు లభించింది. కశ్మీర్ ఉద్యమం సందర్భంగా ప్రజలను సవిూకరించగల శక్తియుక్తులు, ఆమెలో నిబిఢీకృతమై ఉన్న శక్తి సామర్థ్యాలు బహిర్గత మయ్యాయి. డాక్టర్ అబ్దుల్లా జైలులో ఉన్న సమయంలో కశ్మీర్ వచ్చిన మహాత్మా గాంధీని ఆమె స్వయంగా కలుసుకుని చర్చించారు.
– సయ్యద్ నశీర్ అహమ్మద్
@ఈ శీర్షికకి సమాచారాన్ని అందించి సహకరించినందుకు రచయిత శ్రీ సయ్యద్ నశీర్ అహమ్మద్ గారికి ధన్యవాదాలు.@
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~–