భారత స్వాతంత్రోద్యమం : ముస్లిం మహిళలు

 మహిళా కార్యకర్తలచే ఆయుధం ధరింపచేసిన సమరశీలి
సుల్తానా హయాత్‌ అన్సారి

                           సుదీర్ఘంగా  సాగిన భారత స్వాతంత్య్ర సంగ్రామ చరిత్రను పరికిస్తే, వలస పాలకులకు వ్యతిరేకంగా ముత్తాత, తాత, తండ్రి, తనయులు ఉద్యమించిన కుటుంబాలు చాలా తక్కువగా దర్శనమిస్తాయి. స్వదేశాన్ని పరాయిపాలకుల నుండి విముక్తం చేయాలన్న సంకల్పం పూర్వీకుల నుండి వారసత్వంగా లభించటం, ఆ మేరకు మాతృభూమి సేవలో తరించటం లాంటి మహత్తర అవకాశం లభించిన కుటుంబానికి చెందిన తనయ బేగం సుల్తానా హయాత్‌.  సుల్తానా హయాత్‌ ముత్తాత ఖాజీ జియావుద్దీన్‌ ఢిల్లీ నగర ఖాజీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 1857లో ఆయన  ఆ పదవికి రాజీనామా చేసి  బ్రిటీషర్లకు వ్యతిరేకంగా తిరుగుబాటు యోధులకు సహకరించారు. ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామ  సేనాని భక్త్‌ఖాన్‌ సలహా విూద ఆవధ్‌ సంస్థానానికి వెళ్ళడానికి మొగల్‌ పాదుషా బహుద్దూర్‌ షా జఫర్‌ నిరాకరించాక, భక్త్‌ ఖాన్‌ ఢిల్లీ నుండి తన బలగాలతో ఆవథ వైపుకు సాగారు. ఆ లోగా ఢిల్లీ పూర్తిగా ఆంగ్లేయుల వశమైంది. ఆ సమయంలో ఆంగ్లేయసైనికుల కళ్ళుగప్పి ఆవథ్‌కు పయనమైన భక్త్‌ఖాన్‌, ఆయన బలగాలు  ఢిల్లీ నుండి తప్పుకోడానికి ఖాజీ జియావుద్దీన్‌ సహయపడ్డారు.
               ఆ విషయం తెలుసుకున్న ఆంగ్లేయ అధికారి హడ్సన్‌ జియావుద్దీన్‌ విూద మండిపడుతూ ఆయన గృహం విూద దాడిచేశాడు. ఆస్థిపాస్తులను విధ్యంసం చేశాడు. ఆ జియావుద్దీన్‌ కుమారుడు ఖాజీ నజీముద్దీన్‌ కూడా జాతీయోద్యమకారుడు. బ్రిటీషు ప్రభుత్వానికి వ్యతిరేకంగా జాతీయ కాంగ్రెస్‌ మార్గదర్శకంలో  ఉద్యమించారు. విూరట్‌ నగరంలోగల తమ కుటుంబ భవంతిలో కొంత భాగాన్ని ఖిలాఫత్‌-సహాయ నిరాకరణ ఉద్యమ కార్యాలయాలయాన్ని ఏర్పాటు చేసుకునేందుకు  భారత జాతీయ కాంగ్రెస్‌కు దఖలు చేశారు.  విూరట్‌ నగర కాంగ్రెస్‌కు 27 సంవత్సరాల పాటు  అధ్యకక్షునిగా ఆయన బాధ్యతలు నిర్వహించారు.
ఆ నజీముద్దీన్‌ బాటలో ఆయన కుమారుడు ఖాజీ బషీరుద్దీన్‌ నడిచారు.  ఆయన కూడా జాతీయోద్యమ్యంలో పాల్గొన్నారు. ఆ  ఖాజీ బషీరుద్దీన్‌ కుమార్తె సుల్తానా హయాత్‌. ఈ విధంగా ముత్తాత ప్రథమ స్వాతంత్య్రసంగ్రామ యోధుడు కావటం, తాత, తండ్రి జాతీయ కాంగ్రెస్‌ ప్రముఖులు కావటంతో స్వేచ్ఛా-స్వాతంత్య్ర భావనలు సుల్తానాకు చిన్ననాటనే పరిచయమయ్యాయి. తాత ఖాజీ నజీముద్దీన్‌ సుదీర్ఘకాలం భారత జాతీయ కాంగెస్‌ విూరట్‌ నగర అధ్యకక్షులుగా బాధ్యతలు నిర్వహించటం వలన ఆయన ఇంటికి పండిత మోతీలాల్‌ నెహ్రూ, మౌలానా ముహమ్మద్‌ అలీ, మౌలానా షౌకత్‌ అలీ, కమలాదేవి చటోపాధ్యాయ, మౌలానా అబుల్‌ కలాం అజాద్‌, జవహర్‌లాల్‌ నెహ్రూ, మౌలానా అతావుల్లా బొఖారి, డాక్టర్‌ సైఫుద్దీన్‌ కిచ్లూ, మౌలానా హఫీజుర్రెహమాన్‌ లాంటి ప్రముఖుల రాకపోకలు ఉండేవి. ఆ కారణంగా తాత దగ్గర ఉంటూ, ఆయనకు, ఆయన అతిథులకు సపర్యలు చేస్తూ గడిపిన సుల్తానా హయాత్‌కు చిన్ననాటనే  ప్రముఖ నాయకుల పరిచయం కలిగింది.  
 
ఆ పరిచయాలు, ఆ ప్రత్యేక రాజకీయ వాతావరణం సుల్తానా హయాత్‌లో సమరశీల భావాలకు అంకురార్పణ చేశాయి. ఆమె ఇంటిని తరుచుగా పోలీసులు వచ్చిసోదాలు నిర్వహించటంతో ఆమెకు పోలీసుల భయం లేకపోగా, బ్రిటీషు ప్రభుత్వం పట్ల వ్యతిరేకత  బాగా పెరిగింది. చిన్నతనంలోనే ఆమె తాత ఖాజీ నజీముద్దీన్‌తో కలసి కాంగ్రెస్‌ సభలలో పాల్గొంటూ వచ్చారు. ఆ సభలలో తన సుమధుర కంఠంతో జాతీయభావాలతో నిండిన, దేశభక్తియుత కవితలు విన్పిస్తూ సభికులచే శభాష్‌ అన్పించుకున్నారు. ఆమె తాత గారి ప్రత్యేక శిక్షణలో చిన్న చిన్న ప్రసంగాలు చేయటం కూడా అలవాటు చేసుకున్నారు. ఆనాడు విూరట్‌లోని జుమా మసీదులో ఆమె అద్భుత ప్రసంగం చేసి బడాబడా నేతలను అబ్బురపర్చారు.
చిన్ననాటనే నాయకత్వం లక్షణాలను ప్రదర్శించి తన ఈడు పిల్లలతో కలసి ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేసుకుని సభలు, సమావేశాలు జరుగునప్పుడు ఆ కార్యక్రమాలకు విచ్చేసిన నేతలకు,  సభికులకు సేవలందించటం ఆమె అలవాటు. ఈ క్రమంలో ఆమె జాతీయ కాంగ్రెస్‌ స్వచ్ఛంద సేవికల దళాలకు నాయకత్వం వహించారు. ఆమె విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు పాఠశాలలో ప్రత్యేకంగా ఫిజికల్‌ ట్రైనింగ్‌ పొంది ఉన్నందున ఆ స్వచ్ఛంద సేవికల దళాల ఫిజికల్‌ ఫిట్‌నెట్‌ కోసం ప్రత్యేక శిక్షణా తరగతులను కూడా ఆమె నిర్వహించారు. యవతులకు లాఠీ తిప్పటం నేర్పారు. ఈ మేరకు విూరట్‌ నగరంలోని పలు సంఘాలు సంస్థలు, జాతీయ కాంగ్రెస్‌ నాయకులు, మహిళా నేతలు  ఆమె సేవలను ఉపయోగించుకున్నారు.
  ఆమె ధార్మికంగా నిష్టాగరిష్టురాలైనప్పటికి విభిన్న మతస్థులు కలసిమెలసి జీవిస్తున్న వాతావరణంలో సర్దుబాట్లు అవసరమని భావించారు. ఉద్యమాలను, పోరాటాలను మతం ఆసరాతో, మతం పేరుతో రూపొందించడాన్ని వ్యతిరేకించారు. హిందూ-ముస్లింల ఐక్యతకు ఈ చర్యలు విఘాతం కల్గించగలవని అభిప్రాయపడ్డారు. ముస్లింలకు ప్రత్యేక సంఘాలు, రాజకీయ పార్టీల ఏర్పాటును నిరసించారు.
1933-34 ప్రాంతంలో  ఢిల్లీలోని అరబిక్‌ కళాశాలలో ముస్లిం మహిళల సమావేశం జరిగింది. ఆ సమావేశానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరిగాయి. దేశ వ్యాప్తంగా ఉన్న ప్రముఖులందరికి ఆహ్వానాలు వెళ్ళాయి. ఆ ఆహ్వానాల మేరకు ప్రముఖ మహిళా నేతలు సమావేశాలకు విచ్చేసారు. ఆ సమావేశాలలో విూరట్‌ ప్రతినిధులుగా  సోదరి జెహరా బేగంతో కలసి బేగం సుల్తానా హయాత్‌ పాల్గొన్నారు. ఆ సమావేశంలో ప్రకటించిన ఉద్దేశ్యానికి భిన్నంగా ముస్లిం  విద్యార్థినుల కోసం ముస్లిం విద్యార్థినుల సమాఖ్య ఏర్పాటుకు ప్రయత్నాలు ఆరంభమయ్యాయి. ఆ ప్రయత్నాలు సుల్తానా  సోదరీమణులకు నచ్చలేదు. ఈ మేరకు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సుల్తానా హయాత్‌, ఆమె చెల్లెలు బేగం జొహరా బేగం తీవ్రంగా ప్రతిఘటించారు. ఆ తీర్మానం తగదంటూ ఆమె వాదన ప్రవేశపెట్టారు. ఆ ప్రతిఘటన, ఆమె సాగించిన సంవాదం సమావేశంలో  సుదీర్ఘ చర్చకు కారణమయ్యాయి. ముస్లింలీగ్‌ నేతల మార్గదర్శకత్వంలో సాగిన ఆ సమావేశంలో సుల్తానా హయాత్‌ వాదనలు వీగిపోయాయి. ముస్లిం అయిఉంటే ముస్లింలీగ్‌లోకి చేరు  అంటూ సమావేశంలో ఒత్తిడి వచ్చినా జాతీయోద్యమకారుల వారసులైన ఆ సోదరీమణులు ఆ ఒత్తిడులకు తలవొగ్గలేదు. 
1942లో ప్రారంభమైన  క్విట్‌ ఇండియా ఉద్యమంలో నాటికి యువతిగా రూపాంతరం చెందిన బేగం సుల్తానా హయాత్‌ ఉద్యమంలో పాల్గొనటం ఆరంభించారు. ఆనాడు ముస్లిం మహిళలేంటి మహిళలందరి  విూద ఆంక్షలు ఉండేవి. మహిళలు పరోక్షంగా సహాయ సహకారాలు అందిచటం వరకు కార్యకలాపాలు పరిమితం. ఆ కారణంగా ఆమె పూర్తి స్థాయిలో కాంగ్రెస్‌ కార్యక్రమాలలో నిమగ్నం కాలేకపోయారు. అందువల్ల ఆమె కూడా ప్రత్యక్షంగా కార్యక్రమాలలో పాల్గొనకుండా పరోక్షంగా ఉద్యమకారులకు సహాయపడటం కోసం తనదైన కార్యకలాపాలను రూపొందించుకున్నారు.
జాతీయ కాంగ్రెస్‌ పిలుపు మేరకు ప్రదర్శనలు, పికెటింగ్‌లు, ఊరేగింపులు, శాసనోల్లంఘన కార్యక్రమాలు నిర్వహిస్తున్న  సందర్భంగా పోలీసుల దాష్టీకాలకు గురైన ఉద్యమకారులకు సేవలందించడానికి సుల్తానా హయాత్‌ అత్యధిక ఆసక్తి చూపారు. ఈ మేరకు యువతులతో ఒక సేవాదళాన్ని స్థాపించారు. ఈ దళం ఒకవైపు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూనే, మరొకవైపు బ్రిటీష్‌ ప్రభుత్వాన్ని చికాకు పర్చే చర్యలను ఎంతో సాహసోపేతంగా సాగించింది. బ్రిటీష్‌ పోలీసుల విూద సదా కన్నేసివుంచి, అధికారుల రాకపోకల గురించి  ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఆ సమాచారాన్ని ఉద్యమకారులకు తెలపటమేకాక ఉద్యమ  కొరియర్లు గా కూడా ఆమె పర్యవేక్షణలో దళ సభ్యులు పనిచేశారు.
 
ఈ సందర్భంగా ఎదురయ్యే ప్రమాదకర పరిస్థితుల నుండి బయట పడేందుకు యువతులు ఆయుధాలను ధరించాలని, ఆత్మరక్షణ కోసం పోరాట పద్దతులను యువతులకు నేర్పాలని  బేగం సుల్తానా నిర్ణయించారు. ఆ మేరకు తాత ఖాజీ నజీముద్దీన్‌ సహకారంతో సేవాదళ సభ్యులందరి కోసం ప్రత్యేకంగా ఆయుధాలను తయారు చేయించి, వాటిని ప్రయోగించడంలో కూడా  శిక్షణ ఇప్పించారు. అనివార్య పరిసిత్థులలో ఆత్మాహుతి చేసుకోడానికి కూడా సభ్యులు సన్నద్ధంగా ఉండేట్టుగా మానసికంగా వారిని తయారు చేశారు. అయితే ఆ తరువాతి కాలంలో ఆత్మహత్య నిర్ణయం తప్పుడు నిర్ణయమని ఆమె అంగీకరించారు.
1942 ప్రాంతంలో బేగం సుల్తానా మహాత్ముని  సేవాగ్రాంలో కొంతకాలం ఉన్నారు. తాత ఖాజీ నజీముద్దీన్‌తో కలసి ఆమె గాంధీజీ మార్గదర్శకత్వంలో పలు కార్యక్రమాల నిర్వహణలో పాల్గొన్నారు. సేవాగ్రాంలో ఉన్నప్పుడు ఆమె గాంధీజీకి మరింత సన్నిహితమయ్యారు. ఆమె గాంధీజీ పుస్తకాలు, ఉత్తరాలను ఉర్దూ భాషలో తర్జుమా చేస్తూ ఆయనకు  సహాయపడ్డారు. ఆమె సమర్థ్ధత, సంకల్పబలం గమనించిన గాంధీజీ ఆమెను బాగా ప్రోత్సహించారు.
స్వదేశీ ఉద్యమంలో భాగంగా సాగిన విదేశీ వస్తువుల, మద్యపాన విక్రయశాలల వద్ద జరిగిన పివెటింగ్‌ కార్యక్రమాలలో సుల్తానా హయాత్‌ చురుకుగా పాల్గొన్నారు. మహాత్ముని ప్రభావం ఎంతగా ఉన్నా, స్వతంత్ర భావాలు గల ఆమె  కొన్ని విషయాలలో ఆయనతో ఏకీభవించలేక వాదనకు దిగి చివరకు గాంధీజీ చేతనే శభాష్‌ అన్పించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.
ఆనాడు  కరాచిలో జరగనున్న జాతీయ కాంగ్రెస్‌ సమావేశాల సందర్భంగా వ్యక్తిగత సత్యాగ్రహాన్ని ఓ నియమంలా కాకుండా ఓ నీతిలా అనుసరించాలన్న ప్రతిపాదన గురించి పత్రికల్లో చర్చ జరుగుతుంది. ఆ చర్చ నేపథ్యంలో సుల్తానా హయాత్‌ గాంధీజీకి లేఖ రాశారు. ఆ లేఖలో కాంగ్రెస్‌ ప్రతిపాదనను ఆయన దృష్టికి తెస్తూ, వ్యక్తిగత సత్యాగ్రహం నియమం కాకుండా నీతి అని భావించినట్టయితే అది గాంధేయ మార్గానికి విరుద్ధం కాదా? అని గాంధీజీని ఆమె ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు సమాధానంగా 1942 జనవరి 27న సుల్తానా హయాత్‌కు గాంధీజీ స్వయంగా లేఖ రాస్తూ ఈ  విషయం విూద నీ అభిప్రాయం  సరైనది అని పేర్కొన్నారు.
ఓసారి ఉర్దూ భాష ముస్లింల భాష అని గాంధీజీ అన్నట్టుగా పత్రికలలో వచ్చింది. అది చూసిన సుల్తానా హయాత్‌ గాంధీజీతో విభేదిస్తూ, ఉర్దూ ముస్లింల భాష ఏమాత్రం కాదు, ఇది భారతీయులందిరి భాష కాగా విూరలా ఎందుకన్నారని ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు సమాధానంగా  నేను అలా అనలేదు. ఏంచేద్దాం ? పత్రికలలో చాలా విషయాలు తప్పులు రాస్తున్నారు అని ఆయన సుల్తానాకు సమాధానం చెప్పాల్సి వచ్చింది.
 
1946లో ఆమెకు లక్నో నివాసి, పండితుల కుటుంబం నుండి వచ్చిన హయాతుల్లా అన్సారీతో వివాహం జరిగింది. ఆయన ఉన్నత విద్యావంతుడు, గొప్ప సాహితివేత్త, రచయిత, జర్నలిస్టు. అన్నిటి కంటే జాతీయోద్యమ నాయకులలో ప్రముఖులు. భర్త సహచర్యంలో ఒకవైపున జాతీయోద్యమంలో పాల్గొంటూ అప్పటికే గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన అమె జర్నలిజంలో శిక్షణ పొందారు. భార్యభర్తలు జాతీయవాదులు కావటంతో జాతీయోద్యమంలో చురుకైన పాత్రను నిర్వహించారు.
బేగం సుల్తానా హయాత్‌ అన్సారి ముస్లిం లీగ్‌ వేర్పాటువాదాన్ని  నిరసించారు. లీగ్‌ నాయకుల వాదాలను పూర్వపక్షం చేస్తూ ప్రసంగాలు చేశారు. పత్రికలలో ప్రకటనల ద్వారా విభజన ప్రమాదాన్ని ప్రజలకు తెలిపారు. చివరకు స్వదేశానికి ‘ స్వరాజ్యం ‘ సిద్ధించినా, దేశం రెండుగా చీలిపోయినందున ఆ దుఃఖభారంలో మునిగిన  సుల్తానా దంపతులు క్రియాశీల రాజకీయాల నుండి నిష్క్రమించారు. 
 
ఆ  విధంగా  రాజకీయాలకు దూరమైన ఆ దంపతులు, హిందూ-ముస్లింల ఐక్యతకు కృషి ప్రారంభించారు. మత వైషమ్యాలను రెచ్చగొట్టే శక్తులకు వ్యతిరేకంగా ఉద్యమించారు. ఉర్దూ భాషా పరిరక్షణోద్యమానికి ఎంతగానో చేయూతనిచ్చారు.ఈ లక్ష్యసాధన కోసం అంజుమన్‌ తారఖ్ఖి-యే-ఉర్దూ జుదీశీతిళీబిదీ ఊబిజీబివివిరి-లి-ఏజీఖితి)అను సంస్థను స్థాపించారు. ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యకక్షురాలిగా ఆమె పనిచేశారు. ఉర్దూ భాషను రక్షించాలని, ఆ భాషను అభివృద్థిపర్చాలని డిమాండ్‌ చేస్తూ, 20 లక్షల సంతకాలతో ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి భారీ మహజరు సమర్పించారు.
మహిళలలో చైతన్యజ్యోతులు వెలిగించేందుకు సుల్తానా హయాత్‌  పలు మహిళా సంఘాలను, సంస్థలను స్థాపించారు. ఆ సంస్థలు ప్రస్తుతం శాఖోపశాఖలుగా విస్తరించి మహిళల సంక్షేమం కోసం కృషి చేస్తున్నాయి. మత సామరస్యానికి పాటుపడుతూ, మత మౌఢ్యానికి, అజ్ఞానానికి వ్యతిరేకంగా పోరాడుతూ, మహిళా సంఘాలకు, ప్రజా సంఘాలకు  మార్గదర్శకత్వం వహిస్తూ సుల్తానా హాయాత్‌ అన్సారి అశేష ప్రజానీకం ప్రేమాభిమానాలకు పాత్రులయ్యారు.దళిత జన హితైషి, పోలియో వ్యతిరేక పోరాటయోధురాలు
‘పద్మశ్రీ’ ఫాతిమా ఇస్మాయిల్‌

జాతీయోద్యమం భారతీయులలో మహత్తర సేవాతత్పరతకు  ప్రేరణయ్యింది.  ఆ స్ఫూర్తితో కుటుంబాలకు కుటుంబాలు ఉద్యమంలో పాలుపంచుకున్నాయి.  బ్రిటీష్‌ వలస పాలకుల కిరాతకాలను లెక్కచేయక పోరుబాటన నడిచాయి.  అటువంటి కుటుంబంలో సభ్యురాలిగా తల్లి-తండ్రి,అన్నా-తమ్ముళ్ళ బాటలోసాగి అటు జాతీయోద్యమంలో ఇటు సేవారంగంలో అద్వితీయమైన పాత్ర నిర్వహించిన మహిళ శ్రీమతి ఫాతిమా ఇస్మాయిల్‌. నాటి గుజరాత్‌ రాష్ట్రం బొంబాయికి చెందిన ప్రసిద్ధ స్వాతంత్య్రోద్యమ నాయకులు హజీ ముహమ్మద్‌ యూసుఫ్‌ సోహాని కుమార్తె బేగం ఫాతిమా. ఆమె కుటుంబం సంపన్న మోమిన్‌ వంశానికి చెందినది. ఆమె అన్నయ్య ముహమ్మద్‌ ఉమర్‌ సోహాని. చిన్నన్నయ్య ముహమ్మద్‌ ఉస్మాన్‌ సోహాని. ఉమర్‌ సోహాని బొంబాయిలో ప్రముఖ వ్యాపారవేత్త. ఆ ఇరువురు సోదరులు కూడా తండ్రి మార్గంలో విముక్తిపోరాట బాటలో ముందుకు సాగారు. జాతీయోద్యమ కార్యకలాపాలు సజావుగా సాగేందుకు అవసరమగు ఆర్థిక పుష్టిని అందించటంలో ఆ సోదరులు  ముందున్నారు. ఆనాడు భూరిగా విరాళాలు అందచేతలో ప్రధానంగా  ఉమర్‌ సోహాని ప్రఖ్యాతి గడించారు.
మహాత్మాగాంధీ తిలక్‌ ఫండ్‌ కోసం ముహమ్మద్‌ ఉమర్‌ సోహాని  వద్దకు రాగా తన చెక్కుబుక్‌ను ఆయకిచ్చి ఇష్టమొచ్చినంత రాసుకోమన్నారు. గాంధీజీ లక్ష రూపాయలను రాయగా అందుకు ఆయన సంతోషంగా అంగీకరించారు. ఆ తరువాత ఖిలాఫత్‌ ఫండ్‌ కోసం ఖిలాఫత్‌ నేతలు ఉమర్‌ సోహానిని  కలువగా వారికి కూడా ఆయన లక్షరూపాయాల విరాళం ఇవ్వటమే కాకుండా ఖిలాఫత్‌ కార్యాలయం ఏర్పాటుకు తన స్వంత భవంతిని అప్పగించారు. ఆ తరువాతి కాలంలో ఆ భవంతి ఖిలాఫత్‌ హౌస్‌ గా పిలువబడింది.

ముహమ్మద్‌ ఉమర్‌ సోహాని చాలా ఉదార స్వభావులు. జాతీయోద్యమ కార్యక్రమాల నిర్వహణకు అవసరమగు నిధుల అందచేతలో తానెప్పుడూ ప్రథమ స్థానంలో ఉండాలన్నది ఆయన అభిమతం. ఆ కారణంగా ఉద్యమనాయకులు ఆయన సహాయం కోరివస్తే అందరి కంటె అధిక మొత్తాన్ని అందించి ఆనందించటం ఆయన అలవాటు. ఆ అలవాటుకు తగ్గట్టుగా వ్యాపారంలో ఆయన అపారంగా ఆర్జించారు. ఆ క్రమంలో ఓ మాసంలో ఆయన సంపద ద్విగుణీకృతమైంది. ఆ తరువాత దురదృష్టవశాత్తు మరుసటి నెలలో అనూహ్యంగా కోట్లాది రూపాయలను ఆయన నష్టపోయారు. ఆ నష్టంతో ఆయన బాగా క్రుంగిపోయారు. ప్రజోపకర కార్యకలాపాలకు, ప్రధానంగా జాతీయోద్యమానికి ఆర్థిక సహాయం అందించటంలో ముందు ఉండలేకపోయినందున ఆయన ప్రజా జీవితం నుండి దూరం కావాలనుకున్నారు.
ఆ విధంగా  ప్రజా జీవితం నుండి రాజకీయాల నుండి దూరమైన సోహానిని వ్యాపారంలో వచ్చిన అపారనష్టం కల్గించిన వేదన కంటే  ప్రజలకు,  ఉద్యమకారులకు, జాతీయోద్యమానికి తాను ఏవిధంగానూ ఉపయోగపడలేక పోయాన్న దిగులు ఆయనలో అధికమయ్యింది. ఆ బాధతో సతమతమౌతూ 36 సంవత్సరాల వయస్సులో 1926 జూలై 6న ఆయన కన్నుమూశారు.
అటువంటి ఉదార హృదయులు, త్యాగశీలుర కుటుంబంలో  బేగం ఫాతిమా 1903 ఫిబ్రవరి 4వ తేదీన జన్మించారు. ఆమె  తండ్రి
యూసుఫ్‌ సోహాని, సోదరులు  ఉమర్‌ సోహాని, ఉస్మాన్‌ సోహానిలు కూడా జాతీయోద్యమకారులు. ఆ జాతీయోద్యమ నేతల గారాల పట్టిగా పెరిగిన కుమారి ఫాతిమా చిన్నతనం నుండే బ్రిటీష్‌ వ్యతిరేక భావాలను పుణికి పుచ్చుకున్నారు. అన్యాయాన్ని, అధర్మాన్ని ఏమాత్రం సంకోచం లేకుండా ధైర్యంగా ఎదుర్కోవటం  గుణంగా ఆమె ఎదిగారు. స్వేచ్ఛా-స్వాతంత్య్రాల పట్ల మక్కువ ఎక్కువ. అహేతుక ఆచార, సంప్రదాయాలకు ఆమె వ్యతిరేకి. సకారాత్మకమైనా నకారాత్మకమైనా తన అభిప్రాయాన్ని నిర్భీతిగా ప్రకటించటం ఆమె అలవాటు. 
1919లో ఆమె సీనియర్‌ కేంబ్రిడ్జి పూర్తిచేసి 1920లో బొంబాయి విశ్వవిద్యాలయం నుండి మెట్రిక్యులేషన్‌లో అత్యుత్తమ మార్కులతో ఉత్తీర్ణత పొందారు. ఉర్దూ, ఆంగ్ల భాషలలో మంచి విద్వత్తును సాధించారు. 1921-1923లో వియన్నాలో వైద్యవిద్య చదవడానికి వెళ్ళిన ఆమె అనివార్య కారణాల వలన వైద్యవిద్యను అసంపూర్ణంగా వదిలేశారు. ప్రభుత్వ ఉన్నతోద్యోగి హసన్‌ ఇస్మాయిల్‌ను ఆమె వివాహమాడారు. ఆయన కూడా స్వాతంత్య్రోద్యమాభిమాని. భర్త ప్రోత్సాహంతో స్వాతంత్య్రోద్యమంలో భాగంగా సాగిన స్వదేశీ ఉద్యమంలో పాల్గొనటం ద్వారా ఫాతిమా ఇస్మాయిల్‌ జాతీయోద్యమ రంగప్రవేశం చేశారు. స్వదేశీ వస్తువులను విక్రయిం చేందుకు, వినూత్న ఏర్పాట్లు చేసి ప్రజల, ప్రముఖుల దృష్టిని ఆకర్షించారు. విదేశీ వస్తువులను బహిష్కరించమని కోరటం మాత్రమే కాకుండా స్వదేశీ ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులో ఉంచాలనుకున్నారు. ఆ ఆలోచన రావటమే తరువాయి రైలులోని ఓ ప్రత్యేక బోగిలో స్వదేశీ వస్తుసామగ్రిని నింపుకుని  ఆ సామగ్రిని ప్రజలకు అందుబాటులోకి తెస్తూ, స్వదేశీ ఉద్యమ సందేశాన్ని వ్యాప్తి చేశారు. స్వదేశీ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొనటమే కాకుండా, స్వదేశీయులచే పలు కుటీర పరిశ్రమల స్థాపనకు ఆమె కృషి సల్పారు.
 
1934లో సమాజోద్ధరణలో భాగంగా మహిళలను చైతన్యవంతుల్ని చేసి సంఘటిత పర్చేందుకు సంఘాలు, సంస్థలు స్థాపించారు. అంజుమన్‌ ఇస్లాహే నిశ్వా మహిళా సుధార్‌ సమితి అను సంస్థను స్వయంగా ఆరంభించారు. 1935లో ఆమె అఖి ల భారత మహిళా సమావేశానికి కార్యదర్శిగా నియుక్తులయ్యారు. బొంబాయి ముస్లిం మహిళలలో వయోజన విద్యా వ్యాప్తికిఎంతో కృషిచేశారు. పలు సంఘాలను, సేవా సంస్థలను స్థాపించి, ఆయా సంస్థల అభివృద్ధికి శ్రమించారు. ఈ మేరకు మహిళలలో జాగృతికోసం  చేస్తున్న  కృషి ఫలితంగా 1937-1940ల మధ్యలో ఆమె అఖిల భారత మహిళా కాన్ఫెరెన్స్‌ హస్టల్‌ కార్యదర్శి బాధ్యతలు లభించాయి.
ఆ క్రమంలో 1940లో బొంబాయి ఉమెన్స్‌ కౌన్సిల్‌కు చెందిన లేబర్‌ సమితికి ఉపాధ్యకక్షురాలయ్యారు. ఆ పదవిలో ఆమె కార్మికుల కుటుంబాలలో మహిళల పరిస్థితులను మెరుగుపర్చేందుకు ప్రయత్నించారు. ఆమె స్వయంగా కర్మాగారాలకు చుట్టుపక్కల ఉంటున్న కార్మికవాడలకు వెళ్ళి కార్మిక కుటుంబాల మహిళలతో వారి సమస్యల విూద చర్చించారు. ఆ మహిళల సమస్యలను ప్రత్యక్షంగా చూసి ఆ సమస్యల పరిష్కారానికి ఆచరణాత్మక మార్గాలను సూచిస్తూ మహిళల అభిమానాన్ని చూరగొన్నారు. ఈ సందర్భంగా అఖిల భారత గ్రావిూణోద్యోగ సంఘం ఏర్పాటుకు పునాదులు వేశారు. సమస్యలతో సతమతమవుతున్న మహిళలు తమ సమస్యలను తాము పరిష్కరించుకుంటూ, ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు కుటీర పరిశ్రమలను, చేతి వృత్తులను ప్రోత్సహించారు. ఆ కృషిలో భాగంగా పలు మహిళా సంక్షేమసంఘాలను ఏర్పాటు చేశారు.
 
1942లో ప్రారంభమైన క్విట్‌ ఇండియా ఉద్యమంలో  ఫాతిమా ఇస్మాయిల్‌ క్రియాశీలపాత్ర వహించారు. ఈ ఉద్యమంలో పోలీసుల అరెస్టులను తప్పించుకుంటూ  ఆమె పనిచేశారు. ఒకథలో ఆమె అజ్ఞాతంలోకి వెళ్ళారు. 1940లో రాంఘర్‌, 1943లో బొంబాయిలో జరిగిన అఖిల భారత జాతీయ కాంగ్రెస్‌ సమావేశాలకు పాతిమా ఇస్మాయిల్‌ హజరయ్యారు. ఖద్దరు, స్వదేశీ ఉద్యమ ప్రచారం, స్వదేశీ ఉత్పత్తులకు ప్రోత్సాహం, హిందూ- ముస్లింల ఐక్యత ప్రధాన లక్ష్యాలుగా ఎంచుకుని ఆమె ముందుకు సాగారు. ఈ లక్ష్యాల సాధన కోసం సాగించిన ప్రయత్నాలలో భాగంగా  ఆమె పలు ప్రాంతాలను సందర్శించారు. 
క్విట్‌ ఇండియా ఉద్యమంలో ఫాతిమా ఇస్మాయిల్‌  చురుకైన భాగస్వామ్యం వహిస్తుండగా 1944 ప్రాంతంలో ఆమె కుమార్తె పోలియో బారిన పడింది. ఆ కారణంగా కుమర్తె అవిటితనానికి గురైంది. బిడ్డ అవిటిగా మారటంతో  ఫాతిమా ఇస్మాయిల్‌  తీవ్రంగా కలత చెందారు. పోలియో పరిణామాల నుండి ఆమెను కాపాడుకునే ప్రయత్నాలలో లక్షలాది పిల్లలు పోలియో రక్కసి బారిన పడి వికలాంగులుగా మారుతున్న దుస్థితిని గమనించారు.  సరైన చికిత్స లేని ఆ వ్యాధి నుండి పిల్లలను కాపాడుకునేందుకు వ్యాయామం ఒక్కటే కారణమని తెలుసుకున్న ఆమె ఆ దిశగా తన బిడ్డ విూద ప్రయోగాలు చేశారు. ఆమె ప్రయోగాలు సత్ఫలితాలనిచ్చాయి. దానితో పోలియో రహిత సమాజాన్ని ఏర్పాటు చేయడం సాధ్యమని ఆమెకు విశ్వాసం కలిగింది. కష్టసాధ్యమైన ఆ మహాత్తర లక్ష్యసాధనకు పూర్తికాలపు సేవలు అవసరమని ఆమె భావించారు. ఆ క్షణం నుండి  ఆమె సాగిస్తున్న బ్రిటీష్‌ వ్యతిరేక పోరాటానికి తాత్కాలికంగా స్వస్తి చెప్పి పోలియో నుండి బిడ్డలను కాపాడేందుకు పోలియో విూద ఆవిశ్రాంత పోరాటం సల్పేందుకు నడుంకట్టారు.
 
ఆమె గతంలో  వైద్యశాస్త్ర విద్యార్థి కావటంతో పోలియో నివారణ, నియంత్రణ కార్యక్రమాల విూద ప్రత్యేకంగా శిక్షణ పొందారు. బొంబాయికి చెందిన డాక్టర్‌ బాలిగాతో కలిసి పోలియో రోగగ్రస్తులైన పసిబిడ్డలకు వ్యాయామం ద్వారా పోలియోను నయం చేసేందుకు  1947లో ఒక సంస్థను ప్రారంభించారు. ఆ సంస్థ కోసం పోలియో రోగగ్రస్త బిడ్డల ఆరోగ్యం కోసం ఫాతిమా ఇస్మాయిల్‌ పూర్తి కాలాన్ని వినియోగించటం ప్రారంభించారు. పండిత నెహ్రూ కుటుంబానికి చాలా సన్నిహితంగా మెలిగారు. ఆ కుటుంబం సహాయ సహకారాలతో పోలియో నివారణ సంస్థను, ఆ సంస్థ కార్యక్రమాలను మరింతగా విస్తరింపచేశారు. 
 ఈ క్రమంలో పేదరికం, అనారోగ్యం పట్టిపీడిస్తున్న కార్మికులను, అజ్ఞానం, ఆర్థిక బలహీనతలతో బానిసల కంటే దుర్భరంగా బ్రతుకులీడుస్తున్న మహిళలనూ, సాంఘిక అసమానతలు, సామాజిక దురాచారాలను, అంటరానితనంతో అత్యంత హీనంగా చూడబడుతున్న దళిత జనసముదాయాల స్థితిగతులనూ అతిసవిూపం నుండి గమనించారు. ఆ అవాంఛనీయ పరిస్థితులలో మౌలిక మార్పుకోసం పనిచేయటం ఆరంభించారు.  ఈ దిశగా ఆమె తన జీవితాన్ని పూర్తిగా అంకితం చేశారు. శ్రమ జీవుల పక్షాన పోరాటాలు చేశారు. ఆరోగ్యం, పరిశుభ్రత విషయాలలో చైతన్యం కోసం కృషి సల్పారు.  కర్మాగారాల వాతావరణం, పరిశుభ్రత పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపారు.
జాతీయ అంతర్జాతీయ సంస్థల పిలుపు మేరకు,  పోలియో వ్యాధి నివారణకు తీసుకోవాల్సిన చర్యలను, పసిబిడ్డల పట్ల తీసుకోవాల్సిన ప్రత్యేక జాగ్రత్తలను వివరిస్తూ పలు విదేశీ పర్యటనలు జరిపారు, ఆమె స్వయంగా పలు చోట్ల  శిక్షణ పొందారు. స్వదేశంలో స్థాపించబడిన పలు స్వచ్ఛంద సేవా సంస్థలకు చేయూతనిచ్చారు. పోలియో పీడితులకు మాత్రమే కాకుండా అంగవికలాంగుల ఉద్ధరణకు కూడా ఆమె కృషిచేశారు. వికలాంగులకు ప్రభుత్వం నుండి సదుపాయాలు కలుగజేసేందుకు ఆమె నిరంతరం శ్రమించారు. వికలాంగుల సేవా కేంద్రాల స్థాపనను ప్రోత్సహించారు.     
ఈ  మేరకు అటు  పోలియో విూద అవిశ్రాంత పోరాటం చేస్తూ, ఇటు సామాజిక రుగ్మతలకు వ్యతిరేకంగా తిరుగులేని యుద్ధం ప్రకటించిన ఫాతిమా ఇస్మాయిల్‌  ఆచరణాత్మక సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 1957లో పద్మశ్రీ అవార్డుతో  గౌరవించింది. దళిత ప్రజల విూద కొనసాగుతున్న సామాజిక వివక్షతకు వ్యతిరేకంగా పోరాడుతూ దళిత జనావళి అభ్యున్నతి కోసం ఆమె సాగించిన కృషి గమనించిన దళిత ప్రజలు స్వయంగా 1972లో  దళితమిత్ర  అవార్డుతో ఆమెను సత్కరించుకున్నారు. ఈ విధంగా స్వదేశంలోనే కాకుండా విదేశాలలో కూడా ఆమెకు  గౌరవసత్కారాలు లభించాయి. పలు అవార్డులు ఆమె సొంతమయ్యాయి. ఆ విధంగా లభించిన పురస్కారాలన్నిటిని ఆమె మార్గదర్శకత్వంలో సాగుతున్న సేవాసంస్థల ఆర్థిక పరిపుష్టికి వినియోగించారు.
 
ప్రజాసేవారంగాలలో జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొంది, స్వాతంత్య్ర సమరోద్యమకారిణిగా, పోలియో నియంత్రణకు అవిరళ కృషి సల్పిన యోధురాలిగా, భారతీయుల ప్రియతమ సంఘసేవకురాలిగా, ఖ్యాతిగాంచిన ఫాతిమా ఇస్మాయిల్‌ 1979 లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఈ పదవిలో 1985 వరకు పనిచేశారు. రాజ్యసభ సభ్యురాలిగా కూడా ఆమె సంఘసేవా కార్యక్రమాలను విస్తృతంగా కొనసాగించారు.
ఈ విధంగా జీవిత చరమాంకం వరకు ప్రజాసేవలో గడిపిన శ్రీమతి ఫాతిమా ఇస్మాయిల్‌ 1987 అక్టోబర్‌ 11న కన్నుమూశారు.

 – సయ్యద్ నశీర్ అహమ్మద్

`~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
UncategorizedPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో