కొన్ని నెలల క్రితం చాన్నాళ్ళ తరువాత కలిసిన ఓ మిత్రుడితో ఓ సాయంకాలపు కాఫీ కబుర్ల మధ్యలో కుటుంబ విశేషాలూ , కుశల ప్రశ్నలూ అయ్యాక ఉనంట్లుండి ` కపిల్ సిబాల్ ప్రతిపాదన చూసావా ? ‘ అని ప్రశ్నించాడు . భారతదేశంలో కొత్తగా పదిహేనువందలవిశ్వవిద్యాలయాలు స్థాపించవలసిన అవసరం వున్నదన్న ప్రతిపాదన కొన్ని నెలల క్రితం చాన్నాళ్ళ తరువాత కలిసిన ఓ మిత్రుడితో ఓ సాయంకాలపు కాఫీ కబుర్ల మధ్యలో కుటుంబ అది . అంత ధనం , స్థలం , వనరులు , ముఖ్యంగా నిష్ణాతులైన నిబద్ధత కలిగిన బోధనాసిబ్బందినీ సమకూర్చుకోవడం సాధ్యమేనంటావా అని తిరిగి ప్రశ్నించాను . చిన్నగా నవ్వి వీటన్నింటినీ కార్పొరేట్ సంస్థల సామాజిక బాధ్యతగా సమకూర్చవచ్చు కానీ అంతకంటే పెద్ద సమస్య అంతమంది విద్యార్ధులు దొరకడం అన్నాడు ఐఐటి లో డాక్టొరేట్ చేసి సుమారు ఆ స్థాయి విద్యాసంస్థలో అత్యున్నత హోదాలో వున్న ఈ ప్రొఫెసర్ .
ప్రాధమిక స్థాయిలోనూ సెకండరీ స్థాయిలోనూ చదువు మధ్యలో మానేసేవారి సంఖ్య యింకా గణనీయంగా తగ్గితేనే కానీ ఈ విశ్వవిద్యాలయాలన్నీ స్థాపించబడేనాటికి వాటికి విద్యార్ధులు దొరకరు , కానీ అన్ని విశ్వవిద్యాలయాలు భారత దేశం నిజమైన స్వావలంబన కలిగిన స్వతంత్ర దేశంగా అభివృద్ధి చెందడానికి అవసరం ‘ అని చెప్పాడు .అతడు చెబుతున్నది మేం పనిచేస్తున్న కార్పొరేట్ విద్యాసంస్థల లో విద్యార్ధుల గురించి కాదనీ , మేం చదువుకున్న ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్ధులు చదువు మధ్యలోనే ఆపివేయడం గురించనీ నాకర్థమైంది . భారతదేశపు జనాభాలో నలభై శాతంపైగా పద్దెనిమిది సంవత్సరాలలోపు వారే . 2020 నాటికి భారతదేశపు జనాభా సగటు వయసు 29 సంవత్సరాలు కాగలదని అంచనా . ఈ వయసు మానవ వనరులలో అత్యంత ఉత్పాదక సామర్ధ్యం కలిగినది . కానీ సరి అయిన సమయంలో సరి అయిన వాళ్ళకి సరి అయిన విద్యనందించగలగడం మానవ వనరుల సమర్ధ వినియోగానికి అత్యంత కీలకమైనది . ఈ సగటు వయసు చైనా , యు.యస్ లకి 37, వెస్ట్ యూరోప్ దేశాలకి 45 , జపాంకి 48 . కానీ వారి అభివృద్ధి రేటు భారతదేశపు అభివృద్దిరేటు కంటే గణనీయంగా ఎక్కువ . కారణం ఆ దేశాలలో స్కూల్ డ్రాప్ అవుట్ రేట్ భారతదేశం కంటే సాపేక్షం గా తక్కువ .
మూడువందల ముప్పై మిలియన్ల నిరక్షరాస్యులున్న భారతదేశంలో సుమారు 60 శాతం బాలలు ప్రాధమిక విద్యాస్థాయిని దాటడంలేదు.వీరిలో సగానికి పైగా బాలికలే . స్వతంత్రం వచ్చిన నాటినుండి అక్షరాస్యతా రేటు కేవలం 12 శాతం వృద్ధి చెంది సుమారు 75 శాతానికి చేరింది . కానీ స్కూల్ డ్రాపవుట్రేట్ 2010-2011 గణాంకాల ప్రకారం 1 నుండి 5 తరగతుల స్థాయిలో 27 శాతంవీరిలో బాలికల శాతం 25. 1 , 1 నుండి 8 తరగతుల స్థాయిలో 40.6 శాతం వీరిలో బాలికల శాతం 41.1 , 1 నుండి పదితరగతుల స్థాయిలో 49.3 శాతంవీరిలో బాలికల శాతం 47. 9 వుంది. .స్వతత్రం వచ్చిన యిన్ని సంవత్సరాల తరువాత కూడా ఎనిమిది మిలియన్ల మంది బాల బాలికలు పాఠశాల గడపైనా తొక్కకుండా వుంటే , 80 మిలియన్ల మంది ప్రాధమిక విద్యని కూడా పూర్తి చేయకుండానే చదువు వదిలిపెట్టేస్తూ వుండడాన్ని జాతీయ అత్యవసర పరిస్థితిగా పరిగణించి నిర్బంధ ఉచిత విద్యాచట్టాన్ని అమలు పరుస్తున్నా చాలా పాఠశాలలలో విద్యార్ధులు ఏమీ నేర్చుకోలేకపోవడం చదువు మధ్యలో మానివేయడానికి ఒక కారణంగా యునిసెఫ్ భారతదేశపు ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు . నిస్సిగ్గుగా ఈ నిజాన్ని ఒప్పుకుందాం .
యిదే మనరాష్ట్రంలో 2011-12 గణాంకాల ప్రకారం 1 నుండి పదవతరగతి స్థాయి లో 45.71 శాతం అంటే సుమారు 884820 మంది బాలికల శాతం 45. 99 ; అప్పర్ ప్రైమరీ స్థాయి లో 20.79 అంటే 339277 మంది ,వీరిలో బాలికల శాతం 20. 06 ,ప్రైమరీ స్థాయిలో 34.67 శాతం అంటే 69088 మంది ,వీరిలో బాలికల శాతం 15. 27 .
శారీరకమైన వైకల్యాలు, మానసిక రుగ్మతలు, తల్లిదండ్రులు విడిపోవడం , తల్లిదండ్రుల అనారోగ్యం , తల్లిదండ్రుల వ్యసనాలు , పిల్లలకి ఆసక్తి లేకపోవడం , తల్లిదండ్రులకి తీరిక శ్రద్ధ లేకపోవడం ఆలస్యంగా పాఠశాలలో చేరడం , హాజరు తక్కువకావడం , చదువులో వెనకబడడం లాంటివి చదువు మద్యలో మానివేయడానికి గల కొన్ని కారణాలుగా నా కొద్ది కాలపు పరిశీలనలో గ్రహించాను . వీటన్నిటికంటే హేయమైన మరికొన్ని కారణాలు కూడా నా దృష్టిని దాటి పోలేదు . ము–గుడ్డలు మార్చుకోవడానికైనా మరుగులేని బడికి పోవడానికి ఎదిగిన ఆడపిల్లలు సిద్ధంగాలేరు . కనీస సౌకర్యాలు పాఠశాలలలో కరువవడం ఒక కారణమైతే కొంత మంది ఉపాధ్యాయుల తీరుతెన్నులు , విద్యార్ధుల పట్ల వారి అహంకార వైఖరి విద్యార్ధుల ఆత్మవిశ్వాశాన్నీ ఆత్మగౌరవాన్నీ దెబ్బతీయడం మరో కారణం .
చదువుపట్ల ఆసక్తి పెరిగేలా బోధించడానికి నేర్పు, సహనం కావాలి కానీ విద్యార్ధులని శాసించడానికి కేవలం బెత్తం చాలు…కానీ ఈ కారణం చాలు ఆత్మగౌరవం వున్న పిల్లలు చదువు మానేసి పనిలోకి పోవడానికి .
వెన్నెల చలికే వణికే చేతులు వేడి చాయ్ లందిస్తుంటే
పలకాబలపం పట్టే ప్రాయం పనిలో యాతన పడుతుంటే
బలి అవుతున్నది బాల్యమో దేశ ప్రగతి భవితవ్యమో
తేల్చుకోవాల్సిన నైతిక బాధ్యత మనందరిదీ …
డబ్బైమూడు సంవత్సరాల క్రితం ఓ పదమూడేళ్ళ కుర్రాడు కేవలం బీదరికం కారణంగా చిరిగిన లాగూ చొక్కా వేసుకుని పాఠశాలకి వెళ్ళాడు . ఓ ఉపాధాయుడికిది నచ్చలేదు , ఆ కుర్రవాణ్ణి నానా దుర్భాషలూ ఆడి చావ చితగ్గొట్టాడు , ఆ కుర్రవాడికి అహం కాదూ ఆత్మగౌరవం దెబ్బతింది . చేతిలో పుస్తకాలు అక్కడే విసిరేసి వెళ్ళిపోయాడు మళ్ళీ ఎప్పుడూ ఏ బడిగడపా తొక్కలేదు . పట్టుదల ఆయుధంగా బడులలో చెప్పని ఎన్నో పుస్తకాలని ఔపాసన పట్టాడు , ఎన్నో పుస్తకాలని వ్రాసారు . యూనివర్సిటీ ల నుండి గౌరవ డాక్టరేట్లని అందుకున్నారు . భారతదేశ సాహిత్య రంగంలో అత్యున్నతమైన జ్ఞానపీఠాన్నీ తన 86 వ ఏట అధిరోహించారు . ఆయన డా.రావూరి భరద్వాజ గా ప్రపంచమంతా గుర్తుంటుంది కానీ ఆ ఉపాధ్యాడెవరో ఎవరికీ తెలియదు , కేవలం సంస్కారం కారణంగా తెల్సిన భరద్వాజా చెప్పరు . కానీ దెబ్బలు తిని చదువుమానేసిన అందరూ భరద్వాజలు కాలేరు. యిప్పటికీ చాలా మంది ఉపాధ్యాయుల వైఖరి మాత్రం అలాగే వుండడం నిర్ద్వంద్వమైన సత్యం !
ఎవరో చదువు మానేస్తే మనకేం ? దానికి మనమేంచేయాలి ? అసలెందుకు చేయాలి ? లాంటి ప్రశ్నలు సహజం . సరే ఓ ఏనుగు పిల్లని తెచ్చి పెరట్లో కట్టేసి లేదా వదిలేసి పట్టించుకోలేదనుకుందాం . అందిన మేరకు అక్కడున్న గడ్డీగాదం , మొక్కామానూ , ఆకులూ అలములూ తిని బ్రతుకుతుంది , తర్వాత బలహీనమౌతుంది లేదా బరితెగిస్తుంది ఆ పైన మోయలేనంత భారమవుతుంది . అదే ఏనుగు పిల్లకి శ్రద్ధగా బాధ్యతగా మంచి శిక్షణ కూడా యిచ్చామనుకుందాం మనని అంబారీ ఎక్కించుకుని ఊరేగిస్తుంది . అలాంటి ఏనుగు పిల్లలు దేశంలోని బాలలు . కొంచెం శ్రద్ధవహించి చదివిస్తే …ఐరావతాలై దేశప్రగతిని ఆకాశమార్గాన నిలబెడతారు , బాధ్యతలని నెత్తిన పెట్టుకుంటారు . అందుకు … చదువు మద్యలో మానేసే బాలల పట్ల నైతికంగా అందరం శ్రద్ధ వహించి బాధ్యత తీసుకోవాలి .
మనమేమిటి చేయగలం ?
ఓ కుర్రాడి తండ్రి రిక్షా తొక్కుతూ తాగుడూ తిరుగుడూ ఎక్కువై అకస్మాత్తుగా చనిపోయాడు , తల్లి చేతులెత్తెసింది . ఆ కుర్ర్వాడు రిక్షా తొక్కడానికి వయసూ బలమూ చాలక సైకిల్ షాపులో చేరిపోయాడు . రోజూ ఆ రిక్షా ఎక్కే ఓ పెన్షనర్ ఆ కుర్రాడి పై జాలి పడ్డాడు , జాలి మాత్రమే పడలేదు , పరిచయాలని పురస్కరించుకుని సంబంధిత అధికారులతో మాట్లాడి ఆ కుర్రవాణ్ణి హాస్టెల్ లో చేర్పించారు , యిప్పుడా కుర్రవాడు నిక్షేపంలా చదువుకుంటున్నాడు .
నాకు తెలిసిన ఓ అమ్మాయి జిల్లాపరిషత్ పాఠశాలలో పనిచేస్తుంది . శిధిలావస్థలో వున్న పాఠశాల , ఏ రకమైన బోధనోపకరణాలూ లేవు ..విద్యార్ధుల సంఖ్య క్రమంగా తగ్గడం గమనించింది , అప్పుచేసి ఓ లేప్టాప్ కొంది పవర్ పాయింట్లు , వీడియోలూ చూపించి పిల్లలకి నేర్చుకోవడం పట్ల ఆసక్తి పెంచింది , చొరవచేసి చనువున్న మిత్రుల దగ్గర చందాలు వసూలుచేసి పాఠశాలని బాగుచేయించి ఆడపిల్లలకి అవసరమైన ప్రైవసీ ఏర్పాట్లు చేయించింది . ఆ పాఠశాలలో హాజరు శాతం క్రమంగా పెరిగింది డ్రాపవుట్లు దాదాపు శూన్యం .
మరో మిత్రుడు పార్ట్ టైం చేసి సంపాదించే డబ్బంతా తను పనిచేసే ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులకి నోట్సులూ , బట్టలూ , జోళ్ళూ , మందులూ కొనివ్వడానికి వినియోగిస్తాడు . యితడు పూర్తిగా ఫీజు చెల్లించి ఓ విద్యార్ధిని యింజనీరింగ్ చదివించడం నాకు తెలుసు .
తనపిల్లలకి ఫీజు వాపసు వచ్చే అవకాశం వున్న ఓ ఉద్యోగి ఆ మొత్తాన్ని బీదవిద్యార్ధులకోసం వినియోగించడం నేను గమనించాను .
పిల్లలని దండించే ఉపాధ్యాయులకి ఆ రోజు సిఎల్ మార్క్ చేసిన హెడ్మాస్టర్ని నేను చూసాను . మనసంటూ వుండాలేకానీ మార్గాలనేకం .
`నీకున్నదేదో నీ జీవనం – నీవిచ్చేదేదో నీ జీవితం ‘ అంటాడు విన్స్టన్ చర్చిల్ .
ఊపిరితోపాటు మన జీవనం ఆగిపోతుంది కానీ ఉదారతతో ఉదాత్తతతో జీవితం అమరమై కొనసాగుతూనే వుంటుంది .
ఆకలి గా వున్నవాడికి అన్నం పెట్టడం ఉదారత , ఆ అన్నం సంపాదించుకోగల చదువు కోసం సహాయం చేయడం ఉదాత్తత .
మరుజన్మ మనకుంటె ఈ మట్టి ఒడిలోన పలుజన్మలెత్తాలిరా..’ అని ప్రతిఒక్కరికీ అనిపించేలా ఈ దేశం నిలవాలంటే ఈ దేశంలో అమ్మాయిలు అసూర్యమ్ పశ్యలుగా నో , అమ్ట్లుతోమే పనిపిల్లలుగానో కాదు సరస్వతులు కావాలి అలా స్వయంసిద్ద లు కావాలి . అందుకోసం మన చేతులు సమీకరిద్దాం ! మన చేతలు సమీక్షించుకుందాం !!
– ఆచాళ్ళ శ్రీనివాసరావు
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~