శ్రీమతి శీలా సుభద్రాదేవి సెన్సిటివ్ గా, సీరియస్ గా రచన చేసే సీనియర్ రచయిత్రి. ఆమె కథల్లో స్త్రీ సమస్యలు, ఆకలి, దారిద్ర్యం, దోపిడి, మతమౌఢ్యం వంటి వివిధ సమస్యలు, సమాజంలోని అసమానతల పట్ల తన వేదనను స్పష్టంగా వెల్లడిస్తారు.
” ప్రచారాలకు, పటాటోపాలకు బహుదూరంగా తన ఆవరణాన్ని చీల్చుకుని చుట్టూ ఉన్న జనాన్ని గురించి పట్టించుకుని, తన ఆత్మతో పలకటం అన్న కళని ఆమె అభ్యసించింది” అని శివారెడ్డి గారు అన్న మాటలు వాస్తవం.
ఆమె అనుభూతుల అంతస్సూత్రంగా మానవ దుఃఖం పట్ల సానుభూతి ఉంటుంది. జీవితాన్ని నిర్హేతుక స్వప్నాల్లో తేల్చటం ఎక్కడా కనిపించదు. సాధారణ ప్రజానీకం పడుతున్న కష్టాన్ని , అంతులేని ఆవేదన చూసి ఆమె చలించిపోతారు. ఆమెలో మానవీయ ప్రేమ ఒక ఆలోచన ధారగా కొనసాగినట్లు తెలుస్తోంది. “నా పరిసరాల నుంచి ఏరుకొన్న సమస్యల్ని, స్పందనల్ని కవిత్వీకరించిచడం జరిగింది. జీవితం నిలువునా కొల్లగొట్ట పడుతున్న దృశ్యం ఈనాటి సామాజిక దృశ్యం” అంటారామె. సునిశిత దృష్టి, సున్నితమైన మనసు, వాస్తవ సంఘటనలనెన్నో నిశితంగా పరిశీలించి, నగ్న సత్యాలను పాఠకుడి ముందు ఉంచుతారు రచయిత్రి.
“కథ కాని కవిత గాని చదివినవారికి గుర్తుండి, కొంతకాలం వెంటాడాలి అని నా ఉద్దేశం. కేవలం నేను ఒక్క ఇజానికి పరిమితమై పోకుండా స్పందనే నా ఇజం, మానవత్వమే నా మతంగా రాస్తున్నాను” అంటారామె.
“రెక్కల చూపు” సుభద్రాదేవి గారి 18 కథల సంపుటి. ఈ కథలన్నీ పై పైన చదివేసి పక్కన పెట్టేసే కథలు లాంటివి కావు. పాఠకుని ఆలోచనా స్రవంతిని పదును పెట్టించేలా సృజించారు.
ఈనాడు ధనార్జన దృష్టితో భారతదేశపు మేధస్సు అంతా పడమటికి నిర్వహించబోతోంది. అనుబంధ గాఢత కలిగిన ఈ దేశంలో ఎంతో మంది తల్లిదండ్రులు ఆవేదనతో కాలం గడుపుతున్నారు. ప్రపంచీకరణ నేపథ్యంలో మానవ సంబంధాలు సన్నగిల్లి వస్తుప్రాధాన్యత పెరిగింది. మనుషుల మధ్య ఆత్మీయ స్పర్శ లోపించిపోతోంది. ఆరోహణం లో అవరోహణం కథలో అదే వివరించారు.
పరమేశం తన పదేళ్ల వయసులో తండ్రితో కలిసి, తండ్రి చేయి పట్టుకొని అదే ఊర్లో ఉన్న గుప్తా పచారీ షాప్ కి వెళ్లి సరుకులు తెచ్చుకునేవాడు. తను పెద్దవాడయ్యాడు. ఉద్యోగస్తుడయ్యాడు. పెళ్లయింది. పిల్లలు పుట్టారు. వారికీ పెళ్లిళ్లు అయ్యాయి. గుప్తా పచారీ షాప్ గుప్తా అండ్ సన్స్ జనరల్ స్టోర్స్ గా మారింది. షాపులో గుప్తా కొడుకు ఉన్నాడు. అయినా ఆయనకి ఆ షాప్ తో 50 ఏళ్ళ అనుబంధం అలాగే ఉంది.
ఒకసారి పరమేశంకి హఠాత్తుగా అనారోగ్యం రావటం, ఆపరేషన్, తర్వాత విశ్రాంతి తీసుకోవటం తప్పనిసరి అయింది. ఆ మూడు నెలలలో కొడుకు కోడలు ఇంటికి కావలసిన వెచ్చాలు తెచ్చుకున్నారు. కొన్నాళ్ళ తర్వాత కొంచెం ఓపిక రాగానే తనే వెళ్ళి సరుకులు తెస్తానన్నాడు పరమేశం. “వాళ్ళకి నచ్చిన చోట వాళ్ళు తెచ్చుకుంటారు లెండి” అన్నది భార్య తులసమ్మ, కోడలు మనసులో ఉన్న భావం గ్రహించి.
మాల్స్ నుండి సరుకులు తెచ్చుకోవటం కోడలుకి హాయిగా ఉంది. గతంలో పోపుగింజలు నిండా ఇసుకే. చెరగడం, బాగు చేసుకోవటం ఎంత కష్టంగా ఉండేది! ఇప్పుడు సూపర్ బజార్లో శుభ్రం చేసి, పాకెట్లలో అమ్ముతారు. చెరగటాలూ, బాగు చేసుకోవటం ఉండవు. పైగా ఆకర్షణీయమైన ప్యాకింగ్ లో అందంగా ఇస్తారు.
కూరగాయలు కూడా మల్టీ మాల్స్ నుండి కొడుకు, కోడలు తెచ్చుకుంటున్నారు. పర్యావరణానికి ఎంత చేటు అని పరమేశం గారి బాధ. ఒకసారి కుటుంబ సమేతంగా గా బంధువుల ఇంటికి పెళ్ళికి కార్లో వెళుతున్నప్పుడు గుప్తా షాపు రాగానే ‘చిరకాల స్నేహితుని ఇంటి ముందు నుంచి వెళ్తున్నప్పుడు కలిగే ఉద్విగ్నత’తో కారు నుంచి తొంగి చూశారు పరమేశం. పెళ్లి నుండి తిరిగి వస్తూ అక్కడ కారు దిగారు. అక్కడున్న గుప్తాని ఆప్యాయంగా పలకరించారు.
“తమ్ముడు కంప్యూటర్ కోర్సులు చేసి విదేశాలకు వెళ్ళిపోతున్నాడు. రోజు రోజుకీ పోటీ పెరగడంతో వ్యాపారం తట్టుకోవడం కష్టంగా ఉంది. గత్యంతరం లేక ఈ షాపు ‘మల్టీ చైను’ షాపుల అధినేతలకు అమ్మేసాను. వేరే చోట ఉద్యోగం వెతుక్కోవటం ఎందుకని ఈ షాప్ లోనే ఉద్యోగం చేస్తున్నాను” అన్నాడు గుప్తా. వేగవంతంగా మారిపోతున్న పరిస్థితులకు అవాక్కయ్యారు పరమేశం. చిన్నప్పటినుండి గుప్తా షాప్ అంటే సరుకులు తెచ్చుకునే చోటు మాత్రమే కాదు. ఆప్యాయతలు పెనవేసుకున్న ప్రదేశం. తనకే ఇలా ఉంటే – గుప్తా తరతరాలనుండి వస్తున్న షాప్ అమ్మేసి అక్కడే ఉద్యోగం చేయడానికి అతనికి ఎంత బాధగా ఉంటుందో అనుకొన్నారాయన.
“ఇంగ్లీషు వాళ్లతో యుద్ధం చేయలేక ఓడిపోతే మనం మళ్ళీ వాళ్ళ కిందే పని చేయాల్సి వస్తుంది” అని చెప్తూ, వందేమాతరం పాట చక్కగా పాడాలని, గాంధీతాతకి కోపం వస్తుందని చిన్నప్పుడు నాన్న చెప్పిన విషయం గుర్తుకు వచ్చింది.
గాలివాటు కథలు రాయలేదు సుభద్రాదేవి. పాఠకుడిని వెంటాడేలా ఉన్న ఇతివృత్తాన్ని తీసుకొని, కథనం చిక్కగా అల్లుతారు. ప్రధానంగా స్త్రీ సమస్యలనే స్వీకరించినా, అక్కడితో ఆగక సామాజిక పరమైన ఇతర సమస్యలు కూడా తీసుకొని రాశారు. ముఖ్యంగా ఈ కథలో ప్రపంచీకరణ పోకడలు, దానివల్ల లుప్తమైపోతున్న మానవసంబంధాలు, అంతేగాక పర్యావరణానికి చేటు తెచ్చే ప్లాస్టిక్ వినియోగం గురించి కూడా వివరిస్తారు. కథలో నవ్యత, సమకాలీనత, దేశీయత, సామాజికత ఉన్నాయి. ఇతివృత్త నిర్వహణలో ఆర్ద్రత ఉండి ఆలోచనలను రేకెత్తించేలా వుంది.
పరగత సుఖదుఃఖాలకు ప్రతిస్పందించే శక్తి, ఈనాటి సమాజ పరిస్థితులు, వ్యాపార సంస్కృతి ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోవటం, మానవ సంబంధాలు నీచమైన స్థాయికి దిగజారిపోవటం, కాదేదీ వ్యాపారానికి అనర్హం అన్నట్లుగా వ్యాపారం కానిది ఎక్కడా కనిపించడం లేదు అంటారామె. కథకి ఒక సామాజిక ప్రయోజనం ఉండాలి అని గాఢంగా నమ్ముతారు. ప్రపంచీకరణ ఆధునికత అనేది మనిషిలో అనేక మార్పులను తీసుకువచ్చింది సౌకర్యాలను చూసి మనుషులు మారిపోతున్నారు మధ్యతరగతి కుటుంబాల లో ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి సంఘటన ఎదురు పడుతూనే ఉంటుంది జీవితం నుంచి వచ్చే కథలు కలకాలం నిలబడతాయి.
స
రళమైన రచనా శైలితో మన చూపులు రెక్కలు కట్టుకుని ఆమె కథలను ఎక్కడ ఆపకుండా చదువుకుంటూ వెళ్లిపోతాయి. అదే ఆమె రచనా ప్రత్యేకత.
-డా.సిహెచ్.సుశీల
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~