క్రికెట్ వరల్డ్ కప్ ముగిసింది.జట్లూ , గెలుపు ఓటములూ , వర్షం. ధోనీ , బెట్టింగులూ, రంగుల జెర్సీలు, జ్యోతిష్యాలు ..క్రికెట్ కి సంబంధించిన ఇన్ని చర్చల మధ్య ఒక లేడి పిల్ల సాధించిన పతకాలనూ వారం వ్యవధిలో సాధించగల్గిన అపురూపమైన విజయాల్ని విస్మరించాము.
అస్సామ్…అఖండ బ్రహ్మపుత్రా నది..ఆ నదికి తూర్పున చిన్న పాయ ఒడ్డున వెలసిన ఐదు చిన్న గ్రామాలు. అందులో మూలకు విసిరేసినట్టున్న ‘ కంధూల్మరి’ గ్రామం ‘థింగ్ తాలూకా’.వంద కుటుంబాల చిన్న ఊరు. ఎర్రటి మట్టి ఇటుకల చిన్న ఇంట్లో జనవరి 9, 2000 న , ‘హిమా దాస్’ రంజిత్ దాస్..జోనాలి దాస్ దంపతులకు జన్మించింది..ఐదుగురు తోబుట్టువులలో పెద్దది హిమా..చిన్నప్పటి నుండే చాలా చురుకైనది.
తండ్రి అంటే ప్రాణం పెట్టే హిమా రంజిత్ వెంట పొలం పనులకు వెళ్ళేది. ఎడ్లతో పొలం దున్నేది. అతను పండించే ‘ పాటల్ ‘( ఒక రకం దోసకాయలు)ను చకాచకా తెంపి బస్తాల్లో నింపి సైకిల్ పై అలవోకగా ఇంటికి చేర్చేది. ఒకసారి పొద్దంతా మూడు క్వింటాళ్ల కాయలను వద్దన్నా వినకుండా ఇంటికి చేర్చింది.
.”నేను ఎక్కువ కష్టపడితే చూడలేదు నా కూతురు” అని మురిసిపోతారు రంజిత్.
‘థింగ్ పబ్లిక్ స్కూల్ ‘ లో అందరికీ ప్రియమైన హిమా అన్ని ఆటల్లో పాల్గొనేది.కానీ ‘ ఫుట్ బాల్ ‘అంటే ఎక్కువ ఇష్టం చూపించేది.వేగవవంతమైన కదలికలతో బాల్ ని గోల్ వైపు మళ్ళించేది. హిమా ఏ జట్టు లో ఉంటే ఆ జట్టు దే విజయం. ఫుట్ బాల్ లో జిల్లాలో చాలా టోర్నీలు ఆడింది.
అయితే హిమాలోని వేగాన్ని గమనించిన స్కూల్ పి.ఈ.టి “షం షుల్ హక్” మాత్రం హిమను సానపెడితే మరో పి.టి.ఉష కాగలదని ఆలోచించాడు. భారత దేశంలో ముఖ్యంగా స్త్రీల ఫుట్ బాల్కు పెద్దగా ప్రాముఖ్యత లేదని, రన్నింగ్ లో అథ్లెట్ గా రాణిస్తావని హిమకు నచ్చజెప్పాడు.
ఊరిలో మట్టి రోడ్ల పై సాధన కష్టం అని దగ్గరలో ‘ నగోఅన్’ జిల్లా కేంద్రం లో ప్రముఖ కోచ్’గౌరీ శంకర్ రాయ్ ‘ దగ్గరకు తీసుకెళ్లాడు. గౌరీ రాయ్ ఇతర కోచ్ ల సహాయం తో , కఠోర సాధన చేసింది. పొలాల గట్ల వెంబడి, రోడ్ల వెంబడి ఎప్పుడూ పరుగే. మొట్టమొదటిసారి ‘ ఢీకైజులి ‘ లో జరిగిన జిల్లా స్థాయి పరుగు పోటీలో ‘ బంగారు పతకం ‘ సాధించింది. అప్పుడు హిమా దాస్ వయసు పడమూడేళ్లు..
అప్పటినుండి ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు ఎన్నో పోటీలు, మెడళ్ళు సాధన. ఐదేళ్లలో ” థింగ్ ఎక్స్ప్రెస్ ” గా పేరు గాంచింది.
భారతదేశం తరపున పాల్గొనే అవకాశం లభించింది.2018 లో జరిగిన ‘ఆసియన్ గేమ్స్’ లో జకార్త లో ‘అండర్ 20’ ప్రపంచ స్థాయిలో పాల్గొన్నది 400 మీటర్లు 50.79 సెకన్లలో పూర్తిచేసింది .IAAF బంగారు పతకం సాధించి అందరి దృష్టిని ఆకర్షించింది.
2018 లో గోల్డ్ కోస్ట్ లో 400 mts రిలే 51.32 సెకన్ల వేగ0. తో విజయం సాధించింది.
జులై 2018 లో ఫిన్లాండ్ లో అంతర్జాతీయ స్థాయి లో ప్రపంచ ఛాంపియన్ గా అవతరించింది.
ప్రముఖ స్పోర్ట్స్ బ్రాండ్ ‘adidas’ హిమా దాస్ తో ఎండోర్సుమెంట్స్ చేసుకుంది.
భారత ప్రభుత్వం హిమా దాస్ ప్రతిభను గుర్తించి సెప్టెంబర్ 25, 2018 న ప్రతిష్ఠాత్మక “అర్జున్ అవార్డు ” ను అంద జేసింది.
UNICEF 2018 బ్రాండ్ అంబాసిడర్ గా హిమాదాస్ ను ఎంపిక చేసింది. భోగేశ్వర్ బారువ తర్వాత అస్సాం నుండి అంతర్జాతీయ స్థాయి అథ్లెట్ గా మారిన హిమాదాస్ ను తమ రాష్ట్ర’ బ్రాండ్ అంబాసిడర్’ గా ముఖ్యమంత్రి ప్రకటించారు.
మే 2019 న 12 వ గ్రేడ్ పూర్తిచేసి డిస్టెన్స్ లో డిగ్రీ చేస్తుంది ఈ జింక పరుగుల హిమ. ప్రస్తుతం ‘ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ‘ లో హెచ్.ఆర్.ఆఫీసర్ గా సేవలందిస్తోంది.
అంతేనా..ఇంకా ఉంది. హిమాదాస్ పేరు లాగానే చల్లని మనసు. కష్టాలని, పేదరికాన్ని చూస్తూ పెరిగింది. సేవా భావాలు ఎక్కువ. తొమ్మిదో తరగతిలోనే తోటి స్టూడెంట్ అనారోగ్యానికి గురైతే ఒక్కతే సైకిల్ మీద తీసుకెళ్ళి వైద్యం చేయించింది.” Monjoi” ( I want to ) పేరుతో స్నేహితులతో కలిసి సామాజిక సేవ గ్రూప్ తయారు చేసింది. గ్రామంలో లిక్కర్ షాపులను ధ్వంసం చేసి తాగుడు ఇతర వ్యసనాల పట్ల అవగాహన పెంచుతున్నారు.
హిమా సోదరి రింటీ దాస్ కూడా అథ్లెట్ . హిమా దాస్ గత ఎనిమిది రోజుల్లో నాలుగు బంగారు పథకాలు సాధించి దేశానికి అరుదైన విజయాల్ని అందించింది. అంతటి స్ట్రెస్ లో కూడా తన బాధ్యతను మర్చిపోలేదు. పది రోజులుగా అస్సాంను కుదిపేస్తున్న భారీ వర్షాలకు , వరదలకు అతలాకుతలం అయిన ప్రాంతాలకు సహాయంగా, తన నెల జీతం డొనేట్ చేసింది. ట్విట్టర్ , ఫేస్బుక్ ద్వారా ముంపుకు గురవుతున్న 30 గ్రామాలను కాపాడమని హిమా దాస్ అందరి సహాయాన్ని అర్ధిస్తున్నారు.
క్రికెట్ మాత్రమే ఆటని , పూర్తిగా వాణిజ్య పరమైపోయిన ఆ ఆటని మాత్రమే పట్టించుకుంటూ ఆ ఆట చుట్టూ వందల కోట్లు ఖర్చు చేస్తూ అసలైన క్రీడలనూ , క్రీడాకారులనూ నిర్లక్ష్యం చేస్తున్నాం.
కోచ్ లు నిపోన్ , నబాజిత్ ల పర్యవేక్షణలో రెండు వారాల్లో హిమా దాస్ సాధించిన ఘనత 23.43 సెకన్ల వేగం, ‘ పొజ్ఞాన్ అథ్లెటిక్ గ్రాండ్ ప్రీ ‘ పోలాండ్ లో వరుసగా .23.10 సెకన్లు, 23.65 సెకన్లు 200 మీ. V.K. విసమయాను ఓడించింది. అంతకు ముందు ‘జెక్ రిపబ్లిక్ ‘ లో అంతర్జాతీయ స్థాయి పోటీలో బంగారు పతకం.
మచ్చ లేని వ్యక్తిత్వం గల దళిత చిరుత. ఇప్పుడు హిమా దాస్ ఆమె కుటుంబ సభ్యుల దృష్టి 2020 లో టోక్యో లో జరగబోయే ఒలింపిక్స్ పైనే. నాలుగు నెలల క్రితం నడుము కండరాలలో నొప్పితో కొంచం ఒత్తిడి కి గురైనా , సాధనతో ఇప్పుడు మంచి ఫామ్ లో ఉంది. హిమా దాస్ వచ్చే ఒలింపిక్స్ లో కూడా పతకాల పంట పండిస్తుందని ఆశిస్తున్నానని తల్లి జోనాలి దాస్ అంటుంది.
పరుగుల రాణి ఉష తర్వాత స్టార్ అథ్లెట్ గా భారతదేశ కీర్తి పతాకాలు ప్రపంచ స్థాయిలో ఎగరేస్తున్న హిమా దాస్ విజయాలు మరింత మందికి ఆదర్శమవ్వాలి.
గోల్డెన్ గర్ల్ హిమా కు ప్రేమపూర్వక శుభాకాంక్షలు.
– రజిత కొమ్ము
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~