ఏప్రెల్ 14 బాబా సాహెబ్ డా.బి.ఆర్ అంబేద్కర్ 125వ జయంతి …..
లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ నుండి గ్రాడ్యుయేట్ అయిన మొట్ట మొదటి భారతీయ ఆర్థిక శాస్త్రవేత్త తన ప్రజల దుస్థితి చూసి రాజకీయ రంగ ప్రవేశం చేసి ఈ దేశం లోని మెజారిటేరియన్ మనస్తత్వానికి వ్యతిరేకంగా నిర్విరామంగా పోరాటం జరిపిన యోధుడు అంబేద్కర్. పిడి వాద మార్క్సిస్టులనుకున్నట్టు ఆయన వ్యవస్థలో అడ్వైజరీ మరియు నిర్వహణ పాత్రలు పోషించింది , వ్యవస్థలో భాగమవ్వడం కోసం కాదు. అదే నిజమైతే ఆయన కోట్లకు పడగలెత్తే వాడు. లేదా వ్యవస్థపై భ్రమ లు కలిగిన వాడు కాదు. అదే నిజమైతే గాంధి లాంటి వాడితో ఒంటరి పోరుకు దిగడు, మినిస్టర్ తదితర గౌరవ పూర్వమైన పదవులను తృణప్రాయంగా వదులుకోడు, దేశం మొత్తం హిందుత్వాన్ని ఎత్తి పడుతుంటే కమ్యూనిస్టులు చేయలేని పనిని తన భుజం మీద వేసుకుని హిందుత్వానికి వ్యతిరేకంగా గర్జించడు. అందుకే అంబేద్కర్ ఈ దేశం గమనించిన వినూత్న విభిన్న పోరు వీరుడు. అప్పట్లో ఎప్పుడు వస్తుందో , ఎప్పుడు రాదో తెలీని రక్త పాత విప్లవ మార్గాన్ని ఆయన పట్టుకోకపోవడం కన్నా ఆయన ఈ దేశం లోని దళితులకు , వెనుకబడిన వర్గాలకు సత్వరమైన సాధ్యమైన సమాధానం ఇవ్వడం ప్రధానం అనుకున్నాడు. విద్యావంతులు అయిన దళితులు వాళ్ళకేది సబబుగా తొస్తే అలా ముందుకెళ్లడానికి వాళ్ళకు ఒక అనుకూలమైన వాతావరణం కల్పించాడు. అందుకే అంబేద్కర్ రాజ్యాంగాన్ని ‘ కేవలం అప్పుడు ఉన్న తరం రాసుకున్న రాజ్యాంగం’ గానే పరిగణించాడు.
అంబేద్కర్ ఆత్మ గౌరవం కోసం చేసిన ఉద్యమాలు బ్రాహ్మణీయ మూలలను కదిలించి పారేసాయి. మేధావి వర్గం లో అంబేద్కర్ చేసింది ఇంచుమించు ఒంటరి పోరే. ఒంటరని, తన అభిప్రాయం కు తగిన ఆదరణ లేదని ఎప్పుడూ నిజం మాట్లాడ్డం లో వెనుక బడలేదు. అంబేద్కర్ కు సరి అయిన గొంతుక ఇవ్వరాదని కాంగ్రెస్, గాంధీ, హిందూవాదులు ఎంతగానో ప్రయత్నించారు. అటువంటి పరిస్థితుల్లో బ్రిటిష్ ప్రభుత్వం అంబేద్కర్ ను ‘ డిప్రెస్డ్ క్లాసెస్ సెక్షన్ ‘ ప్రతినిధిగా అంబేద్కర్ ను గుర్తించి అతని మాటకు , ఆలోచనా విధానానికి ఒక వేదిక ఇచ్చింది. ఇది నిజానికి, ఈ దేశ అగ్ర వర్ణ నాయకులు చూపించని ఉదారత్వాన్ని, బ్రిటిష్ ప్రభుత్వం చూపించవలసి రావడం ఈ దేశానికే సిగ్గు కరం. అయితే, అప్పటికే మొదటి ప్రపంచ యుద్ధ్ధం తర్వాత సామ్రాజ్య వాద పోరు తీవ్రతను గమనించిన బ్రిటిష్ ప్రభుత్వం, జలియన్ వాలా బాగ్ ఉదంతం తర్వాత తీవ్ర రూపం దాలుస్తున్న జాతీయోద్యమమ పట్ల జాగ్రత్త పడిన బ్రిటిష్ ప్రభుత్వం, మాంటేగ్ చేంస్ఫర్డ్ సంస్కరణల ప్రతిపాదనల క్రమం లో భారతీయుల పట్ల కొంత మెతక స్వభావాన్ని చూపింది. అయితే, అది కేవలం భారత దేశం పై తమ పట్టు సడలకుండా ఉండడానికి, మారిన ప్రపంచ పరిస్థితుల దృష్ట్యా వచ్చిన పరిపాలన శైలిలో మార్పు అది. అందుకే అంబేద్కర్ బ్రిటిష్ ప్రభుత్వం గురించి ఇలా అంటాడు ” The British choose to advertise our unfortunate conditions not with the object of removing them but only because such a course serves well as an excuse for retarding the political progress of India “
బ్రిటిష్ అవకాశవాదం తెలిసినా అంబేద్కర్, తమ దేశ నాయకుల దగాకోరు వ్యవహార శైలి వలన మరుగున పడ్డ , అసలేమీ గుర్తింపుకు నోచుకోని అణగారిన వర్గాల పట్ల తన గొంతుకను వినిపించడానికి ప్రపంచ ధ్యానాన్ని భారత దేశం లో ఉన్న నికృష్ట కుల వ్యవస్థవేపు సారించేలా కృషి చేసాడు. మొదటి రౌండ్ టేబుల్ కాన్ ఫరెన్స్ ( నవంబర్ 1930 – జనవరి 1931) అటెండ్ కాకుండా, రెండొ రౌండ్ టేబుల కాన్ ఫరెన్స్ ( సెప్టెంబర్ – డిసెంబర్ 1931) అటెండ్ అవ్వాలని గాంధి, కాంగ్రెస్ నిర్ణయించుకున్నారు. మొదటి రౌండ్ టేబుల్ కాన్ ఫరెన్స్ సమయం లో ఉప్పు పన్ను లాంటి విషయాలపై civil disobedience movement చేస్తున్న కాంగ్రెస్ ఫస్ట్ రౌండ్ కు అటెండ్ అవడాన్ని తిరస్కరించింది. అదే కాంగ్రెస్, గాంధి – ఇర్విన్ ఒప్పందం తర్వాత ( ఉప్పు పన్ను తొలగించడం, కేసులు ఎత్తివేయడం మొ|| ) రెండవ రౌండ్ టేబుల కాన్ ఫరెన్స్ కు ఒప్పుకోవడం, civil disobedience movement యొక్క స్వల్ప ప్రయోజనత్వాన్ని బయలు పరిచింది. ఇదే విషయాన్ని మొదటి రౌండ్ టేబుల్ కాన్ ఫరెన్శ్ అటెండ్ అయిన అంబేద్కర్ ముందుగా గమనించి కాంగ్రెస్ చేపట్టిన సహాయ నిరాకరణోద్యమం అవకాశ వాదంగా మొహమాటం లేకుండా ప్రకటించాడు. ఆ సమయం లో తిలక్ అంబేద్కర్ ను ‘బ్రిటిష్ ఏజంట్ ‘ గా వర్ణించాడు. అంబేద్కర్ కు ఉన్న స్పష్టత, నిజం మీద ఉన్న ధృఢ విశ్వాసం , తన నిజాయితీ గెలుపుపై తనకున్న నమ్మకం – ఏ మాత్రం తనని నిర్వీర్యం చేయ లేదు. మొదటి రౌండ్ టేబుల్ కాన్ ఫరెన్స్ తర్వాత – ప్రపంచ వ్యాప్తంగా ఈ దేశం లో ఉన్న నికృష్ట కుల వ్యవస్థ గురించి ప్రపంచానికి తెలియడం జరిగింది. ప్రతి మీడియాలో అణగారిన వర్గాల సంరక్షక దారుడిగా అంబేద్కర్ పేరు మారు మ్రోగిపోయింది. సండే క్రానికల్ అనే పేపర్ అంబేద్కర్ ను ” At heart a true nationalist ” అని అభివర్ణించింది. ఆ రోజు మొదటి రౌండ్ టేబుల్ కాన్ ఫరెన్స్ లో అణగారిన వర్గాల గురించి అంబేద్కర్ మాట్లాడకపోయి ఉంటే, కుల వ్యతిరేక పోరాటం , రాజకీయ రిజర్వేషన్ లు, ఆ తర్వత గాంధీని ఇబ్బంది పెట్టిన ‘ కమ్యూనల్ అవార్డ్’ – ఖచ్చితంగా ఒక పెద్ద అడుగు వేయడం ఆగిపోయేది.
ఇదిలా ఉండగా సెకండ్ రౌండ్ టేబుల్ కాంఫరెన్స్ లో అంబేద్కర్ వాదించిన Dual vote system ను బ్రిటిష్ ప్రభుత్వం అంగీకరించి ‘ కమ్యూనల్ అవార్డ్ ‘ ప్రకటించింది. దీని ప్రకారం – దళితులను దళితులు మాత్రమే ఎన్నుకోవడం. దళితులను ఎన్నుకోవడానికి ఎటువంటి ఇతర కులాల వోట్లు అవసరం లేకుండా ఉండడం ఈ అవార్డు లో ప్రత్యేకత. ఇది హిందూ వాదులకు చెంప పెట్టు అయ్యింది. దళితులు తమను తాము ఎన్నుకోవడం అంటే హిందూ వ్యవస్థ నుండి బయటకెళ్ళడమే. ఈ విధానం నచ్చని గాంధి సత్యాగ్రహం చేయడం ఈ దేశం చరిత్ర చూసిన ఒక దౌర్భాగ్య సంఘటన. అయితే తన ప్రజల పట్ల ఉన్న అపార చిత్త శుద్ధి కలిగిన మబేద్కర్ ” సత్యాగ్రహం చేయడానికి గాంధీ ఎవరు ? నాతో కలిసి కూర్చుని భోజనం చేయమనండి ” అని మొహమాటం లేకుండా విమర్శించాడు. దేశం మొత్తం గాంధీ ఆరోగ్యం గురించి ఉడికి పోతున్నప్పుడు , తన ప్రజల లో ఉన్న సత్తువ లేని తనాన్ని దృష్టిలో పెట్టుకుని తప్పని సరి పరిస్థితుల్లో ‘ పూనా ఒడంబడిక ‘ చేసుకున్నాడు. దళితుల కు ఎక్కువ సీట్లు రిజర్వేషన్ గా సంప్రాప్తించినా , వాళ్ళకు అగ్ర కుల పార్టీలు , ఇతర కుల వోట్లు అవసరం కావడం తో అంబేద్కర్ కల గన్న ఒక స్వప్నానికి పెద్ద గండి పడింది.
బ్రిటిష్ వ్యతిరేక పోరాటం లో అంబేద్కర్ ఒక్క సారి కూడా జైలు కెళ్ళలేదు . అలాగని బయట దొరికే ప్రతి సౌకర్యం జైళ్లలో కల్పించుకుని పోరాటం చేసే గాంధి త్యాగ నిరతికి ఎలా మారు పేరు అవ్వగలడు ? ప్రతి అడుగులో బ్రిటిష్ కు ఇబ్బంది కలగకుండా వాళ్ళు సూచించిన సంస్కరణల్లో అటూ ఇటూ తేడాతో మార్పు కోరుకునే గాంధీ యొక్క విశ్వాసం ఏ విధంగా ప్రేరణ అవుతుంది ? తాను ఎంచుకున్న ఒంటరి పోరులో , హృదయం నుండీ కన్నీళ్ళు కార్చి గడిపిన రాత్రులు అంబేద్కర్ జీవితం లో ఉన్నాయి.
ఈ సంఘటనలు ఉదంతాలు చదివితే అంబేద్కర్ చిత్త శుధ్ధి అడుగడుగునా ప్రతిబింబిస్తూ వెంట్రుకలు నిక్క బొడిచేలా చేస్తుంది. మనకు అంబేద్కర్ నేర్పించింది – ఈ దేశాన్ని ఎన్నో వేల సంవత్సరాలు వెనక్కు తీసుకెళ్ళిన బ్రాహ్మిణిజాన్ని కూకటి వేళ్ళతో పాటు పెకిలించడానికి ఏ మాత్రం రాజీ పడక పోవడం, ప్రతి అవకాశాన్ని ఏ మాత్రం వదలకుండా కుల వ్యవస్థ గుట్టు రట్టు చేయడం, మన వెనుక ఎంత మంది ఉన్నారని కాక మనం నమ్ముకున్న సూత్రాల్లో ఎంత నిజాయితీ ఉంది అని చిత్త శుద్ధి తో అడుగు వేయడం, ప్రతి పోరాటాన్ని ఒక ధృఢమైన తాత్విక చింతనతో రాజీ లేకుండా కొనసాగించడం, ఒకరికి తల వంచకుండా ఏ మాత్రం గాలితో పాటు కొట్టుకుపోయే కాగితం ముక్కలాంటి జీవించకుండా వ్యక్తిత్వం తో జీవించడం.
Rationalism పై అడుగుడుగునా దాడులు జరుగుతున్న ఈ ఫాసిస్ట్ పాలనా కాలం లో , ఎన్నో పోరు సిద్ధాంతాలు మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ప్రతి సిద్ధాంతం పోరాటం చేయడం కోసమే కాదు , నిజానికి కొంత ఉన్న వ్యవస్థతో negotiate చేయడానికి మాత్రమే ప్రతిపాదించినవి ఉంటాయి. అంబేద్కర్ జీవితం సాంఘిక దుర్మార్గాలను ఎదుర్కోవడం లో, సరి అయిన ప్రాతిపదిక కలిగిన సైధ్ధాంతిక మార్గం లో నడవడం లో మనకు మార్గ దర్శకం అవుతుంది. అప్పుడే ఫాసిజానికి, బ్రాహ్మణియ హిందూ వ్యవస్థకు , అణగారిన ప్రజల పీడనకు వ్యతిరేకంగా స్పష్టమైన పోరాటం జరుగుతుంది. అందుకే – ఇప్పుడిక అంబేద్కరే మనకు ఆయుధం !!
-పి.విక్టర్ విజయకుమార్
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`
6 Responses to ఇప్పుడిక అతనే మన ఆయుధం!-పి.విక్టర్ విజయకుమార్