అందుకే తనకు అనుకూలంగా ఉండే శివప్ప, మరికొందరు వార్డు మెంబర్లను కూడగట్టుకున్నాడు. అగ్రకులస్తుడైన శివప్ప వీళ్ళతో కుమ్ముక్కయ్యాడు. వీధి బల్బులకోసం అడ్వాన్స్ ఇచ్చిన 4 వేల రూపాయలు జమా ఖర్చులో చూపించలేదు. గ్రామ పంచాయితీలో అక్రమాలు జరిగినట్లు, సర్పంచ్ పంచాయతీ సొమ్ము దుర్వినియోగం చేసినట్లు జిల్లా పంచాయతీ అధికారికి కంప్లేంట్ ఇచ్చాడు రాజాగౌడ్ వర్గానికి చెందిన శివప్ప.
ఈ కుట్ర, కుతంత్రం ఆ వార్త పేపర్లో వచ్చే వరకూ తెలియనే తెలియదు. బడిపంతులు రవి పేపర్ చూసి చెప్పేవరకు. గ్రామపంచాయతీ నిధులు దుర్వినియోగం కారణంగా సర్పంచ్ పోశవ్వ చెక్పవర్ రద్దు చేస్తున్నట్లుందా వార్త.
ఒక్క క్షణం ఏం చేయాలో తోచలేదు పోశవ్వకి. ఎలా జరిగింది? తనకు తెలియకుండా ఎక్కడో ఏదో పొరపాటు జరిగి ఉంటుంది అనుకుని వెంటనే విషయం ఏమిటో తెలుసుకుందామని గ్రామపంచాయతీ కార్యనిర్వహణాధికారి జగపతిరావుని పిలిపించింది.
”ఈఓ సాబ్… ఈ పేపర్ చూసిన్రా..?” అంటూ పేపర్ అతనిముందుంచింది.
అప్పికే ఆనాటి దినపత్రికలో ఆ వార్త చదివినా చదవనట్లుగానే పేపర్ అందుకున్నాడు జగపతిరావు. కొద్ది క్షణాల తర్వాత
”ఇట్లెట్లయింది…?” ప్రశ్నించాడు ఏమీ ఎరగని వాడిలా.
”అదే… ఎట్లయింది? తెలుస్తలే…” పోశవ్వ ఆలోచిస్తూ.
”ఏమో…” కొద్దిగా దురుసుతనంగా జలపతిరావు
”జమా ఖర్చులన్నీ రాసిన్రా..? ప్రశ్నార్థకంగా పోశవ్వ.
”రాసినం” ఈవో ముక్తసరి జవాబు.
”ఆ పుస్తకాలు ఇయ్యిన్రి చూత్తం” పోశవ్వ.
”అన్ని రాసినం గవ్వెందుకట?”
”ఏడ పొరపాటయిందో సూస్కోవాలె గద… అవితీయిన్రి” పోశవ్వ స్ధిరంగా… తీస్తారా లేదా అన్నట్టుగా
ఇక తప్పలేదు జగపతిరావుకి. ఆ రికార్డులు తీయించి అటెండర్తో పోశవ్వ దగ్గర పెట్టించాడు . చాలా జాగ్రత్తగా ఒక్కొక్కటే నిదానంగా పరిశీలిస్తూ వచ్చింది పోశవ్వ.
గత నెలలో కరెంటు బల్బులకోసం అడ్వాన్స్ ఇచ్చిన విషయం రికార్డుల్లో కన్పించలేదు. జగపతిరావు ప్రవర్తన గమనిస్తోన్న, అనుమానిస్తున్న పోశవ్వ అనుమానాన్ని నిజం చేసిందీ సంఘటన. కావాలనే రాజాగౌడ్, శివప్పల ప్రోద్బలంతోనే ఈ ఓ రికార్డు చేయలేదనీ తనను అప్రతిష్టపాలు చేయాలని వారు పన్నిన పన్నాగమే ఇదనీ, వారే జిల్లా పంచాయతీ అధికారికి వార్త అందించారనీ ఖాసిం ద్వారా తెలుసుకుంది. గతంలో రాజాగౌడ్, జగపతిరావు కలసి పంచాయతీ సొమ్ము ఎలా స్వాహా చేసిందీ పోశవ్వకు తెలియనిది కాదు.
జిల్లా పంచాయతీ అధికారికి వివరణ ఇచ్చిన పోశవ్వ ఇక ముందు ఇలా జరగకుండా ఉండాలంటే తను మరింత క్షుణ్ణంగా విషయాలు పరిశీలించాలనుకుంది. తనని, తన పనితనాన్ని దెబ్బతీయడానికి గోతికాడి గుంట నక్కల్లా కొందరు చూస్తా ఉంటారని తెల్సుకుంది.
జమ, ఖర్చుల వివరాలు ప్రజలందరికీ తెలియాలి. అలా చేస్తే తప్పు చేయడానికి ఎవరికైనా అవకాశం తక్కువే. ఒక వేళ తెలిసో తెలియకో జరిగినా జనం నిలదీయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి జామా,ఖర్చు ప్రజల ముందుండాలి. ఎలా..? రెండ్రోజులు తీవ్రంగా ఆలోచిస్తూ బడి ముందు నుండి నడుస్తోంది ఆమె.
పంతులు ‘రవి’ బ్లాక్ బోర్డు మీద రాసి లెక్కలు చెప్తున్నాడు. ఆ దృశ్యంఆమెకో ఆలోచననిచ్చింది.
– శాంతి ప్రబోధ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~