
పొత్తూరి విజయ లక్ష్మి
ప్రముఖ రచయిత్రి పొత్తూరి విజయలక్ష్మి మే10, 2015 న ‘అమృత లత అపురూప అవార్డు’ అందుకోబోతున్న సందర్భంగా విహంగ పాఠకుల కోసం వారితో ముఖాముఖీ ….
*విజయ లక్ష్మి గారు మీరు ఎక్కడ పుట్టి పెరిగారు ?
నేను గుంటూరు జిల్లా బాపట్ల తాలూకా యాజలి అనే గ్రామం లో మా తామహుల ఇంట పుట్టాను ..
*మీ బాల్యం ఎక్కడ గడించింది ?
మా నాన్నగారు వల్లూరు కృష్ణ మూర్తి గారు p .w .d లో సివిల్ ఇంజనీరు గా పని చేసేవారు. ఏడాది కి మూడు ఊళ్ళు చొప్పున తిరిగేవాళ్ళం .ప్రత్యేకంగా ఒక ఊరి పేరు చెప్పలేను . ఆంద్ర రాష్ట్రం లో గడించింది నా బాల్యం.
*మీ తొలి కథ ఎప్పుడు రాసారు ? ఏ వయసు నుంచి రచనలు మొదలు పెట్టారు ?
నాతొలి కధ 1982 లో రాసాను. అప్పటికి నా వయసు 29.
*మీ తొలి కథ లోని వస్తువు ఏమిటి ?
‘స్క్రిప్ట్ సిద్ధంగా వుంది-సినిమా తియ్యండి’ అని ఒక వ్యంగ్య రచన.
*మీరు కథలు రాయడానికి ప్రేరణ ఎవరు ?
.ప్రేరణ అంటే నేను చదివిన మంచి కధలు . రాయాలనే ఉత్సాహం అంతే!
*మీకు హాస్య రచయిత్రిగా ముద్ర పడటానికి కారణం ఏమిటి ?
హాస్యాన్ని అపహాస్యం చెయ్యకుండా ఆరోగ్యకరమైన హాస్యం రాసి చదువరులను ఆకట్టుకోవటమే కారణం ..
*కథలో ఎక్కువగా హాస్యాన్ని చొప్పించడం మీకు ఎలా అలవడింది ?
చిన్నతనం నుండి హాస్య పూరితమైన వాతావరణం లో పెరిగినందువల్ల హాస్యం నా జీవితం లో ఓ భాగం అయిపోయింది . ఆ ప్రభావం నా రచనల్లో కనిపిస్తుంది .
*హాస్యాన్ని ఎంచుకోవడానికి ప్రత్యేక కారణాలేమైనా ఉన్నాయా ?
నవ్వటం నవ్వించటం నాకు ఇష్టం .యెవరైనా తమకి ఇష్టమైన పనే చేస్తారు కదా.!
*సునిశితమైన హాస్యాన్ని , వ్యంగ్యాన్ని రాసి పాఠకుల్ని మెప్పించటం కష్టం అంటారు కదా ? మీ అనుభవాలేమిటి ?
నామటుకు నాకు హాస్యం రాయటం నల్లేరు మీద బండి నడక అలవోకగా రాసేస్తాను. మంచి కధాంశం తడితే ఏకబిగిన రెండు గంటల్లో ఓ కథ రాసేస్తాను. మళ్ళీ ఫెయిర్ చెయ్యటం కూడా వుండదు ఆ కథను అలా పత్రికకి పంపెయ్యటమే .
*మీ రచనలలో వ్యంగ్యం కూడా సమస్థాయి లోనే ఉంటుంది ? ఎవరైనా భుజాలు తడుముకున్న సందర్భాలున్నాయా ? మీరే మైన సంఘటనలు ఎదుర్కున్నారా ?
ఏమో మరి నాచాటున భుజాలు తడుముకున్నారేమో . నాకు చెప్పలేదు ఎవరూ..
*మీకు హాస్య రచయితగా ఎప్పటి నుంచి గుర్తింపు లభించింది ?
మొట్ట మొదటి రచన నుండీ నాకు హాస్య రచయిత్రిగా గుర్తింపు వచ్చింది
*సినిమాలుగా మలచబడ్డ మీ నవలల పేర్లు చెప్పండి ? ఆ అవకాశం ఎలా వచ్చింది ?
మొదటి నవల ప్రేమలేఖ .చతుర లో వచ్చింది ఉషాకిరణ్ మూవీస్ వారు సినిమాలు తియ్యాలనే ఆలోచన లో వున్నప్పుడు వారికి నా నవలను సూచించారుట . జంధ్యాల గారికీ ఆ కథ నచ్చింది .శ్రీవారికి ప్రేమలేఖ సినిమా తీసారు . అది సూపర్ డూపర్ హిట్ ..ఇంకొక నవల ‘సంపూర్ణ గోలాయణం’ . జంధ్యాల గారి దర్సకత్వం లో నే ‘ ప్రేమ యెంత మధురం ‘సినిమాగా వచ్చింది .శంకర రావు పెళ్లి నవల ప్రేమ చిత్రం పెళ్లి విచిత్రం సినిమాగా వచ్చింది నా నవలలు నచ్చి ప్రొడ్యూస ర్లు నా దగ్గరికి రావటం తప్పించి నేనెప్పుడూ అవకాశాల కోసం ప్రయత్నించ లేదు.
*యిప్పటి వరకు ఎన్ని నవలలు ? ఎన్ని కథలు రాసారు ?
20 నవలలూ 200 పైగా కధలూ రాసాను.
*మీకు కవితా ప్రక్రియలో కూడా పరిచయం ఉందా ?
కవితలు రాయలేదు హాస్య కవితలు రాయాలని కోరిక వుంది మరి ప్రయత్నించాలి.

మునిమాణిక్యం నరసింహారావు స్మారక హాస్యనిధి పురస్కారం
*యిప్పటి వరకు ఎన్ని అవార్డులు , పురస్కారాలు అందుకున్నారు ?
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి కీర్తి పురస్కారం .. తురగా కృష్ణ మోహన్ స్మారక పురస్కారం . లేఖిని సంస్థ వారి ద్వారా శ్రీపాద శేషా రత్నం స్మారక పురస్కారం, గృహలక్ష్మి స్వర్ణ కంకణం , మునిమాణిక్యం నరసింహారావు స్మారక హాస్య నిధి పురస్కారం అందుకున్నాను .
బెంగలూర్ ‘ముంబై ‘విజయవాడ’ విజయనగరం’ విశాఖ పట్నం ‘గుంటూరు ‘నిజామాబాద్ మచిలీపట్టణం’ శ్రీకాకుళం ‘డల్లాస్ ‘హైదరాబాద్ మొదలగు ప్రదేశాలలో సన్మానాలు అందుకున్నాను.
*అమృత లత ‘అపురూప’ పురస్కారం అందుకోబోతున్నారు కదా ! మీ స్పందన ఏమిటి ?
నవరసాలలో మిగిలిన రసాలకు వున్న గుర్తింపు ,గౌరవం హాస్యానికి లేదు . హాస్యాన్ని అందరూ ఆస్వాదిస్తారు ఆనందిస్తారు. కానీ ఎక్కడా ఏ పెద్ద సభలలోను హాస్య రచనకు ప్రవేశం వుండదు అటువంటిది మిగిలిన ప్రక్రియలతో బాటు హాస్యాన్ని కూడా గుర్తించి అవార్డు ఇచ్చి గౌరవించటం నాకు ఎంతో తృప్తినీ ఆనందాన్నీ కలిగించాయి . అపురూప వారి మార్గాన్ని మరికొంతమంది గొప్ప వారు అనుసరిస్తే హాస్య రసానికీ తగిన గౌరవం దక్కుతుంది కదా అని ఆశగా వుంది
*మీకు నచ్చిన హాస్య రచయితలు ఎవరు ?
బీనాదేవి గారికి ఏకలవ్య శిష్యురాలిని . శ్రీరమణ ,కవనశర్మ , . వీరే కాకుండా మంచి హాస్య రచన రాసే వారంటే నాకు అభిమానమ్.
*హాస్యం రాస్తున్న వారికి మీరిచ్చే సూచనలు, సలహాలు ?
ఇంకానయం…. సలహాలు ఇచ్చే స్థాయికి నేనింకా యెదగలేదు.
*లేఖిని సంస్థకు మీరు సెక్రటరీ కదా, ఆ సంస్థ ద్వారామీరు చేస్తున్న కార్యక్రమాలు ఏమిటి ?

లేఖిని10వ వార్షికోత్సవం
లేఖిని రచయిత్రుల సంస్త . 2009 లో కేంద్ర సాహిత్య అకాడమి వారితో సంయుక్తం గా ఒక సదస్సు నిర్వ హించాం .. 2011 లో కేంద్ర సాహిత్య అకాడమీ ఆంధ్ర ప్రదేశ్ సాంస్కృతిక శాఖ వారితో కలిసి రెండురోజుల రచయిత్రుల సదస్సు నిర్వహించాం . 2015 ఏప్రిల్ లో తెలుగు విశ్వ విద్యాలయం వారితో కలిసి సదస్సు నిర్వహించాం . మహిళల సమస్యల మీద చర్చలు, . తెలుగుభాష పై చర్చలు పుస్తకావిష్కరణలు ,,రచయిత్రులతో ముఖాముఖి , వంటి కార్యక్రమాలు చేస్తాం ,వార్షికోత్సవాన్ని మాతృదేవో భవ అనే పేరుతో జరుపుకుంటాం . ఆ రోజున మేము కొంత మంది రచయిత్రులం మా అమ్మ పేరుమీద ఒక అవార్డ్ వివిధరంగాలలో కృషి చేస్తున్న వారికి ఇస్తాం ఇప్పటి దాకా 100 మందికి పైగా ప్రముఖులు ఈ పురస్కారాలను అందుకున్నారు .నిన్న అంటే మే 1 వతారీకున లేఖిని 10 వ వార్షికోత్సవం జరుపుకున్నాం.
*అపురూప అవార్డు అందుకోబోతున్న మీకు మా విహంగ తరుపున అభినందనలు .మీరు మరిన్ని మంచి రచనలు చేయాలనీ , ఎన్నో సత్కారాలు అందుకోవాలనీ ఆశిస్తున్నాము .
నాగురించి నాలుగు మాటలు చెప్పుకునే అవకాశం ఇచ్చిన విహంగ కు నా ధన్యవాదాలు….
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Pingback: వీక్షణం-135 | పుస్తకం