ద్రవిడ దళిత జీవితాలకు అడ్డం పట్టి వారి భాషా సంస్కృతులని వెచ్చవెచ్చగా పొయ్యి గడ్డ కతలుగా నవరసభరితంగా అందించిన కథకురాలు రామక్కగారి సుమ – తన తల్లి రామక్క పేరునే తన ఇంటి పేరుగా స్వీకరించింది.
హోసూరు, ఉడుములపేటల ప్రాంతీయత, భాషామాండలికాలు ఈ కథలకి పెట్టని ఆభరణాలు. కృతకత్వం లేని సూటిదనం, అతిశయోక్తులు లేని వాస్తవికత ఈమె కథలని చదివేలా ఆసక్తి జనకంగా ఉంటాయి. అమ్మ చేతి వంటల రుచి పక్వతని గ్రామీణ జీవన సరళిలో వర్ణిస్తూ, ఓ పడచుపిల్ల ఎలా నేర్చుకుంటూ వంటలతో పాటు తన తల్లితో వున్న అనుబంధాన్ని పెనవేసి చిన్న చిన్న కథానికలుగా వర్ణించి చెప్పింది.
ఇరవై ఏళ్ళు నిండని, డిగ్రీ రెండో సం. చదువుతున్న విద్యార్ధిని హోసూరు తాలూకా లోని దేవిశెట్టిపల్లికి చెందిన సామాన్య దళిత కుటుంబంలో జన్మించి తనకి తెలిసిన బతుకులనూ, సంబంధ బాంధవ్యాలనూ, మానవ సంబంధాలను, ఆచార వ్యవహారాలను సందర్భోచితంగా మేళవిస్తూ నిత్యం ఇంటా, బయటా తాము విని, మాట్లాడుకునే మౌఖిక భాషలో కథన సాంప్రదాయoలో సాగిన చిరు కథనికలివి.
పెళ్ళిళ్ళు పేరంటాలు, అలకలు, అగచాట్లు, కోరికలు, కలలు కలబోసింది. తనకు తెలిసిన వ్యవసాయ జీవితంలోని పలిక తోలడం, మడక కట్టి సాళ్ళు పట్టడం, ఎడ్లను తోలడం లాంటి పనులన్నీ చూస్తూ రాగులు, యెర్నూగులు, అలసందలు లాంటి చిరుధాన్యాల మెట్ట సాగు చేస్తూ పడే అగచాట్లు గురించి సంధర్బోచితంగా ప్రస్తావిస్తూ తల్లి నుంచి పొందిన జ్ఞానాన్ని తన అనుభవాల రూపంలోనే చక్కగా అల్లింది. ఓ వంటకం దాని కొలతలు చెప్పడం కాకుండా, మనసు పెట్టి వండడం ఎలాగో వివరించింది సుమ. తెలుగు దనం ఉట్టిపడే వంటకాలు బొబ్బట్లు నుంచి పాల బొబ్బట్ల దాకా 31వంటకాలని మాంసాహార, శాఖాహారాలన్నింటినో ఒక్కక్కటి ఒక్కో కథగా మలచి అందించింది. సామాజిక, ఆర్ధిక, రాజకీయ అంశాలెన్నోఅలవోకగా ఆ తల్లికూతుళ్ళ మధ్య సంభాషణలో సహజంగా వెలువడతాయి. మరచిపోతున్న వంటకాలని మరుగున పడుతున్న మాటలను, సామెతలను, పదబంధాలను, పలుకు బళ్ళనూ ఏకకాలంలో వెలుగులోకి తెచ్చిన తీరు అబ్బుర పరుస్తుంది. మనకు తెలియని పదాలెన్నో పరిచయమవుతాయి. కజ్జాయలు అంటే అరిసెలు అనీ, శాస్తాలు అంటే న్యూడిల్స్ అనీ, సబచ్చి కూర అంటే సొయకూర అనీ చక్కని తెలుగు పదాలెన్నో తెలుస్తాయి. ప్రతి కథ చివరా మాండలిక పదాలకి అర్ధాలివ్వడం అన్ని ప్రాంతాలవారికి ఉపయుక్తంగా ఉంది. కళ్ళాలలో భాష పిల్లల భాషా అంటూ కథలో భాగంగానే ఆ పదాలని తులనాత్మకంగా వివరించడం చాలా సొగసుగా అమరింది. “ఒకతరం నుంచి మరో తరం అంది పుచ్చుకునే మంఛి సాంప్రదాయము” అన్న నిర్వచనం గుర్తొస్తుంది. తల్లి నుంచి తానూ పొందిన జ్ఞానాన్ని, ఆ జ్ఞాన మార్గాన్ని అదే క్రమంలో, అదే మాండలికంలో, అదే కుతూహలంతో రచించిన సుమ అభినందనీయురాలు. ఈ పుస్తకానికి సుహాసిని ముఖ పత్ర చిత్రాన్ని కూర్చింది ఆకులతో.
తెలుగు మాతృ భాషగా కలిగి మౌఖికంగానే తప్ప రాయడం రాని వీరికి అక్షరాభ్యాసం చేసి, రాత నేర్పించి వారి మౌఖిక భాష జ్ఞానాన్ని యధాతధంగా అక్షరస్తం చేయడంలో ప్రోత్సహిస్తున్న సా.వెం.రమేష్ మరియు కృష్ణ గిరి జిల్లా తెలుగు రచయతల సంఘం అభినందనీయులు.
[ఈ పుస్తకం – 100 పేజీలు , వెల – 80రూ. కొని చదవ వలసిన పుస్తకం.]
పేజీలు
లాగిన్
వర్గాలు