సాహితీ గౌతమి అధ్వర్యంలో నవంబర్ 24 వ తేదీ సాయంత్రం 6 గంటలకి రాజమండ్రి రీవర్ బే హాల్ లో డయస్పోరా కవి “కొత్త పాళీ” బ్లాగు రచయిత నారాయణస్వామితో ఆత్మీయ సమావేశం జరిగింది . ఈ సమావేశాన్నిఏర్పాటు చేసిన నారాయణ స్వామి గారి సోదరి సరస్వతి నారాయణ స్వామి గారిని సభ కి పరిచయం చేసి సాహిత్య సంస్కృతులతో తమ కుటుంబానికి గల అనుబంధాన్ని తెలియజేసారు..
తెలుగు విశ్వవిద్యాలయం డీన్ ఆచార్య ఎండ్లూరి సుధాకర్ అధ్యక్షత వహించిన ఈ సభలో రచయితలు దివాన్ చెరువు శర్మ , మహీధర రామ శాస్త్రి , ఖాదర్ ఖాన్ ,డా.పుట్ల హేమలత , ఎర్రాప్రగడ రామ కృష్ణ , పతంజలి శాస్త్రి, కోడూరి శ్రీరామ మూర్తి పాల్గొని వివిధ అంశాలపై ప్రసంగించారు .
చింతలపాటి శర్మ గారు ప్రాచీన సాహిత్యంలోని ప్రత్యేక అంశాలను ప్రస్తావించారు.ప్రబంధాలలోని వస్తు వైవిధ్యాన్ని వివరించారు. తెలుగు పద్యాల సొబగుల్ని సోదాహరణంగా వివరించారు.
మహీధర రామశాస్త్రి మాట్లాడుతూ తెలుగు ఒరియా భాషల అనుబంధాల్ని. ఆదాన ప్రదానాల్ని,ఖాదర్ ఖాన్ తెలుగు కవిత్వంలోని హస్యాని, వ్యంగ్యాన్ని వివరించారు. కోడూరి శ్రీ రామ మూర్తి మాట్లాడుతూ తెలుగు లో వచ్చిన విమర్శ, స్వరూప స్వభావాల్ని , ప్రముఖ కథా రచయిత పతంజలి శాస్త్రి మాట్లాడుతూ ఇవాళ ప్రపంచానికి ఏర్పడిన కాలుష్య ప్రమాదాల్ని గురించి ప్రసంగించారు.పుట్ల హేమలత అంతర్జాల తెలుగు సాహిత్య పత్రికలు,బ్లాగులు ,వెబ్ సైట్లు పరిణామాలను చర్చించారు. ‘కొత్తపాళీ’ నారాయణ స్వామి మాట్లాడుతూ ఇంత మంది వక్తలు ఒకే వేదిక పై ఇన్ని రకాల అంశాలపై ప్రసంగించడం ఆశ్చర్యంగా , అద్భుతంగా వుందని అన్నారు. అంతర్జాల సాహిత్యం ధోరణులను వివరించారు.
గాయకులు కె .యె . రాజు , చిత్ర భాను , ప్రవల్లిక లలిత సంగీతాన్ని వినిపించారు .
సాహితీ గౌతమీ అధ్యక్షులు పి . విజయ కుమార్ వందన సమర్పణ చేసారు .
– విహంగ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~“